Gas Cylinder Prices: వామ్మో.. ఒక్క గ్యాస్ సిలిండర్ ధర రూ.7 వేలు.. ఎక్కడో తెలుసా..?
దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్ విచ్చలవిడిగా జరుగుతోంది. కొరత క్రమంలో బ్లాక్లో గ్యాస్ను ఎక్కువ రేటుకు అమ్ముతూ జనాల ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. గ్యాస్ దొరకని క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లో వీరిని ప్రజలు ఆశ్రయిస్తున్నారు. ఒక్కొ సిలిండర్ ఎంతకు అమ్ముతున్నారంటే..

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దం, గల్ప్ దేశాల్లో ఉద్రిక్త వాతావరణం క్రమంలో భారత్కు గ్యాస్ సరఫరాలో అంతరాయం నెలకొంది. దీని ప్రభావంతో దేశంలో గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్యాస్ దొరక్క పడరాని పాట్లు పడుతున్నారు. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ నిలిచిపోవడంతో హోటల్స్, ఫుడ్ స్టాల్స్, రెస్టారెంట్లు బంద్ అయ్యాయి. హర్ముజ్ జలసంధి ద్వారా ఇప్పటివరకు మూడు నౌకలు రాగా.. గల్ప్ దేశాల నుంచి కూడా గ్యాస్ నిల్వలలో నౌకలు వస్తున్నాయి. అయితే పరిస్థితి సాధారణ స్థితికి రావడానికి కొద్ది రోజుల సమయం పట్టే అవకాశముంది. త్వరలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీ మొదలుపెడతామని కేంద్రం ప్రకటించింది. ఇటు డొమెస్టిక్ గ్యాస్ వినియోగదారులు కూడా గ్యాస్ బుకింగ్ చేసుకున్నా డెలివరీ అవ్వడంలో జాప్యం జరుగుతోంది.
రూ.7 వేలకు గ్యాస్ సిలిండర్
గ్యాస్ కొరత క్రమంలో బ్లాక్ మార్కెటింగ్ ఊపందుకుంది. సిలిండర్లను బ్లాక్ మార్కెట్లలో విక్రయించడం, నిల్వ చేయడం, దొంగలించడం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. అయితే బ్లాక్ మార్కెట్లో గ్యాస్ సిలిండర్లను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. కమర్షిల్ గ్యాస్ సిలిండర్ను రూ.7 వేల వరకు అమ్ముతున్నారు. ఇక 19 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ను రూ.3,500 నుంచి రూ.4 వేల వరకు బ్లాక్లో అమ్ముతున్నారు. రూ.900 నుంచి రూ. వెయ్యి మధ్య ఉండే సిలిండర్ను ఏకంగా రూ.4 వేలకు అమ్ముతుండటంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు. ఇక రూ.2 వేలకు లభించే వాణిజ్య సిలిండర్ బ్లాక్ మార్కెట్లో రూ.7 వేలకు లభిస్తోంది. అయితే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ రెగ్యులేషన్ ఆర్డర్ మరియు ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టం ప్రకారం గ్యాస్ను మళ్లించడం అనేది నేరం. అయితే కొంతమంది అక్రమార్కులు రహస్యంగా వీటిని విక్రయిస్తున్నారు. పోలీసుల నిఘా ఉన్నప్పటికీ.. ఎవరికీ తెలియకుండా అమ్ముతున్నారు.
బ్లాక్ మార్కెటింగ్
స్టవ్ రిపేర్ షాపులు, కిరాణా దుకాణాల ద్వారా విక్రయిస్తున్నారు. గ్యాస్ కొరతపై సామాన్యుల్లో నెలకొన్న భయాన్ని వీళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. ఏజెన్సీల నుంచి గ్యాస్ను పొంది బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్నారు. భారత్ ముడి చమురు 88 శాతం, సహజవాయువు 50 శాతం, ఎల్పీజీని 60 శాతం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అయితే కొరత క్రమంలో వాణిజ్య సిలిండర్ల పంపిణీ నిలిపివేసింది. ఇటీవల తిరిగి కమర్షియల్ సిలిండర్ల సరఫరాను ప్రారంభించింది. అయితే బ్లాక్ మార్కెటింగ్ను అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు, ఆకస్మిక తనిఖీలు పోలీసులు చేపడుతున్నారు. రాష్ట్రాలతో సంప్రదించి ప్రాధాన్యత క్రమంలో గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేస్తామంటూ ప్రకటించింది.
