AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అయ్యా సారూ.. యాదికుందా? ఎద్దుపై తహసీల్దార్ ఆఫీస్‌కు రైతు.. Video వైరల్

ఓ రైతు తన పంట రుణమాఫీ డిమాండ్‌ను వినూత్నంగా వ్యక్తం చేశాడు. ఏకంగా ఎద్దుపై తాలూకా కార్యాలయానికి చేరుకుని అధికారుల దృష్టిని ఆకర్షించాడు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఖరీఫ్ సీజన్‌కు ముందే రుణమాఫీ అమలు అవుతుందని ఆశించిన ఆయన, ఇప్పటికీ ఎలాంటి ప్రకటన రాకపోవడంతో నిరసనకు దిగాడు. ఈ వినూత్న ఆందోళన ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది

అయ్యా సారూ.. యాదికుందా? ఎద్దుపై తహసీల్దార్ ఆఫీస్‌కు రైతు.. Video వైరల్
Maharashtra Farmer Rides Bull To Tehsil Office
Srilakshmi C
|

Updated on: Jun 25, 2026 | 1:07 PM

Share

చంద్రాపూర్, జూన్‌ 25: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో ఓ రైతు చేపట్టిన వినూత్న నిరసన అందరి దృష్టిని ఆకర్షించింది. వ్యవసాయ రుణాల మాఫీని డిమాండ్ చేస్తూ రాజూరా తహసీల్ కార్యాలయానికి ఎద్దుపై స్వారీ చేస్తూ చేరుకున్న రైతు, తన ఆవేదనను అధికారుల ముందుంచాడు. ఈ అసాధారణ నిరసన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. రాజూరా తాలూకా పరిధిలో గత కొంతకాలంగా తగినంత వర్షపాతం లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాభావం కారణంగా పంటలు దెబ్బతినడం, దిగుబడులు తగ్గిపోవడం వల్ల రైతుల ఆదాయం క్షీణించింది. మరోవైపు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులు పెరగడంతో వ్యవసాయ వ్యయం అధికమైంది. దీంతో అనేక మంది రైతులు పంట రుణాలు, వ్యక్తిగత రుణాల భారం మోస్తున్నారు.

ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ దృష్టిని ఆకర్షించేందుకు ఓ రైతు వినూత్న మార్గాన్ని ఎంచుకున్నాడు. గ్రామీణ జీవనానికి ప్రతీకగా భావించే ఎద్దుపై స్వారీ చేస్తూ నేరుగా రాజూరా తహసీల్ కార్యాలయానికి చేరుకున్నాడు. కార్యాలయ ప్రాంగణంలోకి ఎద్దుతో ప్రవేశించిన రైతు, రుణమాఫీ తప్పనిసరిగా అమలు చేయాలి అంటూ నినాదాలు చేస్తూ తన సమస్యలను అధికారులకు వివరించాడు. రైతు మాట్లాడుతూ.. వరుస పంట నష్టాలు, పెరుగుతున్న సాగు ఖర్చులు, అప్పుల భారం కారణంగా రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ రుణమాఫీ ప్రకటించి రైతులకు తక్షణ ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఈ నిరసన తహసీల్ కార్యాలయం వద్ద కొంతసేపు ఆసక్తికర వాతావరణాన్ని సృష్టించింది. అక్కడికి వచ్చిన ప్రజలు, ఉద్యోగులు రైతు నిరసనను ఆసక్తిగా గమనించారు. పలువురు రైతు డిమాండ్లకు మద్దతు తెలుపుతూ సానుభూతి వ్యక్తం చేశారు. అధికారులు రైతు వినతిని స్వీకరించి, సంబంధిత ఉన్నతాధికారులు మరియు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, రైతుల ఆర్థిక పరిస్థితి, రుణమాఫీ అంశం మరోసారి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. రైతు సంఘాలు కూడా ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకుని అప్పుల భారంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట కల్పించాలని కోరుతున్నాయి. ఎద్దుపై కార్యాలయానికి చేరుకుని చేసిన ఈ నిరసన రైతుల దుస్థితికి ప్రతీకగా నిలవడంతో పాటు, గ్రామీణ సమస్యలను ప్రభుత్వానికి గుర్తు చేసే వినూత్న సందేశంగా మారింది.

Follow Us