ఇదెక్కడి వింత.. కోపంతో రూ.4.80 కోట్ల విరాళం! ఎవరిచ్చారు.. ఎందుకిచ్చారంటే?
శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రతిపాదించిన ‘ఓవర్పెయిడ్ సీఈఓ టాక్స్’కు వ్యతిరేకంగా గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గే బ్రిన్ భారీగా 5 లక్షల డాలర్ల విరాళం ఇవ్వడం అమెరికా టెక్ రంగంలో చర్చనీయాంశమైంది. కొత్త పన్ను విధానం వల్ల కంపెనీలు నగరాన్ని విడిచిపెట్టే ప్రమాదం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

అమెరికాలో కొనసాగుతున్న పన్నుల వివాదం మధ్య సెర్గే బ్రిన్ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు టెక్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీసింది. శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రతిపాదిత ఓవర్పెయిడ్ సీఈఓ ట్యాక్స్కు వ్యతిరేకంగా ఆయన సుమారు 5 లక్షల డాలర్లు, అంటే దాదాపు రూ.4.80 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ నిధులు వ్యాపార అనుకూల రాజకీయ కమిటీకి అందినట్లు సమాచారం.
శాన్ ఫ్రాన్సిస్కోలో జూన్ 2న జరగనున్న ఓటింగ్లో మెజర్ సి, మెజర్ డి పేరుతో రెండు కీలక పన్ను ప్రతిపాదనలు ప్రజాభిప్రాయానికి వెళ్లనున్నాయి. ఇందులో మెజర్ సి చిన్న వ్యాపారాలకు పన్ను మినహాయింపు పరిమితిని 5 మిలియన్ డాలర్ల నుంచి 7.5 మిలియన్ డాలర్లకు పెంచాలని సూచిస్తోంది. వ్యాపార సంఘాలు, వాణిజ్య వర్గాలు దీనికి మద్దతు తెలుపుతున్నాయి. అయితే మెజర్ డి తీవ్ర వివాదానికి కేంద్రబిందువైంది. ఈ ప్రతిపాదన ప్రకారం కంపెనీ సీఈఓ జీతం, ఉద్యోగుల జీతాల మధ్య ఉన్న వ్యత్యాసం ఆధారంగా అదనపు పన్ను విధించాలని భావిస్తున్నారు. ముఖ్యంగా సంస్థకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల వేతనాలను కూడా లెక్కలోకి తీసుకోవడం వ్యాపార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఈ నేపథ్యంలో గూగుల్ సహ వ్యవస్థాపకుడు బ్రిన్ ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా నిలిచారు. ఆయన ఇటీవల కాలిఫోర్నియా నుంచి పన్ను రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందిన నెవాడాకు నివాసం మార్చుకోవడం కూడా చర్చనీయాంశమైంది. సోషలిజానికి తాను వ్యతిరేకినని, సోవియట్ యూనియన్ నుంచి తన కుటుంబం ఎదుర్కొన్న అనుభవాల కారణంగా అలాంటి విధానాలపై అప్రమత్తంగా ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ఈ వివాదం అమెరికా టెక్ రంగంలో బిలియనీర్ల రాజకీయ జోక్యంపై కొత్త చర్చకు దారితీసింది. ఇప్పటికే ఖాళీ కార్యాలయాలు, కంపెనీల వలసలు, ఆర్థిక ఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న శాన్ ఫ్రాన్సిస్కోకు ఈ ఓటింగ్ కీలకంగా మారింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
