Andhra Pradesh: ఏలూరు జిల్లాలో పడవ బోల్తా.. ఇద్దరు మహిళలు మృతి.. మరో నలుగురు..
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో విషాదం అలుముకుంది. ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రులో కొల్లెరు సరస్సులో పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గల్లంతుకాగా..
ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో విషాదం అలుముకుంది. ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రులో కొల్లెరు సరస్సులో పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు గల్లంతుకాగా.. ఇద్దరు మహిళలు చనిపోయారు. కొల్లేరులో తూడు కోసేందుకు కూలీలతో వెళ్లిన పడవ ఒక్కసారిగా తిరగడపడింది. దీంతో ఈ ప్రమాదం జరిగింది. మొత్తం ఆరుగురు కూలీల్లో నలుగురు ప్రాణాలతో బయటపడ్డారు. మరో ఇద్దరు నీటిలో మునిగి మృతి చెందారు.
గ్రామస్థుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులతో కలిసి గల్లంతైన వారి కోసం గాలించారు. ఇద్దరు మహిళల మృతదేహాలను బయటకు తీశారు. మృతులు శ్రీపర్రుకు చెందిన పైడమ్మ, గౌరమ్మగా పోలీసులు గుర్తించారు. ఇద్దరు మహిళల మృతితో శ్రీపర్రు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
కొల్లేరులో తూడు కోసేందుకు వెళ్లిన క్రమంలో ఈ ఘటన జరిగిందని.. ప్రాణాలతో బయటపడిన కూలీలకు స్వల్పగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏలూరు రూరల్ పోలీసులు తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..