Namo bharat: నమో భారత్ రైలులో ఉచిత ప్రయాణం.. ప్రయాణికులు చేయాల్సింది ఇదే..!
దేశంలో అత్యంత చౌకయిన ప్రయాణ సాధనాలలో రైలు ప్రథమస్థానంలో ఉంటుంది. దీని ద్వారా దేశంలోని అన్ని వైపులకు ప్రయాణం చేయవచ్చు. టిక్కెట్ ధర తక్కువ కావడంతో అందరూ దీనికే ప్రాధాన్యం ఇస్తారు. అలాగే సురక్షితంగా, వేగవంతంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం వివిధ రాయితీలు, సబ్సిడీలు ప్రకటించింది. అయితే ఇటీవల ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కూడా కల్పించింది. అది కూడా నమో భారత్ రైలులో నచ్చిన చోటుకు వెళ్లవచ్చు. రెగ్యులర్ గా రైళ్లలో ప్రయాణించేవారికి ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. ఈ ఉచిత ప్రయాణం చేయడం కోసం రూపొందించిన నిబంధనలను ఇప్పుడు తెలుసుకుందాం.

నమో భారత్ రైలులో ప్రయాణించేవారు తమ లాయల్టీ పాయింట్లను రీడిమ్ చేసుకోవడం ద్వారా ఉచిత ప్రయాణం పొందవచ్చు. ఎన్సీఆర్టీసీ ఇటీవల ప్రవేశపెట్టిన లాయల్టీ పాయింట్ల ప్రోగ్రామ్ కింద ఈ అవకాశం లభిస్తుంది. నమో భారత్ యాప్ ద్వారా డిజిటల్ క్యూఆర్ టికెట్ను జనరేట్ చేసినప్పుడు, లేదా నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు (ఎన్సీఎంసీ)ను ఉపయోగించి ప్రయాణించినప్పుడు లాయల్టీ పాయింట్లు ప్రయాణికులకు లభిస్తాయి.
నమో భారత్ రైలులో ప్రయాణం చేసేటప్పుడు ప్రతి రూపాయికి ఒక లాయల్టీ పాయింట్ అందిస్తారు. దాని విలువ రూ.పది పైసలు ఉంటుంది. అంటే ఒక్క రూపాయి అవ్వడానికి పది పాయింట్లు అవసరం. ఇలా 300 పాయింట్లు వచ్చిన తర్వాత ప్రయాణికుడు వాటిని ఉచిత ప్రయాణం కోసం రీడిమ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రయాణానికి రూ.వంద ఖర్చు చేస్తే, అతడికి రూ.10కి సమానమైన 100 పాయింట్లు అందుతాయి. అవన్నీ అతడి ఎన్సీఎంసీ ఖాతాలో జమ అవుతాయి.
లాయల్టీ పాయింట్లను రీడిమ్ చేసుకోవడం ద్వారా ప్రయాణికులు తమ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. వారు ఎంచుకున్న స్టేషన్ల మధ్య చార్జీ ప్రకారం పాయింట్లను తీసివేస్తారు. ఒక పాయింట్ విలువ పది పైసలు కాబట్టి, 300 పాయింట్లు వచ్చాక మీ ఖాతాలో రూ.30 విలువైన లాయల్టీ పాయింట్లు ఉంటాయి. అప్పుడే వాటిని రీడిమ్ చేసుకోగలరు. అలాగే ఐదు ట్రిప్పులకు ఒకేసారి రీడిమ్ చేసుకునే నిబంధన కూడా అమల్లో ఉంది. ఈ ట్రిప్పులు ఏడు రోజుల పాటు చెల్లుబాటులో ఉంటాయి.
నమో భారత్ యాప్ ద్వారా లాయల్టీ పాయింట్లను ట్రాక్ చేసి, చాలా సులభంగా వినియోగించుకోవచ్చు. దాని కోసం ఈ కింద తెలిపిన పద్ధతులను పాటించాలి.
- ముందుగా యాప్ను తెరవాలి. కింద కనిపించే అకౌంట్ సెక్షన్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఖాతా విభాగంలోని లాయల్టీ పాయింట్లను ఎంపిక చేసుకోవాలి. దానిపై క్లిక్ చేయగానే మీకు ఎన్ని పాయింట్లు ఉన్నాయో కనిపిస్తాయి.
- ఆ పేజీలోని రీడిమ్ చేసుకునే ఆప్షన్ కూడా కనిపిస్తుంది. వెంటనే దానిపై క్లిక్ చేయాలి.
- అనంతరం మీకు నమో భారత్ ఎంపిక కనిపిస్తుంది. దాన్ని ఎంపిక చేసుకుని, మీరు ఎక్కడి నుంచి ఎక్కడకు ప్రయాణిస్తారో ఎంచుకోవాలి. ఆ రెండు స్టేషన్ల మధ్య చార్జీ మీకు కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసుకోవాలి.
- లాయల్టీ పాయింట్లను ఉపయోగించుకునే ఆప్షన్లోకి వెళితే సరిపోతుంది.
- కొత్తగా నమో భారత్ యాప్ను డౌన్లోడ్ చేసుకున్న వారికి 500 లాయల్టీ పాయింట్లు ఉచితంగా ఇస్తారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి