Bobbili: బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆభరణాల లెక్కింపులో వెలుగులోకి కొత్త విషయాలు.. ఆరా తీస్తున్న అధికారులు..!

బొబ్బిలి వేణుగోపాలస్వామి, శ్రీకాకుళం జిల్లా గుళ్ల సీతారాంపురం సీతారామస్వామి ఆలయ ఆభరణాల లెక్కింపులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై క్లారిటీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Bobbili: బొబ్బిలి వేణుగోపాలస్వామి ఆభరణాల లెక్కింపులో వెలుగులోకి కొత్త విషయాలు.. ఆరా తీస్తున్న అధికారులు..!
Bobbili Venugopala Swamy Temple
Follow us

|

Updated on: Aug 04, 2021 | 12:17 PM

Bobbili Venugopala Swamy Temple: బొబ్బిలి వేణుగోపాలస్వామి, శ్రీకాకుళం జిల్లా గుళ్ల సీతారాంపురం సీతారామస్వామి ఆలయ ఆభరణాల లెక్కింపులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై క్లారిటీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. అసలు అది ఎలా జరిగిందని ఆరా తీస్తున్నారు. ఆలయంలో ఆభరణాల లెక్క నాన్‌స్టాప్‌గా కొనసాగింది. అయితే, తాజా భూముల లెక్క కూడా తేల్చాలనే డిమాండ్‌లు తెరమీదకొస్తున్నాయి. దేవాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతున్న స్వామివారి ఆభరణాల లెక్కింపు.. రికార్డుల లెక్కకి సరిపోతుందా? ఏమైనా ఎక్కువ తక్కువ వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బొబ్బిలి వేణుగోపాలస్వామి వారి ఆలయ ఆభరణాల లెక్కింపు కొనసాగుతుంది. ఈ మొత్తం కార్యక్రమాన్ని రీజనల్ జాయింట్ కమిషనర్ భ్రమరాంబ ఆధ్వర్యంలో అధికారులు స్థానిక స్టేట్ బ్యాంకు లాకర్‌లో ఉన్న స్వామివారి బంగారు ఆభరణాలను ఆలయంలోని కార్యాలయానికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య పెద్ద బాక్స్‌లో భద్రపరిచిన బంగారు ఆభరణాలను రెవిన్యూ, దేవాదాయశాఖ అధికారుల సమక్షంలో ఓపెన్ చేశారు. ఆ తర్వాత మదింపు ప్రారంభమైంది.

ఆలయ రికార్డుల్లో ఉన్న బంగారు ఆభరణాలు వాస్తవంగా ఉన్నాయా లేదా? ఆభరణాలు ఏమేం ఉన్నాయన్న కోణంలో ఒక్కొక్కటిగా మదిస్తున్నారు. బంగారు ఆభరణం, దాని బరువు, విలువ మదింపులను కట్టుదిట్టంగా చేస్తున్నారు. స్వామివారికి ఎంత బంగారం ఉంది? రికార్డుల్లో ఉన్న బంగారానికి, వాస్తవానికి ఉన్న బంగారం సరిపోతుందా లేదా అన్న కోణంలో అధికారులు క్షుణ్ణంగా లెక్కలు చూస్తున్నారు. లెక్కింపులో ఆలయ ధర్మకర్తలుగా ఉన్న బొబ్బిలి రాజు, మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. తమ పూర్వీకులు కోట్ల రూపాయల బంగారు ఆభరణాలు, వేల కొద్దీ భూములు దేవుడి దూపదీప నైవేద్యాల కోసం ఇచ్చారని, వాటన్నింటినీ దేవుడికి చెందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు సుజయకృష్ణ. పూర్తిస్థాయిలో ఆభరణాల లెక్క పూర్తయిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. ఆభరణాల వివరాలతో పాటు లెక్కలు సరిపోయాయా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఇదిలావుంటే సోమవారం ఆభరణాల లెక్కింపు కొనసాగింది. బొబ్బిలి కోట బాండాగారంలో ఉన్న వెండి, ఇత్తడి వస్తువులను లెక్కించారు. రెండు ఆలయాలకు సంబంధించి సుమారు 18 కిలోల వెండి, ఇత్తడి ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. కోటలో బంగారు ఆభరణాలు పరిశీలించగా.. 300 గ్రాములు రికార్డుల కంటే ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు లెక్కింపు కొనసాగింది. ఇదే క్రమంలో సీతారామస్వామికి సంబంధించిన వెండి వస్తువులు ఆలయ బాండాగారంలో ఉండటంతో బుధవారం వాటిని లెక్కింపు చేపట్టారు.

కాగా, నాలుగు వేల ఎకరాల భూమిని తమ పూర్వీకులు ఆలయానికి ఇచ్చారని, ప్రతి ఎకరం స్వాధీనం చేసుకోవాలని కోరారు సుజయ్‌కృష్ణ రంగారావు. భూమి ఎక్కడున్నా దర్యాప్తు నిర్వహించి ఆలయానికి చెందేలా చూడాలన్నారు. కమిటీ ప్రత్యేక అధికారి భ్రమరాంబ మాట్లాడుతూ.. రికార్డుల్లో ఉన్న ఆభరణాలు పక్కగా ఉన్నాయని తెలిపారు. వేణుగోపాల స్వామికి సంబంధించి 300 గ్రాముల బంగారం అధికంగా ఉన్నట్లు తేలిందని చెప్పారు.

Read Also…

Gold Rate: వామ్మో బాబోయ్‌.. రూ.90 వేలకు చేరనున్న బంగారం ధర.. ఎప్పటి వరకు అంటే..!