టీడీపీ వర్సెస్ వైసీపీ.. సీఎం సొంత జిల్లాలో మామిడి రచ్చ.. మాజీ సీఎం పర్యటనపై ఆంక్షలు!
సీఎం సొంత జిల్లాలో మామిడి రచ్చ పీక్స్కు చేరుకుంది. మాజీ సీఎం జగన్ జిల్లా పర్యటన పొలిటికల్గా అగ్గి రాజేస్తోంది. వైసీపీ నీచ రాజకీయాలు చేస్తోందని ఆరోపిస్తున్న కూటమి మామిడి రైతుల విషయంలో జగన్ చేస్తున్నది అనవసర రార్థాంతం అంటోంది. ఏ అర్హతతో జగన్ వస్తున్నారని ఆరోపిస్తున్న జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు జగన్ జిల్లాకు వస్తే నిలదీసి ప్రశ్నిస్తామంటున్నారు. ఇక రైతుల కోసమే జగన్ జిల్లాకు వస్తున్నారంటున్న వైసీపీ నేతలు జగన్ను చూస్తే కూటమి నాయకులకు అంత భయం ఎందుకంటున్నారు. జగన్ పర్యటన రద్దంటూ కూటమి అబద్ధపు ప్రచారం చేస్తోందని ఆరోపిస్తున్న వైసీపీ నేతలు జగన్ రావడం ఖాయం, రైతులను కలవడం ఖాయం అంటున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మధురమైన పంట ఇప్పుడు రాజకీయాలను ఘాటుగా మార్చింది. సీఎం సొంత జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ వార్ సృష్టించింది. ఈ ఏడాది విస్తారంగా సాగుచేసిన మామిడి.. దిగుబడిలోనూ అదే దూకుడు ప్రదర్శించడంతో మామిడి రైతుకు గిట్టుబాటు ధర సమస్యగా మారింది. జిల్లాలోని మామిడి గుజ్జు పరిశ్రమల వద్ద రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్న పరిస్థితికి కారణం అయ్యింది. పల్ప్ పరిశ్రమలు వద్ద బారులు తీరుతున్న మామిడి ట్రాక్టర్లు రైతు కష్టాన్ని వెలుగెత్తి చాటడంతో రాజకీయ పార్టీల మధ్య రచ్చ మొదలైంది. ప్రధానంగా టిడిపి, వైసిపి మధ్య మాటల యుద్ధంకు కారణం అయ్యింది. మామిడి రైతును ఆదుకోవడంలో, గిట్టుబాటు ధర కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యిందంటూ వైసిపి రోడ్డు ఎక్కడంతో సమస్య పొలిటికల్ ఇష్యూగా మారింది. జిల్లాలో మామిడి రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నిస్తుండగానే మరోవైపు రాజకీయ విమర్శలు జిల్లాలో మ్యాంగో ఫైట్ కు కారణం అయ్యాయి.
తోతాపురి మామిడిని కొనుగోలు చేసే పల్ప్ పరిశ్రమల నుంచి టన్ను కు రూ.8 వేలు, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకంగా టన్నుకు రూ.4 వేలు చెల్లించేలా ప్రభుత్వం చొరవ చూపింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగం శ్రమిస్తోంది. గత 3 వారాలుగా ఇదే పనిలో జిల్లా అధికారులు ఉండగా మరోవైపు సీఎం కూడా మామిడి రైతుల సమస్యలపై ఆరా తీశారు. ఈ మేరకు కుప్పంలో మామిడి రైతులు, అధికారులు, గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి సమస్యకు పరిష్కారం చూపే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే మామిడి సేకరణకు నిధులు ఇవ్వాలంటూ కేంద్రానికి సీఎం లేఖ రాయడం, చిత్తూరు తిరుపతి అన్నమయ్య జిల్లాల కలెక్టరేట్లలో కంట్రోల్ సెంటర్లు ఏర్పాటు చేసి మామిడి కొనుగోళ్లపై రోజువారి సమీక్షలు చేయాలని ఆదేశించడం లాంటి చర్యలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఓపక్క ప్రభుత్వ చర్యలు కొనసాగుతుండగా మామిడి రైతుల కష్టాలు జిల్లాలో మామిడి రచ్చను కంటిన్యూ చేస్తున్నాయి. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేల్చుతున్నాయి. ఇందులో భాగంగానే ఈ నెల 9న పూతలపట్టు నియోజకవర్గంలో మాజీ సీఎం జగన్ పర్యటన ఖరారు కావడం కాక రేపుతోంది. మామిడి రైతుల కష్టాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గిట్టుబాటు ధర లభించని పరిస్థితులతో పాటు రైతులను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్ వస్తుండడంతో వైసీపీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
జగన్ ది పరామర్శ యాత్ర కాదు విధ్వంస యాత్ర.
