EPFO: ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్.. త్వరలో కొత్త పింఛన్ పథకం.. ఎవరైనా చేరవచ్చు..
ఈపీఎఫ్ఓ మరో నిర్ణయం తీసుకుంది. త్వరలో కొత్త పింఛన్ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ పథకంలో గిగ్ వర్కర్లు, ప్రస్తుతం అధిక జీతం ఉండి ఈపీఎస్ పరిధిలో లేని ఉద్యోగులు చేరవచ్చు. వీరికి ప్రత్యక ఖాతా అందించనున్నారు. ఈ ఖాతాలకు స్వచ్చంధ సంస్థలు కూడా విరాళం అందించవచ్చు.

ఈపీఎఫ్ఓ మరో పెద్ద నిర్ణయం తీసుకునేందుకు సిద్దమవుతోంది. ఈపీఎఫ్ఓ సేవలను మరింతమంది ఉద్యోగులకు విస్తరించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకు పెద్ద సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు మాత్రమే పీఎఫ్ పరిధిలో ఉన్నారు. గిగ్ వర్కర్లు, అసంఘటిత రంగాల్లో పనిచేసేవారికి పీఎఫ్ ప్రయోజనాలు లేకపోవడం వల్ల వారికి సామాజిక, ఆర్ధిక భద్రత ఉండటం లేదు. దీంతో వారికి కూడా ప్రయోజనం చేకూర్చేలా ఈపీఎఫ్ఓ విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. త్వరలో ఎంప్లాయస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఒక కొత్త పింఛను పథకాన్ని ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ పథకం ప్రస్తుత ఉద్యోగుల పింఛను పథకం (EPS) కంటే చాలా విస్తృతమైనదిగా ఉంటుంది. దీని ప్రయోజనాలు కేవలం కార్పొరేట్ ఉద్యోగులకే కాకుండా.. గిగ్ వర్కర్లకే కాకుండా అధిక జీతాల కారణంగా ప్రస్తుతం EPS నుండి మినహాయించబడిన ఉద్యోగులకు కూడా వర్తిస్తాయి.
కేంద్ర ప్రభుత్వం ‘EPFO 3.0’లో భాగంగా పీఎఫ్కు సంబంధించి అనేక నూతన మార్పులు అమల్లోకి తీసుకొస్తుంది. ఈ కొత్త పథకంలో రిటైర్మెంట్ సమ్ (TRS) అనే ఆప్షన్ తీసుకురానుంది. ఈ విధానంలో ప్రతి సభ్యునికి ఒక ప్రత్యేక పెన్షన్ ఖాతా ఉంటుంది. మీకు పదవీ విరమణ పెన్షన్ ఎంత కావాలనుకుంటున్నారో మీరే ఎంచుకోవచ్చు. దానికి అనుగుణంగా మీరు ప్రతి నెలా లేదా సంవత్సరానికి ఎంత జమ చేయాలో సిస్టమ్ ఆటోమేటిక్గా లెక్కిస్తుంది. డాష్బోర్డ్ ద్వారా మీరు పొదుపు చేసుకున్న బ్యాలెన్స్, మీ నిధుల స్టేటస్ తెలుసుకోవచ్చు. అలాగే మీరు ఎప్పుడైనా పెన్షన్ విధానంలో మార్పులు చేసుకోవచ్చు. సాధారణంగా ఉద్యోగి, కంపెనీ మాత్రమే పిఎఫ్కు డబ్బును జమ చేస్తారు. కానీ కొత్త పథకంలో అనేక మార్గాల ద్వారా డబ్బు అందుతుంది. తక్కువ ఆదాయం ఉన్న ఉద్యోగుల ఖాతాల్లో ఉద్యోగి, యజమానితో పాటు ప్రభుత్వం కూడా కొంత విరాళం అందిస్తుంది.
గిగ్ వర్కర్లకు కంపెనీలు కూడా విరాళం అందిస్తాయి. అంతేకాకుండా సిఎస్ఆర్ నిధులు, ఎన్జిఓలు, స్వచ్ఛంద సంస్థల వంటి థర్డ్ పార్టీలు కూడా డబ్బులు విరాళంగా అందించవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ఓ సరికొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ఒకే యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)కు అనేక కంపెనీలు లేదా డిజిటల్ ప్లాట్ఫారమ్లను అనుసంధానిస్తారు. దీని ద్వారా వివిధ ఉద్యోగాల PF, పెన్షన్ నిధులను ఒకే ఖాతాలో (UAN) ట్రాక్ చేయవచ్చు. ఇది ఒక సాధారణ PF పథకంలా పనిచేస్తుంది. 55 ఏళ్ల వయస్సు వరకు నిధులను పోగుచేసి, ఆ తర్వాత దానిని పింఛనుగా లేదా ఒకేసారి విడతల వారీగా విత్ డ్రా చేసుకోవచ్చు. మీరు మీ ఇష్టానుసారం మీ పింఛనును తీసుకోవచ్చు. మీ డిపాజిట్లపై వచ్చిన వడ్డీని మాత్రమే పింఛనుగా పొందితే.. మీ అసలు మొత్తం అలాగే ఉంటుంది. మీరు అధిక పింఛను కోరుకుంటే, మీరు అసలు మొత్తం నుండి కొంత మొత్తాన్ని తీసుకుని దానిని కాలక్రమేణా సర్దుబాటు చేసుకోవచ్చు.
