Adimulapu Suresh: ఆదాయానికి మించిన కేసులో మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఎదురు దెబ్బ.. సీబీఐకి సుప్రీం కీలక ఆదేశాలు

Venkata Narayana

Venkata Narayana |

Updated on: Sep 02, 2021 | 1:51 PM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఆదిమూలపు సురేష్‌‌, ఆయన సతీమణి ఐఆర్‌ఎస్‌ అధికారిణి

Adimulapu Suresh: ఆదాయానికి మించిన కేసులో మంత్రి ఆదిమూలపు సురేష్‌కు ఎదురు దెబ్బ.. సీబీఐకి సుప్రీం కీలక ఆదేశాలు
Adimulapu Suresh

Follow us on

Minister Adimulapu Suresh: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏపీ విద్యాశాఖ మంత్రి, మాజీ ఐఆర్‌ఎస్‌ అధికారి ఆదిమూలపు సురేష్‌‌, ఆయన సతీమణి ఐఆర్‌ఎస్‌ అధికారిణి విజయలక్ష్మిపై ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించింది. గతంలో సీబీఐ తమపై ప్రాధమిక విచారణ జరపకుండానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని, దీన్ని కొట్టివేయాలంటూ మంత్రి సురేష్‌ దంపతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్‌ దాఖలు చేయడంతో పబ్లిక్‌ సర్వెంట్లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సుప్రీం స్పష్టం చేసింది. తాజాగా ప్రాధమిక విచారణ జరిపి కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ విక్రమ్‌ నాథ్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం నిన్న ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

కాగా, ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఆయన సతీమణి విజయలక్ష్మి ఇద్దరూ ఐఆర్‌ఎస్‌ అధికారులు. ఆదిమూలపు సురేష్‌ 2009లో రాజకీయాల్లోకి వచ్చారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంతో సీబీఐ అధికారులు 2016లో దేశవ్యాప్తంగా పలువురు ఐఆర్‌ఎస్‌ అధికారుల ఇళ్లపై దాడులు చేశారు. ఈ క్రమంలో ఆదిమూలపు సురేష్‌ సతీమణి విజయలక్ష్మిపై కేసు నమోదు చేసి, 2017లో ఎఫ్‌ఐఆర్‌ నమాదు చేశారు. దీనిలో విజయలక్ష్మిని ప్రధాన నిందితురాలిగా, ఆదిమూలపు సురేష్‌ను రెండో నిందితునిగా పేర్కొన్నారు. అయితే.. తమపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడానికి ముందు సీబీఐ ఎలాంటి ప్రాథమిక విచారణ జరపలేదని, దీనిని కొట్టి వేయాలని కోరుతూ.. సురేష్‌ దంపతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీనిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ లలితకుమారి విచారించారు.

ప్రాథమిక విచారణ చేపట్టకుండానే ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారని పేర్కొంటూ.. ఫిబ్రవరి 11న దీనిని తోసిపుచ్చింది.. అయితే.. ఈ తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. దీనిపై బుధవారం జరిగిన విచారణలో సీబీఐ తరఫున అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపించారు. అన్ని ఆధారాలతోనే సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం జోక్యం చేసుకుని.. ఆయా విషయాలను అఫిడవిట్‌లో ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది. మరోసారి ప్రాథమిక విచారణ జరిపి, తాజాగా కేసు నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో ఆదిమూలపు సురేష్‌ దంపతులను తిరిగి సీబీఐ విచారణ చేసే అవకాశం ఉంది.

Read also: TRS Flag Day: తెలంగాణ వ్యాప్తంగా గులాబీ గుమగుమలు.. అట్టహాసంగా టీఆర్‌ఎస్‌ జెండా పండుగ

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu