Ambati: పోటీ చేసే దమ్ము లేకే బహిష్కరించామని చెప్పుకుంటున్నారు.. వైసీపీ ఎమ్మెల్యే అంబటి ఎద్దేవా
పరిషత్ ఫలితాలతో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. పోటీ చేసే దమ్ము లేకే..
YSRCP MLA Ambati Rambabu: పరిషత్ ఫలితాలతో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు. పోటీ చేసే దమ్ము లేకే బహిష్కరించామని చెప్పుకుంటున్నారని అంబటి విమర్శించారు. పార్టీ అభ్యర్థుల విజయంతో తాడేపల్లిలోని వైసీపీ ఆఫీస్ దగ్గర సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ గెలుపుపై అంబటి రియాక్టయ్యారు. ఎన్నిక ఏదైనా విజయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని, రాష్ట్ర ప్రజలంతా సీఎం వైయస్ జగన్ వెంటే ఉన్నారని అంబటి అన్నారు.
వైయస్ జగన్ ప్రభుత్వానికి దీవెనలు, ఆశీస్సులు అందిస్తున్న రాష్ట్ర ప్రజలకు అంబటి రాంబాబు ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలతోనైనా చంద్రబాబు కళ్లు తెరవాలన్నారు. టీడీపీ మూసేయాలనే సంకేతం ప్రజల నుంచి బలంగా వినిపిస్తుందన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ప్రస్తుత స్థానిక సంస్థల ఎన్నికలు వాస్తవానికి చంద్రబాబు హయాంలోనే నిర్వహించాల్సి ఉండగా.. ఓటమి భయంతో నాటి బాబు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదన్నారు. 2020 మార్చిలో ప్రారంభించిన ఎన్నికల ప్రక్రియ ఈరోజు వరకు కొనసాగిందని చెప్పారు. ఎన్నికలకు చంద్రబాబు, కొన్ని దుష్టశక్తులు ఎన్నో అడ్డంకులు సృష్టించాయని, ఎన్నికలు జరిగిన తరువాత కూడా ఫలితాలు రాకుండా అడ్డుకునేందుకు టీడీపీ, జనసేన న్యాయస్థానాలను ఆశ్రయించాయని అన్నారు.
ఎట్టకేలకు అన్ని అవరోధాలను అధిగమించి ఇవాళ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు వస్తున్నాయన్నారు. ఎన్నిక ఏదైనా.. ప్రజలంతా ముఖ్యమంత్రి వెంటే అనే సంకేతం బలంగా వినిపిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ సీపీ జెండా రెపరెపలాడుతోందని అంబటి చెప్పుకొచ్చారు.
Read also: చారిత్రక ట్యాంక్బండ్లో ఖైరతాబాద్ గణేశుడి చివరి నిమజ్జనం.. మళ్లీరా బొజ్జగణపయ్య అంటూ గంగమ్మ ఒడికి