AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: నిద్ర పట్టడం లేదా.. అయితే ఏపీలోని ఈ ప్రభుత్వాస్పత్రికి రండి

నిద్ర పట్టకపోవటం వంటి సమస్య ఎదుర్కొంటున్న వారికి దాదాపు ఎనిమిది గంటల పాటు ఈల్యాబ్ లో పరీక్ష చేస్తారు. సాధారణంగా రాత్రి సమయంలో ఈ పరీక్ష చేస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయని న్యూరాలజీ వైద్య విభాగాధిపతి సుందరాచారి చెప్పారు. 30, 40 వైర్లు రోగి శరీరంపై అంటించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

AP News: నిద్ర పట్టడం లేదా.. అయితే ఏపీలోని ఈ  ప్రభుత్వాస్పత్రికి రండి
Sleep Lab
T Nagaraju
| Edited By: Ram Naramaneni|

Updated on: Feb 09, 2024 | 7:55 PM

Share

 గుంటూరు, ఫిబ్రవరి 9: ప్రతి రోజూ ఎనిమిది గంటల పాటు నిద్ర తప్పనిసరిగా పోవాలని వైద్యులు చెబుతున్నారు. నిద్ర లేమి సమస్య కారణంగా అనేక రుగ్మతులు వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరిస్తున్నారు. మనిషి జీవిత కాలంలో సగ భాగం నిద్రకే సరిపోతుందని కూడా అంటుంటారు. అయితే కొంతమంది నిద్ర లేమి సమస్యను ఎదుర్కొంటుంటారు. నిద్ర సరిగా పట్టకపోవడంతో అనేక రోగాలకు గురవుతుంటారు. నిద్ర లేకపోవటంతో విసుగు, నిరాశ, నిస్ప్రుహ, బలహీనంగా మరిపోవడం, సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వంటి సమస్యలు వస్తాయని వైద్యులు అంటున్నారు. అయితే వీటన్నింటి నుండి ఉపసమనం లభించేలా గుంటూరు జిజిహెచ్‌లో స్లీప్ ల్యాబ్ ఏర్పాటు చేశారు. నన్నపనేని వీరయ్య చౌదరి ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొట్ట మొదటి సారిగా ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు ఆసుపత్రి సూపరింటిండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు.

నిద్ర పట్టకపోవటం వంటి సమస్య ఎదుర్కొంటున్న వారికి దాదాపు ఎనిమిది గంటల పాటు ఈల్యాబ్ లో పరీక్ష చేస్తారు. సాధారణంగా రాత్రి సమయంలో ఈ పరీక్ష చేస్తే కచ్చితమైన ఫలితాలు వస్తాయని న్యూరాలజీ వైద్య విభాగాధిపతి సుందరాచారి చెప్పారు. 30, 40 వైర్లు రోగి శరీరంపై అంటించి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల సమయంలో టెక్నిషియన్ తో పాటు వైద్యులు కూడా ఉండి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలను పరీశిలిస్తారన్నారు. ఈ పరీక్షల అనంతరం నిద్ర లేమి కారణాలను నిర్ధారించవచ్చారు. తద్వారా చికిత్స అందించడం సులభంగా మారుతుందన్నారు.

సాధారణంగా కొంతమందికి రాత్రి సమయాల్లో నిద్ర పట్టదని అటువంటి వారు పగటి సమయంలో నిద్ర పోతుంటారని దీని వలన అనేక సమస్యలు వస్తాయంటున్నారు వైద్యులు. కాఫీ , టీలు ఎక్కువుగా తీసుకునే వారిలో కూడా నిద్ర లేమి సమస్య ఉంటుందన్నారు. మరొకొంత మంది నిద్రలో లేచి నడవడం, సైకిల్ తొక్కినట్లు కాళ్లు కదిలించడం, ఫిట్స్ రావడం వంటి లక్షణాలతో నిద్ర పోవడానికి భయపడుతుంటారన్నారు. వీరిందరికి వైద్య పరీక్షలు చేసి సుఖంగా నిద్రపోవడానికి చికిత్స అందిస్తామని వైద్యురాలు అరుణ కుమారి చెప్పారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్లీప్ ల్యాబ్ జిజిహెచ్ ఏర్పాటు చేశామని ఆమె చెప్పారు. స్లీప్ డిజార్డర్ ఉన్న వారు జిజిహెచ్‌కు వచ్చి ఉచితంగా పరీక్షలు చేయించుకోవచ్చని చెప్పారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..