గుండెపోటుతో అంబులెన్స్లో అమ్మ.. కాపాడుకనే ప్రయత్నింలో కొడుకు.. కాసేపటికే ఊహించని విషాదం!
గుండెపోటుకు గురైన కన్నతల్లిని కాపాడుకునేందుకు తపన పడ్డ ఆ కొడుకును రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడింది. చివరకు ఇటు గుండెపోటుతో తల్లి, అటు రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై కొడుకు మృత్యువాతపడ్డ హృదయవిదారకరమైన ఘటన ప్రకాశంజిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటన వివరాలు తెలుసుకుంటే ఎవరికైనా హృదయం ద్రవించకమానదు.

ప్రకాశంజిల్లా కందుకూరు పట్టణంలోని సిపాయి పాలెంలో నివాసం ఉంటున్న షేక్ సాజిద్ (40) పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. అతను విధుల్లో ఉండా రాత్రి 11గంటల ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. పోన్లో కుటుంబ సభ్యులు ఏడుస్తూ తల్లి షమీమ్ (67) గుండెపోటుకు గురయ్యారని చెప్పారు. వెంటనే ఇంటికి రావాలని సమాచారం ఇచ్చారు. దీంతో సాజిద్ బైక్పై బయలుదేరి ఇంటికి చేరుకొని తల్లిని హాస్పిటల్కు తీసుకెళ్లాడు. అక్కడ సమయానికి డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో అంబులెన్స్లో మరో అసుపత్రికి తరలిస్తూ తాను బైక్పై అనుసరించాడు.
అయితే మార్గమధ్యంలో కోటారెడ్డి కూడలిలో రోడ్డు సరిగా లేక ఎదురుగా వస్తున్న మరోబైక్ తనను ఢీకొట్టడంతో సాజిద్కు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే సాజిద్ను ఒంగోలులోని ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాజిద్ మృతి చెందాడు. మరోవైపు గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన సాజిద్ తల్లి షమీమ్ కూడా మృతి చెందారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
కానిస్టేబుల్ సాజిద్కు భార్య, ముగ్గురుపిల్లలు ఉన్నారు. తల్లి విషమ పరిస్థితుల్లో ఉండగా కాపాడుకునేందుకు తాపత్రయపడి రోడ్డు ప్రమాదంలో సాజిద్ మృతి చెందిన ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకరు చనిపోయారని, మరొకరికి తెలియకుండానే ఇద్దరూ ప్రాణాలు కోల్పోవడం కుటుంబ సభ్యులతో పాటు స్థానిక జనాలను కన్నీళ్లు పెట్టేలా చేసింది.
సాజిద్ మృతికి కారణం ఎవరూ?
కందుకూరు పట్టణంలోని కోటారెడ్డి సెంటర్లో రోడ్డు విస్తరణ పనుల్లో జరుగుతున్న అలవిమాలిన నిర్లక్ష్యం కారణంగా రోడ్డుపై గుంతలు ఏర్పడి రాత్రి సమయంలో సరిగా కనిపించక కానిస్టేబుల్ సాజిద్కు ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. రోడ్డు విస్తరణ జరుగుతున్న ప్రాంతంలో ప్రమాద సూచికలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