అయితే జగన్ జిల్లా పర్యటనను తప్పుపడుతున్న కూటమి నేతలు.. జిల్లాకు జగన్ వస్తే నిలదీసి ప్రశ్నిస్తా మంటున్నారు. ఏ అర్హతతో జగన్ బంగారు పాళ్యెం పర్యటనకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. 5 ఏళ్ల వైసీపీ హయంలో ఏ రోజు మామిడి రైతులను గురించి మాట్లాడని జగన్ ఇప్పుడెందుకు వస్తున్నారని పూతలపట్టు టిడిపి ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రశ్నిస్తున్నారు. రైతులను రాజకీయాల కోసం వాడుకోవడం వైసీపీకే చెల్లిందంటున్నారు. జగన్ ది పరామర్శ యాత్ర కాదు, విధ్వంస యాత్ర అని ఆరోపిస్తున్నారు టిడిపి ఎమ్మెల్యేలు మురళీమోహన్.
జగన్ ను అడ్డుకోలేరు. రావడం ఖాయం.
ఇదిలా ఉండగా చిత్తూరు జిల్లా మామిడి రైతాంగాన్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో మామిడి రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. మామిడి రైతుకు ఇంతటి దారుణమైన పరిస్థితి జిల్లాలో ఎప్పుడూ రాలేదని మండిపడుతున్నారు. చిత్తూరు జిల్లాలో అవస్థలు పడుతున్న మామిడి రైతుల కోసం బంగారు పాల్యంకు మాజీ సీఎం జగన్ వస్తున్నారని.. ఆ భయంతోనే కూటమి నేతలు జగన్ పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు కలిగించినా జగన్ రావడం ఖాయం, రైతులను కలవడం ఖాయమన్నారు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు.
జగన్ కు రైతుల గురించి ఏం తెలుసు.
ఇక జగన్ చిత్తూరు జిల్లా పర్యటనను తప్పుపడుతున్న రాష్ట్ర మంత్రులు. మామిడి రైతుల గురించి జగన్కు ఏమి తెలుసని ప్రశ్నిస్తున్నారు. జగన్ దండయాత్రకు వస్తున్నట్లు వస్తున్నారని రాష్ట్రమంత్రి సత్య కుమార్ యాదవ్ ఆరోపిస్తున్నారు. పరామర్శకు అయితే 10 మందితో వస్తే చాలని.. మామిడి రైతులకు సపోర్టు ప్రైస్ ఎప్పుడూ ఇవ్వని వైసీపీ పల్ప్ యూనిట్ల అండతో నాటకాలు ఆడు తోందని ఆరోపిస్తున్నారు. గతంలో రెండు సార్లు మామిడి రైతులకు ప్రోత్సాహక ధర టిడిపి ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నారు.
చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు, గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్నారంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. సీఎం చంద్రబాబు రైతుల పట్ల ముసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఆరోపిస్తున్నారు. పరిశ్రమల యాజమాన్యం ద్వారా కిలో మామిడి రూ. 12 లకు కొనుగోలు చేయించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. పరిశ్రమలెందుకు మామిడి కొనుగోలు చేయరని ప్రశ్నస్తున్నారు. కిలోకు రూ.4లు ఇస్తాం రూ. 8 ఇస్తామని రైతులకు భిక్ష వేస్తారా అంటూ నారాయణ మండిపడ్డారు. మరోవైపు జగన్ పర్యటనలు ప్రజలకు సమస్యగా మారుతున్నాయని ఆయన ఆరోపించారు. ఓదార్పులు, పరామర్శలకు ఎవరైనా వెళ్లచ్చని, బలప్రదర్శన కోసం రావద్దంటున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించ వద్దని.. రాజకీయాల కోసం రైతులను వాడుకోవద్దని కోరుతున్నారు.
జగన్ పర్యటనకు ఆంక్షలు.
మరోవైపు ఈనెల 9 న జగన్ పర్యటన కు అనుమతించిన పోలీసులు ఆంక్షలు విధించారు. బంగారుపాళ్యం మార్కెట్ యార్డ్ వద్దకు 500మందికి, హెలిప్యాడ్ వద్దకు 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. ఎలాంటి ర్యాలీలు, రోడ్ షోలు చేయకూడదన్న నిబంధన పెట్టారు. ఈ నేపధ్యంలో జిల్లాలో జగన్ పర్యటన, వ్యతిరేకిస్తున్న టిడిపి ఎమ్మెల్యేల ప్రకటనలతో సీఎం సొంత జిల్లాలో మ్యాంగో ఫైట్ ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




