Andhra News: ఉదయానే పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు.. ఇంటికొచ్చి చూడగా..
విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలం జగన్నాధవలసలో విషాదం చోటుచేసుకుంది. మొబైల్ ఫోన్ ఇవ్వలేదనే మనస్తాపంతో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారంతో ఘటనపై కేసు నమెదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

మొబైల్ ఫోన్ ఇవ్వలేదనే మనస్తాపంతో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విజయనగరం జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. జగన్నాథపురానికి చెందిన వ్యవసాయ కూలీలైన రామ్ కుమార్, హేమలత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి పదహారేళ్ల అనుష్క అనే బాలిక ఉంది. ఇటీవల ఇంటర్ పరీక్షలు రాసింది. వాటిలో తక్కువ మార్కులు రావడంతో బెటర్మెంట్ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తనకు చదువుకోడానికి మొబైల్ ఫోన్ అవసరమని తన తల్లికి చెప్పింది అనుష్క.
అయితే పరీక్షల సమయంలో సెక్ ఫోన్ చూసుకుంటూ చదువుకోవడం మానేస్తావని, ఇప్పుడు చదువుకో ఫోన్ తరువాత ఇస్తామని చెప్పి ఫోన్ ఇవ్వడానికి నిరాకరించి తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిపోయారు. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొలం పనులు ముగించుకుని ఇంటికి వచ్చే సరికి తల్లిదండ్రులకు కుమార్తె ఉరికి వేలాడుతూ కనిపించడంతో షాక్కు గురయ్యారు. అప్పటికే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న అనుష్కను వెంటనే రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న విషయాలకే పిల్లలు ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకుండా, తల్లిదండ్రులు వారితో సానుకూలంగా మాట్లాడాలని, మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
