Sovereign Gold Bond Scheme: ఈనెల 20 నుంచి 24 వరకు సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ అమ్మకాలు.. గ్రాముకు రూ.5,091గా నిర్ణయం..

ఈ నెల 20 నుంచి 24 వరకు ఐదు రోజుల పాటు సావరిన్‌ పసిడి బాండ్ల ఇష్యూ జరుగుతుందని రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. గ్రాము ధ‌ర రూ.5,091గా నిర్ణయించారు...

Sovereign Gold Bond Scheme: ఈనెల 20 నుంచి 24 వరకు సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ అమ్మకాలు.. గ్రాముకు రూ.5,091గా నిర్ణయం..
Follow us

|

Updated on: Jun 19, 2022 | 9:46 AM

ఈ నెల 20 నుంచి 24 వరకు ఐదు రోజుల పాటు సావరిన్‌ పసిడి బాండ్ల ఇష్యూ జరుగుతుందని రిజ‌ర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం వెల్లడించింది. గ్రాము ధ‌ర రూ.5,091గా నిర్ణయించారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే రూ.50 ప్రత్యేక తగ్గింపు ఉండనుంది. అంటే ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసేవారికి గ్రాము బంగారం రూ. 5,041కే ల‌భించనుంది. ఇక ఈ ఆర్థిక సంవ‌త్సరానికి సంబంధించి రెండో విడ‌త ప‌సిడి బాండ్లను 2022 ఆగ‌స్టు 22 నుంచి 26 వ‌ర‌కు జారీ చేయ‌నున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే రిటైల్ పెట్టుబ‌డుదారుల‌కు ఇది ఉత్తమమైన మార్గమని నిపుణుల చెబుతున్నారు. దీనిలో పెట్టుబ‌డి పెట్టడం వ‌ల్ల పెట్టుబడిదారులు తమ పెట్టుబడిపై సంవత్సరానికి 2.50 శాతం స్థిర వడ్డీని పొందడంతో పాటు, బంగారం ధ‌ర పెరిగితే ఆ లాభాన్ని కూడా పొందొచ్చు కూడా. గోల్డ్ బాండ్లను ఒక గ్రాము బంగారం ధరతో మొదలుకుని జారీ చేస్తారు. అంటే ఈ పథకంలో జారీ చేసే ఒక్కో బాండ్ ఒక గ్రాము బంగారంతో సమానం అన్న మాట.

ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ ప్రచురించిన ధర ఆధారంగా మదుపర్లు బాండ్లలో పెట్టుబడి చేయాలి. 999 స్వచ్ఛత గల బంగారం ధర స‌బ్‌స్క్రిప్షన్‌ ముందు వారం చివరి మూడు పని దినాల్లో ఉన్న ధరకు సగటు లెక్కించి ధర నిర్ణయిస్తారు. ఆన్‌లైన్లో పెట్టుబడి పెట్టి, డిజిటల్ మోడ్ ద్వారా చెల్లించే పెట్టుబడిదారులకు 50 రూపాయల డిస్కౌంటును ఆర్‌బీఐ అందిస్తుంది. దరఖాస్తుదారుడు పాన్ నంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. జారీ చేసిన ధరపై పెట్టుబడిదారులకు 2.50 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. ఆరునెలలకు ఒకసారి వడ్డీ కూడా చెల్లిస్తారు. ఈ బాండ్స్‌కు పెట్టుబడి పెట్టిన రోజు నుంచి 8 సంవత్సరాలు మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో ఇండియా బులియన్ అండ్ జ్యూయలర్స్ అసోసియేషన్ ప్రచురించిన 999 స్వచ్ఛత బంగారం, చివరి మూడు పని దినాల్లో ఉన్న ధరకు సగటు లెక్కించి దాని ప్రకారం చెల్లింపులు చేస్తారు.