AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teachers to Ministers: రాజకీయాల్లోకి వచ్చిన మహిళ టీచర్లకు ఏకంగా మంత్రి పదవులే..!

ఏపీలో ఓ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ ట్రెండు ఇప్పుడేమి కొత్తగా మొదలైందీ కాదు..! ఓ సినిమాలో నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా.. అన్నట్లు ఇక్కడ వ్యవహారం ఉంది. అయితే ఇక్కడ అదే ట్రెండు ఫాలో అవుతూ జాక్‌పాట్ కొట్టేస్తున్నారు ఆ మహిళా నేతలు.

Teachers to Ministers: రాజకీయాల్లోకి వచ్చిన మహిళ టీచర్లకు ఏకంగా మంత్రి పదవులే..!
Women Ministers
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jun 19, 2024 | 12:51 PM

Share

ఏపీలో ఓ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఈ ట్రెండు ఇప్పుడేమి కొత్తగా మొదలైందీ కాదు..! ఓ సినిమాలో నేను ట్రెండ్ ఫాలో అవ్వను.. ట్రెండ్ సెట్ చేస్తా.. అన్నట్లు ఇక్కడ వ్యవహారం ఉంది. అయితే ఇక్కడ అదే ట్రెండు ఫాలో అవుతూ జాక్‌పాట్ కొట్టేస్తున్నారు ఆ మహిళా నేతలు. ఆ వృత్తి నుంచి వచ్చిన వారు రాజకీయాల్లో రాణించడం అందున వారందరూ మహిళల కావడం ఇక్కడ చెప్పుకోవలసిన విశేషం. ఇంతకీ ఎవరా మహిళలు.. వారికి రాజకీయాల్లో దక్కిన విశిష్టత ఏమిటి అనేదానిపై ఇప్పుడు వివరాలు తెలుసుకుందాం..!

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులుగా పనిచేసి రాజకీయాల్లోకి వచ్చిన వారు ఏకంగా మంత్రులు అయిపోతున్నారు. ఇప్పుడు ఏపీ అంతట ఇదే ట్రెండ్ నడుస్తోంది. తాజాగా హోం మంత్రి వంగలపూడి అనిత రాజకీయాల్లోకి రాకముందు ఉపాధ్యాయురాలుగా పని చేశారు. అలాగే మాజీ మంత్రి తానేటి వనిత కూడా ఎమ్మెల్యే కాకముందు కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి పీతల సుజాత సైతం ఉపాధ్యాయురాలుగా పని చేసినవారే. దాంతో టీచర్లందరూ ఏపీలో మంత్రులు అవుతున్నారనే టాక్ బాగా వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేసి అనంతరం ఎమ్మెల్యేలుగా గెలుపొంది మంత్రులవడం ఇందుకు ఉదాహరణగా చెప్పవచ్చు.

ప్రస్తుతం వంగలపూడి అనిత ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు తాజాగా చంద్రబాబు మంత్రివర్గంలో కీలకమైన హోం శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. హోంమంత్రి అనిత 2009లో ఆంధ్ర యూనివర్సిటీ నుండి ఎంఏ, ఏంఈడి పూర్తి చేసి ఉపాధ్యాయురాలుగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 28 సంవత్సరాలకే తన ఉద్యోగానికి రాజీనామా చేసి 2012 వ సంవత్సరంలో రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇక, 2014లో పాయకరావుపేట నియోజక వర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో టీటీడీ బోర్డు సభ్యురాలుగా అనిత బాధ్యతలు స్వీకరించారు.

అయితే కొన్ని రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె 2019లో పాయకరావుపేట నుంచి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2021 లో తెలుగుదేశం పార్టీ ఆమెను రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలుగా నియమించింది. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆమె తిరిగి పాయకరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ఈసారి ఆమెను అదృష్టం వరించింది. మంత్రి పదవుల్లో కీలక శాఖ అయిన హోం శాఖను అనిత దక్కించుకున్నారు.

ఇక, అదే విధంగా ఐదేళ్లపాటు సుదీర్ఘంగా మంత్రిగా పనిచేసిన తానేటి వనిత ఒకప్పుడు ఉపాధ్యాయురాలే. తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు గోపాలపురం మాజీ ఎమ్మెల్యే. 1995లో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఎంఎస్సీ, ఎంఈడి పూర్తి చేశారు మాజీ మంత్రి వనిత. తరువాత నల్లజర్లలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఆమె లెక్చరర్‌గా పని చేశారు. అయితే తండ్రి వారసత్వాన్ని స్వీకరించిన వనిత 2009లో టీడీపీ తరపున గోపాలపురం నియోజకవర్గ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత 2012లో తన ఎమ్మెల్యే పదవికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కొవ్వూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

తిరిగి 2019లో మళ్లీ కొవ్వూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు వనిత. అయితే వనితను అదృష్టం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదటి కేబినెట్ లోనే మంత్రిగా పనిచేసి అవకాశం దక్కింది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం 2022లో మంత్రివర్గ పునర్విభజనలో మరోసారి వనితను అదృష్టం వరించింది. కీలక శాఖ అయిన హోం మంత్రిగా తానేటి వనిత బాధ్యతలు చేపట్టారు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి గోపాలపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఇక మరో మాజీ మంత్రి పీతల సుజాత సైతం ఉపాధ్యాయులుగా పనిచేశారు. 2004లో తండ్రి వారసత్వంగా రాజకీయాలలోకి వచ్చి మొదటిసారి పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే ఆ తర్వాత 2009లో నియోజకవర్గ పునర్విభజనలో భాగంగా ఆచంట జనరల్ రిజర్వేషన్ కు మారిపోవడంతో ఆమె పోటీ చేయలేదు. తర్వాత 2014లో చింతలపూడి నియోజకవర్గంలో నుంచి టీడీపీ అభ్యర్థిగా పీతల సుజాత పోటీ చేసి గెలుపొందారు. అంతేకాక చంద్రబాబు నాయుడు కేబినెట్ లోనే స్త్రీ శిశు సంక్షేమ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2019, 2024 లో ఆమెకు పోటీ చేసేందుకు ఎక్కడ అవకాశం కల్పించకపోవడంతో సైలెంట్ గా ఉండిపోయారు.

ఈ గణాంకాల ప్రకారం టీచరుగా పనిచేసి అనంతరం రాజకీయాలకు వచ్చిన మహిళ నేతలు తప్పకుండా మంత్రులు అవుతారనే ట్రెండ్ బాగా ఏపీలో నడుస్తోంది. ఇక రాబోయే రోజుల్లో ఇంకెంత మంది ఉపాధ్యాయులు ఎమ్మెల్యేలుగా గెలుపొంది మంత్రులు అవుతారో చూడాలి..!

మరన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us