Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Weather: ఏపీని వీడని వానలు.. మరో అల్పపీడనం ముప్పు.. 3 రోజుల పాటు రెయిన్ అలెర్ట్

మాండూస్ తాలూకు బీభత్సం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు జనం. మాయదారి తుఫాను ఎంత పని చేసింది... ఎన్ని బతుకుల్ని ఛిద్రం చేసిందో లెక్కే లేదు. తాజాగా మరో అల్పపీడనం ముప్పు ఉందని అలెర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ.

AP Weather: ఏపీని వీడని వానలు.. మరో అల్పపీడనం ముప్పు.. 3 రోజుల పాటు రెయిన్ అలెర్ట్
Andhra Pradesh Weather Report
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 14, 2022 | 4:29 PM

మండూస్ తుఫాన్ తీరం దాటి బలహీనపడినప్పటికీ ఆ ప్రభావం ఇంకా ఏపీలో కనిపిస్తోంది. ఇప్పుడు మరో అల్పపీడన ముప్పు ముంచుకొస్తుంది. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ టోపోస్పిరిక్ ఆవరణములో ఈశాన్య, ఆగ్నేయ గాలులు వీస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం దానికి అనుకుని ఉన్న మలక్కా, సుమత్రా జలసంధి వద్ద గల ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. దీని ప్రభావంతో గురువారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం దానిని ఆనుకుని ఉన్న భూమధ్య రేఖ ప్రాంతం వద్ద ఉన్న హిందూమహాసముద్రం మీద అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది క్రమంగా పశ్చిమ దిశగా శ్రీలంక తీరం వైపు కదులుతుంది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, యానాంలలో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పలు ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని అమరావతి వాతవరణ కేంద్రం తెలిపింది.

మాండూస్ కారణంగా ఏపీకి తీవ్ర నష్టం..

ఏపీని కూడా పట్టుకు పీడించింది మాండూస్ తుఫాను. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నష్టం తీవ్రంగా ఉంది. పుత్తూరు, నగరిలో తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు మంత్రి రోజా. తడుకు వద్ద అండర్ బ్రిడ్జిలో వరద నీరు నిలిచిపోవడంతో జేసీబీ సాయంతో పనులు చేపట్టారు. అటు…పుత్తూరు రైల్వే స్టేషన్ వద్ద వర్షం తాకిడికి ఇళ్లు కూలిపోయాయి.  తిరుపతి-తిరుమల క్షేత్రాన్ని వణికించేసింది తుపాను తాకిడి. భారీ వర్షంలోనే తడుస్తూ దర్శనానికి వెళ్లారు శ్రీవారి భక్తులు. కొండ మీద నుంచి కుండపోతగా వచ్చిన నీటితో నిండా మునిగింది కపిల తీర్థం. భారీ వర్షంతో రైతులకు అపార నష్టం మిగిలింది. పొలాల్లో ఆరబోసుకున్న వరి ధాన్యం తడిసి ముద్దయిపోవడంతో లబోదిబోమంటున్నారు కాకినాడ రైతులు. నంద్యాల, మహానంది, గోస్పాడు మండలాల్లో కూడా ఇదే పరిస్థితి. తక్షణమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని దీనంగా వేడుకుంటున్నారు.

వర్షపు నీరు తగ్గిన వెంటనే పంట నష్టం అంచనాకు ఎన్యుమరేషన్ ప్రక్రియను చేపట్టింది ఏపీ సర్కార్. తుఫాన్‌పై ప్రత్యేక సమీక్ష చేపట్టి.. కీలక ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. సీఎం ఆదేశాలు మేరకు భారీ వర్షాలు పడిన ప్రాంతాల్లో వెంటనే శానిటేషన్ పనులు చేపట్టారు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల కలెక్టర్లు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని సీఎం హామి ఇచ్చారు. దీని ప్రభావం నుంచి ఇప్పుడిపపుడే బయటపడుతుంటే.. ఈ లోపే మరో అల్పపీడనం ముప్పు ఉందని వాతావరణ శాఖ చెప్పడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..