Rain Alert: బంగాళఖాతంలో ఉపరితల ఆవర్తనం.. రాబోయే మూడు రోజులు వర్షాలే వర్షాలు..!
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లోని పలు చోట్ల శుక్రవారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి.

నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీని ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్లోని పలు చోట్ల శుక్రవారం సాయంత్రం తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావం కారణంగా రాబోయే మూడు రోజులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారలు వెల్లడించారు.
శుక్రవారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. పనుల నిమిత్తం బయటకు వెళ్లిన ప్రజలు తడిసిముద్దయ్యారు. రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పనులకు వెళ్లి వారు తిరిగి ఇంటికి చేరుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి, కేపీహెచ్బీ కాలనీ, హైదర్నగర్, కుత్బుల్లాపూర్, సూరారం, జీడిమెట్ల, బాలానగర్, సుచిత్ర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సికింద్రాబాద్, చిలకలగూడ, మారేడ్పల్లి, ఆర్టీసీ క్రాస్రోడ్, బోయిన్పల్లి, అల్వాల్, తిరుమలగిరి, ముషీరాబాద్, చిక్కడపల్లి, విద్యానగర్, రాంనగర్ సహా తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
ఏపీలోనూ పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, వర్షంతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించారు అధికారులు. వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన రైతులు, కూలీలు, పశువుల కాపరులు వర్షం కురిసే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చెట్ల కింద నిల్చోవద్దని స్పష్టం చేశారు.




మరిన్ని వాతావరణ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లి్క్ చేయండి..
