Tirumala Electric Buses: తిరుపతిలో పరుగులు పెట్టనున్న ఎలక్ట్రిక్ బస్సులు.. టెండర్లకు ప్రభుత్వం ఆమోదం..
Electric Buses in Tirupati: ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతిలో త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన తిరుమల ఘాట్, తిరుపతి

Electric Buses in Tirumala Tirupati: ఆంధ్రప్రదేశ్ తిరుమల తిరుపతిలో త్వరలో ఎలక్ట్రికల్ బస్సులు పరుగులు తీయనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీలో అద్దె ప్రాతిపదికన తిరుమల ఘాట్, తిరుపతి అర్బన్ పరిధిలో 100 విద్యుత్ బస్సులు నడపడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఏపీఎస్ ఆర్టీసీ యాజమాన్యానికి బుధవారం ఆదేశాలు అందాయి. తిరుమల ఘాట్, తిరుపతిలో 100 బస్సులతోపాటు, విశాఖలో 100, విజయవాడ, గుంటూరు, కాకినాడలకు 50 చొప్పున మొత్తం 350 బస్సులకు ఇటీవల అయిదు లాట్లుగా టెండర్లను ఆహ్వానించారు. ఇందులో తిరుమల ఘాట్, తిరుపతి అర్బన్లో బస్సులకు ఈవీ ట్రాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఒలెక్ట్రా) ఎల్-1గా నిలిచింది. ఈ సంస్థ ప్రస్తుత ఆర్టీసీ డీజిల్ ఏసీ బస్సులకు ప్రతి కిలోమీటరుకు అయ్యే ఖర్చుకే.. విద్యుత్ బస్సులను నడిపేందుకు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు.
విద్యుత్ ఛార్జితో కలిపి కి.మీ.కి తిరుమల ఘాట్లో రూ.52.52, తిరుపతి అర్బన్ పరిధిలో రూ.44.95 చొప్పున ఆర్టీసీ ఆ సంస్థ బస్సులకు అద్దె చెల్లించనుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించడంతో ఫేమ్-2 పథకం కింద వీటికి సాయం అందించాలంటూ ఆర్టీసీ అధికారులు.. కేంద్రానికి బుధవారం సమాచారం అందించారు. అయితే.. ఈ బస్సులు నాలుగు నెలల తర్వాత రోడ్డెక్కుతాయని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే.. ఏడాదిలోగా తిరుపతికి 100 బస్సులు వస్తాయని సమాచారం.
విశాఖపట్నం, గుంటూరులోని ఈ బస్సుల టెండరులో ఈవీ ట్రాన్స్ (ఒలెక్ట్రా), విజయవాడ, కాకినాడల్లో బస్సులకు అశోక్ లేలాండ్ ఎల్-1గా నిలిచాయి. ఆర్టీసీ ఏసీ డీజిల్ బస్సులకు ప్రతి కిలోమీటరుకు అయ్యే వ్యయం కంటే అదనంగా విజయవాడ నగరంలో కి.మీ.కు రూ.10, గుంటూరులో రూ.8, కాకినాడ, విశాఖలో రూ.6 వరకు పెంచి ఈ సంస్థలు టెండర్లు వేశాయి. దీంతో ప్రభుత్వం వీటికి ఆమోదం తెలపలేదు. ఈ టెండర్లు రద్దయినట్లేనని ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయితే వీటికి సంబంధించి మళ్లీ టెండర్లు పిలిచే అవకాశం ఉంది. కాగా.. రాష్ట్రంలో వాతావరణ కాలుష్యాన్ని నివారించేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read:
