Ola Electric Vehicles: మొబిలిటీ నుంచి వెహికిల్ ఉత్పత్తికి.. ఓలా క్యాబ్స్‌ భారీ ప్రణాళిక.. వాహ్ అనక తప్పదు!

ఓలా.. ఈ పదం వినగానే మనకు గుర్తొచ్చేవి ఓలా క్యాబ్‌లు, ఓలా ఆటోలు.. మరికొందరికైతే ఓలా బైకులు కూడా. కానీ ఇదే ఓలా కంపెనీ ఓ భవిష్యత్ విప్లవానికి సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

Ola Electric Vehicles: మొబిలిటీ నుంచి వెహికిల్ ఉత్పత్తికి.. ఓలా క్యాబ్స్‌ భారీ ప్రణాళిక.. వాహ్ అనక తప్పదు!
Follow us

|

Updated on: Mar 08, 2021 | 4:51 PM

Ola to launch future factory soon: ఓలా.. ఈ పదం వినగానే మనకు గుర్తొచ్చేవి ఓలా క్యాబ్‌లు, ఓలా ఆటోలు.. మరికొందరికైతే ఓలా బైకులు కూడా. కానీ ఇదే ఓలా కంపెనీ ఓ భవిష్యత్ విప్లవానికి సన్నద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ సంచలనానికి వేదికగా తమిళనాడు-కర్నాటక బోర్డర్‌లోని కృష్ణగిరి కాబోతున్నట్లు తాజాగా ఇంటర్‌నెట్‌లో పిక్చర్స్ దర్శనమిస్తున్నాయి. భారత దేశంలో మొబిలిటీ సర్వీసుల్లో సెన్సేషన్‌గా నిలిచిన ఓలా ఇపుడు ఎలక్ట్రిక్ బైకుల తయారీలో ప్రపంచంలోనే మరో సంచలనంగా ఎదిగేందుకు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నట్లు కథనాలు వస్తున్నాయి. మొబిలిటీ సేవల్లో సంచలనం రేపిన ఓలా.. మరో రంగంలోను అడుగుపెట్టడమే కాదు.. అక్కడ సెన్సేషన్ అయ్యేందుకు సిద్దమవుతోంది.

మరికొన్ని ఏళ్లలో ప్రస్తుతం వినియోగిస్తున్న ఇంధనాల శకం ముగుస్తుందన్న అంఛనాల నేపథ్యంలో భవిష్యత్తు అంతా సోలార్, ఎలక్ట్రిక్ ఎనర్జీలదేనని అందరూ భావిస్తున్నారు. ఈ మార్పుని ‘ఓలా ఎలక్ట్రిక్‌’ అవకాశంగా మలచుకునేందుకు ఓలా సంస్థ సిద్ధమైంది. భారత్‌ కేంద్రంగా ప్రపంచ విద్యుత్తు వాహన మార్కెట్‌పై పట్టు సాధించేందుకు వ్యూహరచన చేసింది. అంతే కాదు.. కూలంకషంగా అధ్యయనం చేసిన తర్వాత రంగంలోకి దిగింది. ఇప్పటికే బెంగళూరు నుంచి 150 కిలో మీటర్ల దూరంలో తమిళనాడు రాష్ట్ర పరిధిలోని కృష్ణగిరి ప్రాంతంలో ‘ఓలా ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ’కి అంకురార్పణ జరిగింది. కంపెనీ సీఈవో భవిష్‌ అగర్వాల్‌ ప్రత్యేకంగా శ్రద్ద చూపుతూ ఈ ఫ్యూచర్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ వీకెండ్ ఫ్యూచర్ ఫ్యాక్టరీలోనే వుంటూ.. భవిష్యత్తు విప్లవానికి దిశానిర్దేశం చేస్తున్నారు.

బెంగళూరు-చెన్నై మార్గంలో జాతీయ రహదారి 44పై 150 కి.మీ దూరంలో తమిళనాడులోని కృష్ణగిరి అనే ప్రాంతంలో భారీ స్థాయిలో బుల్డోజర్లు, యంత్రాలు అనునిత్యం పనిచేస్తున్నాయి. సుమారు అయిదు వందల ఎకరాల్లో ఫ్యూచర్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇది భవిష్యత్తులో ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ టూ వీలర్ వెహికిల్స్ తయారీ కేంద్రానికి కేరాఫ్ అడ్రస్ కాబోతోంది. 2021 జూన్‌ నాటికి అంటే మరో మూడు నెలల్లోనే తొలి దశ పనులు పూర్తి చేసి వాహనాల తయారీ ప్రారంభించాలనే లక్ష్యంగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఫ్యూచర్ ఫ్యాక్టరీ పూర్తి స్థాయి నిర్మాణం 2022 జూన్‌ నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించి.. దానికి అనుగుణంగా చర్యలు ప్రారంభించారు. ఈ భారీ ప్రాజెక్టుపై రెండు బిలియన్‌ డాలర్లు (1.46 లక్షల కోట్ల రూపాయలు) పెట్టుబడిగా పెట్టనున్నారు.

