Rahul Gandhi: పోయిన చోటే వెతుక్కునేందుకు కాంగ్రెస్ పెద్దలు ఫిక్స్.. ! త్వరలో విశాఖలో రాహుల్ గాంధీ పర్యటన..
Rahul Gandhi Vizag Visit: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ. ఏపీలో పునర్వైభవం సాధించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం ఫలితాలను ఇవ్వడం లేదు. అయినా మళ్లీ పోయినచోటే వెతక్కువాలన్న యోచనలో ఉన్నారు ఆ పార్టీ పెద్దలు. 2024 ఎన్నికల్లో కొంతైనా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తున్నారు.

Andhra Pradesh News: రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది కాంగ్రెస్ పార్టీ. అయితే 2024 ఎన్నికల్లో కొంతైనా మెరుగైన ప్రదర్శన చేయాలని భావిస్తుంది. ఏపీలో పునర్వైభవం సాధించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం ఫలితాలను ఇవ్వడం లేదు. అయినా మళ్లీ పోయినచోటే వెతక్కువాలన్న యోచనలో ఉన్నారు ఆ పార్టీ పెద్దలు. అందుకే ఒకసారి ప్రియాంక గాంధీని లేదా రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్లో పర్యటించేలా ప్రయత్నం చేసే పనిలో పడింది. తద్వారా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం తీసుకురావాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది. అందులోనూ రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలు ఉన్న ప్రాంతంలో పర్యటింప చేయాలని ప్రణాళికలు రచిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత ఉమ్మడి రాష్ట్రం గా ఉన్నంత వరకు అత్యధికకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉనికి కోసం దశాబ్ద కాలంగా ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర విభజనని ఏమాత్రం సహించని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో స్పష్టం చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయి పదేళ్లు అయింది.
కేవలం చట్టసభల్లోనే కాదు పార్టీ పరంగా కూడా స్థానికంగా కమిటీలు వేసుకునే పరిస్థితి కూడా లేదు.. పేరుకి కొన్ని కమిటీలు వేసినా కూడా అవి ఆక్టివ్ గా లేవు. ప్రజల నుంచి కనీస సహకారం కొరవడంతో ఏమీ చేయలేని నిస్సహయ స్థితిలో పడింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో రెండు సామాజిక వర్గాలు రెండు పార్టీల మధ్య ఆధిపత్యం కొనసాగుతున్న నేపథ్యంలో మూడో సామాజిక వర్గానికి కానీ మూడో పార్టీ కానీ స్పేస్ లేని పరిస్థితి రాష్ట్రం నెలకొని ఉంది. తెలుగుదేశం – వైసీపీ ల మధ్య ఆదిపత్య పోరు కొనసాగుతుండడంతో మిగతా రాజకీయ పార్టీలకు వ్యాక్యూమ్ లేకుండా పోతోంది. అందుకే జనసేన 2014లో ఆవిర్భవించినా ఇప్పటికీ ఏమాత్రం ఉనికిని చాటలేకపోతోంది. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధ్యక్షుడు, అత్యధిక ప్రజాదరణ ఉన్న పవన్ కళ్యాణ్ నే రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్లా ఓడిపోయిన ఉదంతం కళ్ళ ముందు ఉండడం ఒక్క సీటు నెగ్గినా ఆ ఎమ్మెల్యే కూడా వైసీపీలోకి వెళ్లిపోవడంతో జనసేన కూడా ఉనికి కోసం ఆరాటపడుతుంది. అందుకే ఉనికి కోసమే జనసేన పొత్తు పెట్టుకుని పోవాల్సిన పరిస్థితి. ఇలాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మనుగడ పై అందరికంటే కాంగ్రెస్ నేతలకే అనుమానం ఎక్కువ. ఎందుకంటే కాంగ్రెస్ కేడర్ అంతా వైసీపీకి షిఫ్ట్ అయిపోయింది. ఇక కొద్దిపాటి నేతలు ఉన్నప్పటికీ కార్యకర్తలు ఎవరూ లేని పార్టీగా కాంగ్రెస్ మిగిలిపోయి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలన్న అత్యాశ ఈ తరానికి అయితే లేదు కానీ కనీసం ఉనికిని చాటుకొని ప్రత్యామ్నాయం అన్న దిశగా ప్రజలు ఆలోచించేలా ముందుకు వెళ్లాలంటే ఏం చేయాలన్నది కాంగ్రెస్ రాష్ట్ర పెద్దల ముందున్న ప్రధానమైన ప్రశ్న.




రాష్ట్రంలో విభజన తర్వాత అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను అడ్రస్ చేసేలా రాహుల్ గాంధీ పర్యటిస్తే బాగుంటుందన్న అభిప్రాయం పార్టీ రాష్ట్ర నేతల్లో ఉంది. ఇప్పటికే ప్రత్యేక హోదాకి సంబంధించి అధికారం వస్తే ఇస్తామంటూ ఒక తీర్మానాన్ని చేసింది, తరచూ రాహుల్ గాంధీ కూడా అట్లాంటి ప్రకటన చేస్తూనే వస్తున్నారు. కేవలం ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా రాహుల్ రాష్ట్రంలో పర్యటించి రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలను అడ్రస్ చేస్తూ వాటి పరిష్కారానికి పార్టీ తీసుకునే విధానపరమైన నిర్ణయాన్ని చెప్తే ప్రజల్లో కొంతైనా విశ్వాసం కలుగుతుందన్న భావన రాష్ట్ర నేతలలో నెలకొంది. అందుకే ఇటీవల ఖమ్మం వచ్చిన సందర్భంలో తిరిగి వెళ్లే సమయంలో విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ లో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలతో సమావేశమైనప్పుడు ఈ తరహా చర్చ జరిగిందట. ఆ సమయంలో రాష్ట్రంలో ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం సెంటిమెంట్ గా మారిందని రాష్ట్ర ప్రజలందరూ దాని గురించి చర్చించుకుంటున్నారని కాబట్టి స్టీల్ ప్లాంట్ కార్మికుల దీక్షలకు హాజరై స్వయంగా మద్దతు ప్రకటించి అక్కడి నుంచే ఇతర రాష్ట్ర సమస్యలను ప్రస్తావిస్తే బాగుంటుందని, రాష్ట్రంలో పార్టీ పరిస్థితి కొంతైనా మెరుగవుతుందని పార్టీ నేతలు చెప్పారట. దానికి సానుకూలంగా స్పందించిన రాహుల్ గాంధీ జూలై లేదా ఆగస్టులో వస్తానని చెప్పారట. అనంతరం ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా రాష్ట్ర నేతలతో ఈ సమస్యలపై మాట్లాడే ప్రయత్నం చేశారట.
వీలైతే జూలై నెలాఖరులో కానీ, ఆగస్టు మొదటి వారంలో కానీ విశాఖకి వచ్చి స్టీల్ ప్లాంట్ సందర్శించి కార్మికులతో ఒక పూట దీక్షలో కూర్చుని అక్కడి నుంచి రాష్ట్ర సమస్యలను అడ్రస్ చేసి తిరిగి విశాఖ నుంచి ఢిల్లీ వెళ్లే ప్రణాళికని రూపొందించాలని తన కార్యాలయాన్ని రాహుల్ కోరారని ఆ సమాచారాన్ని మాకు చేరవేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం చెబుతోంది. చూడాలి ఒకవేళ రాహుల్ పర్యటన ఖరారై స్టీల్ ప్లాంట్ కార్మికులకు మద్దతిస్తే, కాంగ్రెస్ అక్కడి నుంచి ఏదైనా స్పష్టమైన హామీలు ఇస్తే భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఒకవేళ రాహుల్ రాక ఆలస్యమైతే ప్రియాంకనైనా పంపించాలని రాహుల్ ను కోరారట. దానికి కూడా రాహుల్ సానుకూలంగా స్పందించారట. కాబట్టి జూలై నెలాఖరులకని ఆగస్టు మొదటి వారంలో కానీ రాహుల్ గాంధీ గాని లేదంటే ప్రియాంక అందుకని వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.
ఇదే అంశం పై ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ మొదట నుంచీ కార్మికుల ఉద్యమానికి మద్దతిస్తుందనీ, అక్కడకు రాహుల్ వస్తే ఉద్యమానికి మరింత ఊపు వస్తుందని తాను లేఖ రాశానని, ఆ లేఖకు స్పందనగా మొన్న విజయవాడ వచ్చినపుడు జూలై లో కానీ ఆగస్టు లో కానీ వస్తానని చెప్పారని వివరించారు. ఆ మేరకు స్టీల్ ప్లాంట్ కార్మికులతో కూడా మాట్లాడామని, త్వరలో తాను ఢిల్లీ వెళ్లి తేదీ ఖరారు చేస్తానని టీవీ9 తో స్పష్టం చేశారు గిడుగు రుద్రరాజు.
ఈశ్వర్, విశాఖ, టీవీ9 తెలుగు
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..