Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు అమృత్ భారత్ రైళ్లు.. ఈ రూట్లోనే సర్వీసులు.. రెడీగా ఉండండి..
తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు త్వరలో పట్టాలెక్కనున్నాయి. ఈ మేరకు రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా కొత్తగా ఏడు రైళ్లకు ఆమోదం తెలపగా.. ఇందులో రెండు రైళ్లు తెలుగు రాష్ట్రాల మీదుగా వెళ్లనున్నాయి. త్వరలోనే షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది.

తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. మరికొన్ని అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రకటించింది. దేశవ్యాప్తంగా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో ప్రయాణం సౌకర్యం కల్పించేందుకు రైల్వేశాఖ వీటిని ప్రవేశపెడుతోంది. దూర ప్రాంతాలకు ఇవి సర్వీసులుగా అందిస్తుండగా.. వీటిల్లో టికెట్ ధర చాలా తక్కువగా ఉంటుంది. దీంతో దూర ప్రాంతాలకు తక్కువ చార్జీలతో వెళ్లవచ్చు. అలాగే ఈ రైలు అత్యంత సౌకర్యవంతంగా ఉంటుంది. అయితే దేశంలో మరికొన్ని అమృత్ భారత్ రైళ్లను ప్రవేశపెట్టేందుకుక రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. మొత్త ఏడు రైళ్లను నడిపేందుకు తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు ఇవి కనెక్టివిటీని అందించనున్నాయి. దీంతో వివిధ ప్రధాన నగరాల మధ్య ప్రయాణం మరింత సులభతరం కానుంది.
తెలుగు రాష్ట్రాల మీదుగా..
ధన్ బాద్-కోయంబత్తూర్, ప్రయోగరాజ్-లోకమాన్య తిలక్ టెర్మినస్, సుబేదర్ గంజ్-లోకమాన్య తిలక్ టెర్మినస్, గోరఖ్ పూర్-ఢిల్లీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, ప్రయోగరాజ్-ఉద్నా అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, గోరఖ్ పూర్-బాంద్రా టెర్మినస్, చర్లపల్లి-గోరఖ్ పూర్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకు లైన్ క్లియర్ అయింది. వీటిల్లో చర్లపల్లి-గోరఖ్ పూర్, ధన్ బాద్-కోయంబత్తూర్ రైళ్లు తెలుగు రాష్ట్రాల గుండా ప్రయాణించనున్నాయి. ధన్ బాద్-కోయంబత్తూర్ ట్రైన్ అనేక రాష్ట్రాలను కలుపుతుంది. గోమోహ్, పరస్నాథ్, కోడెర్మా, గయా, ససారం, ప్రయాగ్రాజ్ ఛెయోకి, కట్ని, జబల్పూర్, ఇటార్సి, నాగ్పూర్, చంద్రపూర్, వరంగల్,విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాట్పాడి, సేలం, ఈరోడ్ తిరుప్పూర్ ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది.
తెలంగాణ మీదుగా రూట్ మ్యాప్
చర్లపల్లి-గోరఖ్పూర్ రైలు కాజీపేట, పెద్దపల్లి, మంచిర్యాల, బల్హర్షా, నాగ్పూర్, బేతుల్, ఇటార్సీ, భోపాల్, బీనా, ఝాన్సీ, కాన్పూర్, లక్నో, గోమతీనగర్, బారాబంకి, గోండా మీదుగా గోరఖ్పూర్ చేరుకుంటుంది. ఏడు రైళ్ల వల్ల ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఏపీ మధ్య రైలు అనుసంధానం బలోపేతం అవుతుందని రైల్వే అధికారులు భావిస్తున్నారు. రైల్వేశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశముంది. అతి త్వరలోనే టైమ్ షెడ్యూల్ ప్రకటించే అవకాశముంది. తెలుగు రాష్ట్రాల మీదుగా ఇప్పటికే అనేక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు తిరుగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలను ఇవి కలుపుతున్నాయి. త్వరలో మరో రెండు రైళ్లు కూడా అందుబాటులోకి వస్తుండటం రైల్వే ప్రయాణికులకు ఉపయోకరంగా ఉండనుంది. దీంతో ఈ రైళ్ల కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. అటు త్వరలో విశాఖపట్నం-బెంగళూరు మధ్య వందే భారత్ స్లీపర్ రైలు తీసుకొచ్చి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
