Jr NTR: అక్కడ.. ఇక్కడ.. ఎక్కడ చూసినా.. ‘తారక’ మంత్రమే.. రాజకీయాల్లో ఇదో హాట్ టాపిక్..
ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాల్లో ఎక్కడ చూసినా..తారక్ మంత్రం కనిపించింది. అటు మహానాడులో జూనియర్ ఎన్టీయార్ జెండాలు కనిపించగా, ఇటు హైదరాబాద్ ఎన్టీయార్ ఘాట్లో ఫ్యాన్స్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇక విజయవాడలో డైరెక్టర్ వర్మ తారక్ ఒక్కడే అసలైన మగాడంటూ సెన్సేషనల్ కామెంట్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్.. ఏపీ, తెలంగాణలో ఈ పేరు మార్మోగుతోంది. మొన్న హైదరాబాద్లో జరిగిన ఎన్టీయార్ శతజయంతి ఉత్సవాల్లో వ్యక్తిగత కారణాలతో జూనియర్ ఎన్టీయార్ పాల్గొనలేదు. రాజమండ్రిలో జరిగిన మహానాడుకు వెళ్లలేదు. అయితే.. ఈ రెండు కార్యక్రమాలకు తారక్ వెళ్లకున్నా.. అక్కడ జూనియర్ మేనియా కనిపించింది. మహానాడులో బాలకృష్ణ మాట్లాడుతున్నంతసేపూ జూనియర్ ఎన్టీయార్ జెండాలు ప్రత్యక్షమయ్యాయి. అభిమానులు మహానాడు ప్రాంగణంలోనే ఎన్టీయార్ జెండాలు ఎగురవేయడం అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది.
ఇక హైదరాబాద్లో ఎన్టీయార్ ఘాట్ దగ్గర తాతయ్యకు జూ.ఎన్టీఆర్ నివాళులర్పించారు. ఆ సమయంలో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో హడావుడి చేశారు. సీఎం ఎన్టీఆర్ అంటూ ఫుల్ జోష్ తో నినాదాలు చేశారు.
ఇక విజయవాడలో NTR విఙ్ఞాన ట్రస్ట్, దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శత జయంతి సభ ఏర్పాటు చేసారు. ఈ సభకి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, పోసాని కృష్ణమురళి, ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జీవీ సెన్సేషనల్ కామెంట్ చేశారు. హైదరాబాద్లో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనకపోవడంపై తారక్కి థ్యాంక్స్ చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడే అసలైన మగాడన్నారు ఆర్జీవీ.
మొత్తానికి అక్కడ.. ఇక్కడ.. ఎక్కడ చూసినా.. జూనియర్ ఎన్టీయార్ ఫ్యాన్స్ తారక్మంత్రం పఠించారు. అయితే, తారక్ మాత్రం అలాంటిదేమి లేకుండా సైలెంట్ గా కనిపించారు. అటు తాత శతజయంతి ఉత్సవాల్లో.. ఇటు మహానాడు తారక్ మంత్రం.. ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..