AP News: ఆ ఇంట్లో తనిఖీ చేయాలంటూ పోలీసులకు ఫోన్.. తీరా వెళ్లి చెక్ చేయగా
కాకినాడ జిల్లా పిఠాపురంలో భారీగా మద్యం పట్టుబడింది. ఎస్ఈబీ అధికారులు, పోలీసులు ఉమ్మడిగా ఆపరేషన్ చేపట్టగా పిఠాపురంలోని నాలుగు కాలనీల్లో భారీగా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ రూ.80 లక్షలకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి...
ఏపీలో అందరి ఫోకస్ ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ముందు వరసలో ఉంటుంది. జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటమే ఇందుకు రీజన్. పిఠాపురంలో గెలుపును అటు వైసీపీ కూడా సీరియస్గా తీసుకుంది. కూటమి తరుఫున పవన్ కళ్యాణ్ బరిలో ఉండగా.. వైసీపీ తరుఫున వంగా గీత పోటీ చేస్తున్నారు. హోరాహోరీ మాటల యుద్ధం, రసవత్తర రాజకీయం సాగుతోన్న ఈ నియోజకవర్గంలో.. శుక్రవారం భారీగా లిక్కర్ పట్టుబడటం కలకలం రేపింది. పలు ఇళ్లల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు.. నాలుగు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన లిక్కర్ స్వాధీనం చేసుకున్నారు.
అక్రమంగా లిక్కర్ స్టోర్ చేశారన్న ఫిర్యాదుల ఆధారంగా.. SEB అధికారులు, పోలీసులు శుక్రవారం రాత్రి జాయింట్ ఆపరేషన్ చేశారు. ఈ సోదాల్లో నాలుగు ప్రాంతాల్లో మద్యం నిల్వలు దాచినట్లు ఐడెంటిఫై చేశారు. పిఠాపురంలోని సాలిపేట, జగ్గయ్యచెరువు, వైఎస్ఆర్ గార్డెన్, కుమారపురం కాలనీల్లో ఇల్లీగల్గా లిక్కర్ స్టోర్ చేసినట్గు పోలీసులు గుర్తించారు. ఈ ఇళ్లల్లో దాచిన రూ.80 లక్షల విలువైన లిక్కర్ బాటిల్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక ఇంట్లోనే సుమారు 2500 లీటర్ల లిక్కర్ దొరకడం గమనార్హం. వేల కొద్దీ రాయల్ బ్లూ బ్రాండ్, గోవా కిక్ లిక్కర్ బాటిల్స్ నిల్వ చేసినట్టు అధికారులు తెలిపారు. ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో లిక్కర్, డబ్బు ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలోనే విసృతంగా తనిఖీలు చేస్తున్నారు.
కాగా పవన్ కల్యాణ్ను ఓడించేందుకు ఇంత పెద్ద మొత్తంలో మద్యం దించారని పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి వర్మ ఆరోపించారు. డబ్బు, మద్యం పంపిణీ చేసి పిఠాపురంలో గెలవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని అన్నారు. పవన్ను ఓడించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…