AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అనుమానం హత్యకు దారితీసింది.. ఇప్పుడు జీవిత ఖైదు శిక్ష, కానీ కొడుకు ఏమైపోయాడో చూడండి!

అనుమానంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా హత్య చేశాడు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు నిందితుడుని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి అతడికి జీవితఖైదు విధించారు. ఈ ఘటన విజయంనగరం జిల్లాలో చోటు చేసుకుంది. ఓ వైపు తల్లి హత్యకు గురికావడం, మరోవైపు, తండ్రి జైలుకు వెళ్లడంతో ఉన్న ఒక్కగానొక్క కొడుకు అనాథయ్యాడు.

అనుమానం హత్యకు దారితీసింది.. ఇప్పుడు జీవిత ఖైదు శిక్ష, కానీ కొడుకు ఏమైపోయాడో చూడండి!
Crime
Gamidi Koteswara Rao
| Edited By: |

Updated on: Mar 26, 2026 | 9:27 PM

Share

విజయనగరం జిల్లాలో భార్యను హత్య చేసిన కేసులో నిందితుడికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించిన ఘటన సంచలనంగా మారింది. దత్తిరాజేరు మండలం చుక్కపేట గ్రామానికి చెందిన వై. సత్యనారాయణ అలియాస్ సత్యం (50) తన భార్య గౌరమ్మపై అనుమానంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు. గౌరమ్మకు వేరొకరితో అక్రమ సంబంధం ఉందని సత్యం తరచూ అనుమానం వ్యక్తం చేస్తూ ఆమెతో గొడవ పడుతూ ఉండేవాడు. గత ఏడాది ఫిబ్రవరిలో పొలం పనికి వెళ్దామని చెప్పి భార్యను బయటకు తీసుకెళ్లిన సత్యం.. గుచ్చిమి సమీపంలోని తోటకు తీసుకెళ్లి కొడవలితో దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో, గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. తల్లి కనిపించకపోవడంతో అనుమానంతో కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తరువాత గజపతినగరం సీఐ రమణ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టి సాక్ష్యాలు సేకరించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించి, అనంతరం కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. విచారణ సమయంలో పోలీసులు సమర్పించిన సాక్ష్యాలు, వాంగ్మూలాల ఆధారంగా నిందితుడిపై నేరం రుజువైంది.

ఈ కేసులో తీర్పు వెలువరిస్తూ విజయనగరం ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్. పద్మావతి.. నిందితుడు సత్యనారాయణకు జీవిత ఖైదుతో పాటు మూడు వేలు జరిమానా విధించారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడించారు. తల్లి మరణించగా, తండ్రి జీవితఖైదుగా జైలు పాలవ్వడంతో ఒక్కగానొక్క కుమారుడు అనాథగా మిగిలాడు. ఈ హృదయవిదార ఘటన అందరినీ కలిచివేస్తుంది. ఈ ఘటన కుటుంబ అనుమానాలు ఎంతటి దారుణాలకు దారితీస్తాయో అని మరోసారి ఉదాహరణగా మిగిలింది. కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, ఒకరి ప్రాణాలు తీసే హక్కు మరొకరికి లేదని పోలీసులు సూచిస్తున్నారు.

Follow Us