Fuel Prices: పెట్రోల్ ధరలు ఎక్కడ రెట్టింపు.. డీజిల్ రెండున్నర రెట్లు.. భారత్లో మాత్రం ఊరట ఎందుకు?
Petrol, Diesel Prices: ఒకవేళ అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు సుదీర్ఘకాలం పాటు అధికంగానే కొనసాగితే, భారత్లో కూడా నెమ్మదిగా ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ధరలను స్థిరంగా ఉంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది..

Fuel Prices: ఇరాన్ సంక్షోభం తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరగడం ప్రపంచవ్యాప్త ఇంధన మార్కెట్పై స్పష్టంగా కనిపిస్తోంది. క్రూడ్ ఆయిల్ ధర నేటికీ 100 డాలర్ల పైనే కొనసాగుతోంది. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు 107 డాలర్లకు చేరుకుంది. ఈ పరిస్థితుల మధ్య ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను విడుదల చేశాయి.
నేటి గణాంకాల ప్రకారం.. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.94.77, డీజిల్ రూ.87.67 వద్ద అందుబాటులో ఉన్నాయి. కానీ, మన పొరుగు దేశాల్లో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
- పాకిస్థాన్: రూ.123.05
- చైనా: రూ.131.13
- శ్రీలంక: రూ.134.60
- నేపాల్: రూ.137.12
- భూటాన్: రూ.102.78
- బంగ్లాదేశ్: రూ.106.85
- మయన్మార్: రూ.147.54
ప్రపంచంలో అత్యధికంగా ధరలు ఎక్కడ పెరిగాయి?
‘గ్లోబల్ పెట్రోల్ ప్రైస్ డాట్ కామ్’ తాజా డేటా ప్రకారం.. ఆసియాలోని చిన్న అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇంధన ధరల పెరుగుదల ఎక్కువగా ఉంది.
మయన్మార్: పెట్రోల్ ధరలు 101%, డీజిల్ ధరలు 161% పెరిగాయి. ఇది ప్రపంచంలోనే అత్యధిక పెరుగుదల. లావోస్, ఫిలిప్పీన్స్, మలేషియా వంటి దేశాల్లో కూడా డీజిల్ ధరలు దాదాపు 100% పెరిగాయి. న్యూజిలాండ్, యూఏఈ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా 80-100% వరకు పెరుగుదల నమోదైంది.
భారత్లో ధరలు ఎందుకు పెరగలేదు?
ప్రపంచవ్యాప్తంగా ఇంత అలజడి ఉన్నప్పటికీ, భారత్లో పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు సున్నా శాతం (0%) గా ఉండటం ఆశ్చర్యకరం. అంతర్జాతీయ ధరల ప్రభావాన్ని ప్రభుత్వం, చమురు కంపెనీలు నేరుగా వినియోగదారులపై పడకుండా జాగ్రత్త పడ్డాయి. భారత్లో ఇంధన ధరలకు సంబంధించి ఒక “సమతుల్య వ్యూహం” (Balance Strategy) అనుసరిస్తారు. పన్నులు, సబ్సిడీలు, కంపెనీల మార్జిన్ల ద్వారా ధరలను నియంత్రణలో ఉంచుతారు. అందుకే ప్రపంచమంతా ధరలు పెరుగుతున్నా, భారత్లో మాత్రం స్థిరంగా ఉన్నాయి.
భారత్లో ధరలు పెరిగే అవకాశం ఉందా?
భవిష్యత్తులో కూడా ధరలను స్థిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏప్రిల్ 2022 నుండి భారత్లో రిటైల్ ధరల్లో పెద్దగా మార్పు రాలేదు. అంతర్జాతీయంగా ధరలు తక్కువగా ఉన్నప్పుడు ప్రభుత్వ చమురు కంపెనీలు (PSU) లాభాలను గడించాయి. ఆ లాభాలను ఇప్పుడు ధరలు పెరిగినప్పుడు నష్టాలను భర్తీ చేసేందుకు వాడుతున్నాయి. వినియోగదారుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాన్ని (Excise Duty) లీటరుకు రూ.10 వరకు తగ్గించింది.
అయితే, ఒకవేళ అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు సుదీర్ఘకాలం పాటు అధికంగానే కొనసాగితే, భారత్లో కూడా నెమ్మదిగా ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతానికి మాత్రం ధరలను స్థిరంగా ఉంచి ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇది కూడా చదవండి: Ceiling Fan: సీలింగ్ ఫ్యాన్ గంటకు ఎంత కరెంట్ వాడుతుందో తెలుసా? కళ్లు చెదిరే విద్యుత్ లెక్కలు!
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




