డాక్టర్ నిర్వాకం..! గర్భసంచి ఆపరేషన్ కోసం వెళితే… ఊపిరి ఆగిపోయేలా చేశాడు..!

బాధితురాలు రాధమ్మ పూర్తిగా కోలుకునే వరకు అయ్యే ఖర్చు అంతా డాక్టర్ రమణ నాయక్ భరిస్తారని డీఎం అండ్ హెచ్ ఓ హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ డాక్టర్ అయ్యుండి... ప్రైవేట్ ఆసుపత్రి నడిపించడంపై డాక్టర్ రమణ నాయక్ పై విచారణ జరుపుతామన్నారు... అసలే ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే... డాక్టర్ పనికిమాలిన ట్రీట్మెంట్ తో కొత్త రోగం వచ్చి పడింది అంటున్నారు బాధితురాలి బంధువులు..

డాక్టర్ నిర్వాకం..! గర్భసంచి ఆపరేషన్ కోసం వెళితే... ఊపిరి ఆగిపోయేలా చేశాడు..!
Doctor Negligence
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Sep 25, 2024 | 12:05 PM

కొండ నాలుకకు ఒక మందేస్తే… ఉన్న నాలుక ఊడటం అంటే ఇదేనేమో….. ఒక వైద్యం కోసం వెళితే.. ఇంకో ట్రీట్మెంట్ చేసి పంపించాడు ఆ డాక్టర్. అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలోని ఓ డాక్టర్ నిర్వాకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గర్భసంచి ఆపరేషన్ కోసం వెళితే… మూత్రనాళాన్ని తొలగించాడట డాక్టర్ రమణ నాయక్… అనంతపురం జిల్లా కూడేరు మండలం హంసాయపల్లికి చెందిన రాధమ్మ అనే మహిళ అనారోగ్యంతో అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చింది. రాధమును పరీక్షించిన వైద్యుడు గర్భసంచిలో సమస్య ఉందని… ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన పరికరాలు లేవని… ఆపరేషన్ చేయడం కుదరదని చెప్పాడు. తన ప్రైవేటు ఆసుపత్రికి వస్తే ఆపరేషన్ చేస్తానని ప్రభుత్వ డాక్టర్ రమణ నాయక్… బాధితురాలు రాధమ్మకు తెలిపాడు. దీంతో ఈనెల 9వ తేదీన రమణ నాయక్ కు చెందిన లావణ్య ఆసుపత్రిలో రాధమ్మకు ఆపరేషన్ చేసి… అదేరోజు డిశ్చార్జ్ చేశారు.

డిశ్చార్జ్ అయిన తర్వాత రెండు రోజులు మూత్రం రాకపోవడంతో.. తిరిగి రమణ నాయక్ ఆసుపత్రికి వచ్చిన బాధితురాలు రాధమ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. రాధమ్మకు పరీక్షలు చేయగా…తప్పు జరిగిందని తెలుసుకుని..అసలు విషయం చెప్పకుండా.. బాధితురాలు రాధమ్మను హుటాహుటిన మరో ఆసుపత్రికి తరలించాడు. వేరే ప్రైవేటు ఆసుపత్రిలో పరీక్షలు చేయగా… అసలు విషయం బయటపడింది. రెండు రోజులుగా మూత్రం రాక.. కిడ్నీ వాచిందని సదరు ప్రైవేట్ ఆసుపత్రి డాక్టర్లు రాధమ్మకు, ఆమె కుటుంబ సభ్యులకు అసలు విషయం చెప్పారు. దీంతో లావణ్య ఆసుపత్రిలో డాక్టర్ రమణ నాయక్ అసలు గర్భసంచి ఆపరేషన్ చేయలేదని… దానికి బదులు మూత్రం తొలగించారని బాధితురాలు రాధమ్మ కుటుంబ సభ్యులు తెలుసుకున్నారు. గర్భసంచి ఆపరేషన్ కు బదులు… మూత్ర నాళం తొలగించారన్న విషయం బయటపడడంతో… ఆగ్రహంతో బాధితురాలి బంధువులు లావణ్య హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు.

ఈ వీడియోపై క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి

నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేసిన డాక్టర్ రమణ నాయక్ పై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు రాధమ్మ కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేశారు. ఇంత ఘనకార్యం చేసిన డాక్టర్ రమణ నాయక్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. బాధితురాలు రాధమ్మ, బంధువుల ఆందోళనతో డిఎం అండ్ హెచ్ ఓ స్పందించారు. బాధితురాలు రాధమ్మ పూర్తిగా కోలుకునే వరకు అయ్యే ఖర్చు అంతా డాక్టర్ రమణ నాయక్ భరిస్తారని డీఎం అండ్ హెచ్ ఓ హామీ ఇచ్చారు. అదేవిధంగా ప్రభుత్వ డాక్టర్ అయ్యుండి… ప్రైవేట్ ఆసుపత్రి నడిపించడంపై డాక్టర్ రమణ నాయక్ పై విచారణ జరుపుతామన్నారు… అసలే ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతుంటే… డాక్టర్ పనికిమాలిన ట్రీట్మెంట్ తో కొత్త రోగం వచ్చి పడింది అంటున్నారు బాధితురాలి బంధువులు…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..