ఎలక్ట్రిక్ టూ వీలర్ల వినియోగం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. వాటి అమ్మకాలు కూడా ఊపందుకుంటున్నాయి. ఈ ఎలక్ట్రిక్ వెహికిల్స్ మార్కెట్‌ను చేజిక్కించుకోవాలంటే ఉన్న ఏకైక మార్గం భారీ స్థాయిలో విద్యుత్తు వాహనాలను ఉత్పత్తి చేయడం. అందుకే జూన్‌ నాటికి తొలి దశ పనులు పూర్తి చేసే దిశగా సాగుతోంది ఓలా ఎలక్ట్రిక్‌. ఇక్కడ ఏడాదికి 20 లక్షల స్కూటర్లు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తయ్యి అందుబాటులోకి వస్తే సంవత్సరానికి కోటి యూనిట్లు ఉత్పత్తి కానున్నాయి. అంటే దాదాపు రెండు సెకన్లకు ఒక యూనిట్‌ను తయారు చేయనున్నారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతికతను వినియోగించాలని నిర్ణయించారు. మొత్తం 10 పూర్తి స్థాయి ప్రొడక్షన్‌ లైన్లను ఏర్పాటు చేయనున్నారు. మూడు వేల రోబోలను రంగంలోకి దింపనున్నారు. ఈ ఫ్యాక్టరీలో 10 వేల మందికి ఉపాధి కల్పించనున్నారు.

ఫ్యూచర్ ఫ్యాక్టరీని ఫ్యూచర్‌లో మరింతగా విస్తరించేందుకు ప్లాన్ వేశారు సీఈవో భవిష్‌ అగర్వాల్‌. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌తో పాటు బ్యాటరీలు, మోటార్లు, వెహికిల్ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్ వంటి వా తయారీ కూడా ఇక్కడే జరిగేలా అత్యంత భారీ ప్రణాళిక రూపొందించి.. అత్యంత పకడ్బందీగా అమలు చేస్తున్నారు భవిష్ అగర్వాల్. ఈ పరికరాలను ఓలా స్వయంగా డిజైన్‌ చేసి తమ వెహికిల్స్‌లో వాడాలని ఓలా సీఈవో నిర్ణయించారు. ఇందుకోసం భారీ స్థాయిలో పరిశోధన కార్యక్రమాలు సాగుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే 100 పేటెంట్లను కూడా ఓలా సంస్థ రిజిష్టర్ చేయించినట్లు సమాచారం. వీటిలో కొన్ని సీఈవో భవిష్‌ అగర్వాల్‌ పేరిట ఉన్నాయని తెలుస్తోంది. ఇక కంపెనీ ఇంధన అవసరాల్లో 20 శాతం సోలార్ పవర్‌ని వాడుకోనున్నారు. భవిష్యత్తుల్లో ఇక్కడి నుంచే కార్లు కూడా తయారు చేయాలన్నది సీఈవో భవిష్‌ అగర్వాల్‌ భారీ ప్రణాళికలో భాగమని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఎలక్ట్రిక్‌ వాహనాలు అనగానే ప్రస్తుతానికి గుర్తొచ్చే ఏకైక కంపెనీ టెస్లా. ఇది ఆల్‌రెడీ భారత్‌లో అడుగుపెట్టేసింది. ఈ సంవత్సరం భారత్‌లో టెస్లా కారు అందుబాటులోకి రానుందని దాని అధినేత, ప్రపంచ కుభేరుడు ఎలన్‌ మస్క్‌ కొంతకాలం క్రితం ట్వీట్‌ చేశారు. టెస్లా తయారీ కేంద్రాన్ని బెంగళూరులో ఏర్పాటు చేయనున్నట్లు కర్నాటక సీఎం యడియూరప్ప ఇప్పటికే వెల్లడించారు. అలాగే మరికొన్ని నగరాల్లో ఆర్‌ అండ్‌ డీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కంపెనీ వర్గాలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అటు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా టెస్లాకు రాయితీలిచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కార్ల సెగ్మెంట్‌లో ఓలా ఎలక్ట్రిక్‌కు టెస్లా నుంచి తీవ్రపోటీ ఎదురయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే, భవిష్‌ అగర్వాల్ మాత్రం ఈ విషయంలో చాలా ధీమాగా ఉన్నారు. ఖరీదైన, విలాసవంతమైన ఉత్పత్తులపైనే టెస్లా దృష్టిసారించనుందని తెలిపారు. ఓలా ఎలక్ట్రిక్‌ ఉత్పత్తులు మాత్రం పూర్తిగా పట్టణ ప్రాంత వాహనదారుల అవసరాలకు అనుగుణంగా ఉంటాయని తెలిపారు.

ALSO READ: బీజేపీ ఆకర్ష్‌కు భారీ స్పందన.. తృణమూల్ గూడు వీడుతూ దీదీకి పంచ్‌లిస్తున్న నాయకులు

ALSO READ: పుజారా ఎంపిక వెనుక చెన్నై పెద్ద వ్యూహం.. ధోనీ నిర్ణయానికి మేనేజ్‌మెంటు అందుకే సై అంది!