Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్‌.. నేడు భారీ వర్షాలు! మరో 4 రోజులు మరింత చలి

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో తీరం వెంబడి ఈదురుగాలులు వీయనున్నాయి. ఇక రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో చలిగాలులు మరికాస్త తీవ్రతరం కానున్నట్లు తెలిపింది..

Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్‌.. నేడు భారీ వర్షాలు! మరో 4 రోజులు మరింత చలి
Weather Report
Follow us
Srilakshmi C

|

Updated on: Dec 27, 2024 | 10:58 AM

విశాఖపట్నం, డిసెంబర్‌ 27: ఏపీ వాసులకు వాతావరణ కేంద్రం ఊరటనిచ్చే వార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం.. అల్పపీడనంగా బలహీనపడిందని వెల్లడించింది. అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనంగా కొనసాగుతున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు విస్తాయని పేర్కొంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురవనున్నాయని వెల్లడించింది. అయితే నెల్లూరు జిల్లాలో మాత్రం భారీ వర్షం కురిసే అవకాశం ముందని వాతావరణ శాఖ వెల్లడించింది.

నెల్లూరుతోపాటు పలు జిల్లాలకు భారీ వర్షాలు పొంచిఉన్నట్లు తెలిపింది. గంటకు 65 కిమీ వేగంతో గాలులు విస్తాయని, రాష్ట్రంలోని అన్ని పోర్టులకు వాతావరణ శాఖ మూడో నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది. ఈ క్రమంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపింది. మరోవైపు తెలంగాణపై కూడా అల్పపీడన ప్రభావం చూపనున్నట్లు తెల్పింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు చోట్ల చిరుజల్లులు పడుతుండగా.. రాబోయే నాలుగు రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో చలి తీవ్రత మరికాస్త పెరిగే అవకాశం ఉందని తెల్పింది. తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణా వైపు శీతలు గాలులు వీస్తున్నాయని, దీంతో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

నైరుతి బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల నేడు (శుక్రవారం) వానలు పడే సూచనలున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాదికి ఇవే చివరి వానలనీ, ఇక వచ్చే ఏడాది ఏప్రిల్‌ వరకూ భారీ వర్షాలేవీ ఉండబోవని వాతావరణ శాఖ పేర్కొనడం విశేషం. ఈ నెలాఖరు నుంచి చలిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందనీ, జనవరి 2వ వారం వరకు ఈ పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించింది.

ఇవి కూడా చదవండి

అయితే ప్రస్తుతం వానకాలం ముగిసి, శీతాకాలం కొనసాగుతుంది. సాధారణంగా ఈ కాలంలో వర్షాలు పడవు. కానీ అల్పపీడనం, వాయుగుండం, ఫెంగల్‌ తుపాన్‌ వంటి విపత్తులతో ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విలవిల్లాడింది. ఇకపై ఈ ధోరణి ఉండబోదని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక వచ్చే వేసవి కాలం వరకూ మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు, అల్పపీడనాలు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.