Andhra Pradesh: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. ప్రభుత్వం ఏం చెప్పిందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పండుగ ప్రారంభం కానుంది. ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్పై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా లిఫ్ట్ చేసింది చంద్రబాబు సర్కార్. ఆగష్టు 19 వ తేదీ నుంచి 31 తేదీ వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పై నిషేధం తాత్కాలికం ఎత్తివేస్తునట్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పండుగ ప్రారంభం కానుంది. ఉద్యోగుల ట్రాన్స్ఫర్స్పై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా లిఫ్ట్ చేసింది చంద్రబాబు సర్కార్. ఆగష్టు 19 వ తేదీ నుంచి 31 తేదీ వరకూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల పై నిషేధం తాత్కాలికం ఎత్తివేస్తునట్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసింది. పారదర్శక విధానంలో బదిలీలు జరగాలని ఆదేశించింది. రాజకీయ జోక్యం లేకుండా మెరిట్ ప్రకారమే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేసినట్టు సమాచారం.
మే నెలలోనే జరగాలి కానీ..
వాస్తవానికి ఉద్యోగుల సాధారణ బదిలీలు ప్రతీ ఏటా మే నెలలో జరగాలి. ఈసారి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మేలో బదిలీలు జరగకపోవడం, కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సెటిల్ అవ్వడానికి రెండు నెలలు పట్టింది. ఈలోపు ఉన్నత అధికారుల బదిలీలు పూర్తయిన నేపథ్యంలో తాజాగా సాధారణ బదిలీలపై దృష్టి సారించింది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
మొత్తం 15 శాఖల్లో బదిలీలు
మొత్తం 15 శాఖల్లో బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెవెన్యూ, పంచాయితీ రాజ్, పురపాలక, గ్రామ వార్డు సచివాలయలు, గనులు, పౌర సరఫరాలు, అన్ని ప్రభుత్వ శాఖల్లోని ఇంజినీరింగ్ ఉద్యోగులు, దేవాదాయ, అటవీ, రవాణా, పరిశ్రమలు, విద్యుత్, వాణిజ్య పన్నులు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలోని ఉద్యోగుల బదిలీలకు అనుమతిచ్చింది.
ఉపాద్యాయులు, వైద్య సిబ్బంది కి నో..
మరోవైపు ఉపాధ్యాయులు, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు దూరంగా ఉన్నారు. వీళ్ళను అకడమిక్ సంవత్సరం ప్రారంభం కాకముందే బదిలీలు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అకడమిక్ ప్రారంభమై రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో ఈ సమయంలో మారిస్తే, అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. దీంతో ప్రజా సంబంధిత సేవల్లో ఉండే శాఖల్లో మాత్రమే బదిలీలకు అనుమతించినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ నెలాఖరు లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నెలాఖరు తర్వాత మళ్లీ బదిలీలపై నిషేధాన్ని విధించనుంది.
ఏజెన్సీలో రెండేళ్లు చేస్తే చాలు
ఎక్సైజ్ శాఖలో బదిలీలకు సెప్టెంబర్ 5 నుంచి 15వరకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏజెన్సీ ఏరియాల్లో రెండేళ్ల పాటు పని చేసిన ఉద్యోగులకూ బదిలీలను వర్తింపచేస్తారు. ఉద్యోగి లేదా కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్య కారణాలు ఉన్నా బదిలీలకు దరఖాస్తు చేసుకోవచ్చని గైడ్ లైన్స్ లో స్పష్టం చేసింది ప్రభుత్వం. అంధులైన ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. వారు కోరుకున్న చోటకు బదిలీ చేసే వెసులుబాటు కల్పించారు. భార్యాభర్తలు ఉద్యోగులైతే ఒకే ఊళ్లో పోస్టింగ్ లేదా సమీప ప్రాంతాల్లో పోస్టింగులకు అవకాశమిచ్చింది ప్రభుత్వం.
యూనియన్ ఆఫీస్ బేరర్స్ విషయంలో స్ట్రిక్ట్ గైడ్ లైన్స్
అదే సమయంలో ఉద్యోగ సంఘాలు ఇచ్చే ఆఫీస్ బేరర్ల లెటర్లపై ప్రత్యేక సూచనలు చేసింది ప్రభుత్వం. ఆఫీస్ బేరర్లుగా ఉన్న ఉద్యోగులకు తొమ్మిదేళ్ల పాటు బదిలీల నుంచి మినహాయింపు ఉంటుంది. ఇందుకోసం తాలూకా, జిల్లా స్థాయిల్లో ఆఫీస్ బేరర్ల లేఖలను జిల్లా కలెక్టర్లకు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర స్థాయి ఆఫీస్ బేరర్ల లేఖలను జీఏడీకి పంపాలని సూచించింది. ఆఫీస్ బేరర్ల లేఖలకు జిల్లా కలెక్టర్లు, జీఏడీ ఆమోదం తర్వాతే బదిలీల నుంచి వెసులుబాటు ఉంటుందని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. పరిశీలన తర్వాత కూడా పరిపాలనపరంగా అవసరం అనిపిస్తే తొమ్మిదేళ్ల కాల పరిమితి ముగియక పోయినా ఆఫీస్ బేరర్లను బదిలీలు చేయొచ్చని కూడా ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది ప్రభుత్వం.
రాజకీయ జోక్యం నో..
ఇదే సమయంలో బదిలీలు మార్గదర్శకాలకు అనుగుణంగా అత్యంత పారదర్శకంగా జరగాలని ముఖ్యమంత్రి ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చారట. ఎక్కడా అవినీతి కానీ, రాజకీయ జోక్యం గాని లేకుండా చూడాలని… అలాంటివి ఉంటే ఆ బదిలీలని రద్దు చేయాలని కూడా హెచ్చరించారట సీఎం చంద్రబాబు. దీంతో పూర్తిగా మెరిట్ ప్రకారమే బదిలీలు ఉండబోతున్నాయని స్పష్టమైన సంకేతాలు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆగస్ట్ నెలాఖరు వరకు ఇక అన్ని శాఖల్లో బదిలీల పండగే జరగబోతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..