బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర ఎలా ఉంటుందో తెలిస్తే..
శతాబ్దాల క్రితమే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన మాటలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయా? సామాన్యుడికి పసిడి అందని ద్రాక్షగా మారి, భవిష్యత్తులో ప్రత్యామ్నాయ ఆభరణాల వైపు చూడాల్సిన రోజులు రాబోతున్నాయా? 2030లో బంగారం ధరలు ఎలా ఉంటాయి..? అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

భారతీయ సంస్కృతిలో బంగారినిక ఉన్న విశిష్టత వెలకట్టలేనిది. అయితే రోజురోజుకూ చుక్కలనంటుతున్న బంగారం ధరలను చూస్తుంటే.. శతాబ్దాల క్రితమే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో చెప్పిన భవిష్యవాణి గుర్తుకురావడం కామన్. కలియుగాంతంలో బంగారం ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరతాయని, పసిడి కొనుగోలు శక్తి తగ్గిపోతుందని కాలజ్ఞానంలో స్పష్టం చేశారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులు అచ్చం ఆ దిశగానే సాగుతున్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితి, రూపాయి విలువ క్షీణత, ఎగుమతి-దిగుమతి సుంకాల ప్రభావంతో దేశీయ మార్కెట్లో బంగారం ధరలు నూతన రికార్డులను నమోదు చేస్తున్నాయి. గత ఏడు దశాబ్దాల కాలాన్ని విశ్లేషిస్తే పసిడి అందించిన రాబడులు ఆశ్చర్యాన్ని కలిగిస్తియి. 1955లో 10 గ్రాముల పసిడి ధర కేవలం రూ. 79 కాగా, 1960 నాటికి రూ.111కు, 1980 నాటికి రూ.1330కి ఎగబాకింది. శతాబ్దం మారేసరికి అంటే 2000 సంవత్సరంలో రూ.4,400కి, 2010 నాటికి రూ. 18,500కి పెరిగింది. ముఖ్యంగా 2020 నుంచి పసిడి వేగం అనూహ్యంగా పుంజుకుంది. 2020లో రూ. 48,651గా ఉన్న 10 గ్రాముల రేటు, 2024లో రూ. 74,100కి, 2025లో రూ. 1.13 లక్షలకు చేరింది. 2026 నాటికి ఏకంగా రూ. 1.60 లక్షల మార్కును దాటి కొత్త శిఖరాలను అధిరోహించింది. అంటే గడిచిన ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే ధర మూడు రెట్లకు పైగా దూసుకెళ్లింది.
గ్లోబల్ మార్కెట్లలో మాంద్యం ఛాయలు, యుద్ధ వాతావరణం, ఈక్విటీ మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు ఎదురైన ప్రతిసారీ ఇన్వెస్టర్లు బంగారాన్నే ఉత్తమ సేఫ్ హెవెన్గా పరిగణిస్తారు. ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు పెద్దయెత్తున పసిడి నిల్వలను సమకూర్చుకోవడం, ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేందుకు పెట్టుబడిదారులు బంగారంలో పెట్టుబడులు పెట్టడం ధరల దూకుడుకు ఆజ్యం పోస్తున్నాయి. ప్రస్తుత మార్కెట్ వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే, రాబోయే రోజుల్లో బంగారం సగటున 12 నుంచి 15 శాతం వార్షిక వృద్ధిని కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయని ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ సమీకరణాల ప్రకారం.. 2030 నాటికి 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 2.25 లక్షల నుంచి రూ. 2.80 లక్షల స్థాయికి చేరే అవకాశాలు ఉన్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరింత ముదిరితే, తులం బంగారం ధర రూ. 3 లక్షల మైలురాయిని సునాయాసంగా తాకినా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఇలాగే ధరలు పెరిగితే భవిష్యత్తులో సామాన్యులకు బంగారం ఆభరణాలు అందని ద్రాక్షగా మారి, కాలజ్ఞానంలో ప్రస్తావించినట్లు ప్రత్యామ్నాయ లోహాలు లేదా కృత్రిమ ఆభరణాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు తప్పవన్న చర్చ మొదలైంది.
