AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: సూడి పశువులపై పైశాచిక దాడి.. గర్భంతో ఉన్న గేదెల కాళ్లు నరికిన కిరాతకులు

తూర్పుగోదావరి జిల్లాలె దారుణం చోటు చేసుకుంది. నిడదవోలు మండలం సూరాపురంలో గుర్తుతెలియని దుండగులు గర్భంతో ఉన్న రెండు గేదెల కాళ్లను నరికి అమానుషానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో ఒక గేదె మృతి చెందగా, మరో గేదె ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనతో పాడి రైతు కన్నీరుమున్నీరవుతుండగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు..

Watch: సూడి పశువులపై పైశాచిక దాడి.. గర్భంతో ఉన్న గేదెల కాళ్లు నరికిన కిరాతకులు
Cruel Attack On Buffalo In East Godavari
B Ravi Kumar
| Edited By: |

Updated on: Jul 16, 2026 | 11:07 AM

Share

ఏలూరు, జులై 16: మానవ సంబంధాలు ఎంతలా దిగజారుతున్నాయో చెప్పేందుకు, మనుషుల మధ్య ఉండే పగ ప్రతీకారాలకు అమాయక మూగజీవాలు బలవుతున్న తీరుకు నిదర్శనంగా నిలిచే ఒక అమానుష ఘటన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలంలో చోటుచేసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకుంటున్న పాడి పశువులపై గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని రేపింది. సూరాపురం గ్రామానికి చెందిన ఉడతల అమ్మిరాజు అనే పాడి రైతు జీవనాధారం కోసం గేదెలను పెంచుకుంటున్నారు. ఎప్పటిలాగే మంగళవారం సాయంత్రం తన పశువులను పాకలో కట్టేసి ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. అయితే, అదే రోజు అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తుతెలియని దుండగులు అమ్మిరాజుకు చెందిన పశువుల పాకలోకి చొరబడ్డారు. గర్భంతో ఉన్న (సూడి) రెండు గేదెల కాళ్లను పదునైన ఆయుధాలతో అత్యంత అమానుషంగా నరికివేశారు.

బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో రైతు అమ్మిరాజు పాక వద్దకు వచ్చి చూడగా, అక్కడ కనిపించిన దృశ్యం ఆయన గుండెల్ని పిండేసింది. తాను ప్రాణప్రదంగా చూసుకునే మూగజీవాలు రక్తపు మడుగులో పడి కొట్టుకుంటూ కనిపించాయి. తీవ్ర రక్తస్రావం కావడం వల్ల దుండగుల దాడికి గురైన రెండు గేదెలలో ఒక సూడి గేదె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. కాళ్లు తెగిపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న మరొక గేదెను చూసి ఆ పాడి రైతు కన్నీరుమున్నీరుగా విలపించాడు. ‘మాపై పగ ఉంటే మమ్మల్ని కొట్టాలి కానీ, ఏ తప్పూ ఎరుగని మూగజీవాలను ఇంత క్రూరంగా హింసిస్తారా?’ అంటూ అమ్మిరాజు గుండె పగిలేలా రోదించిన తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.

ఈ దారుణ ఘటనపై సమాచారం అందుకున్న గ్రామస్తులు, పశుపోషకులు అక్కడికి చేరుకుని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న రెండో గేదెను తక్షణ చికిత్స నిమిత్తం తణుకు పశు వైద్యశాలకు తరలించారు. కాగా, నిందితుల దాడిలో మృతి చెందిన, గాయపడిన ఈ గేదెల విలువ సుమారు రూ. 2 లక్షల వరకు ఉంటుందని బాధితుడు పేర్కొన్నాడు. ఈ అమానుష ఉదంతంపై పాడి రైతు అమ్మిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిడదవోలు మండల పరిధిలోని సూరాపురంలో జరిగిన ఈ దారుణానికి ఒడిగట్టిన అపరిచిత వ్యక్తుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సమాజంలో పెరుగుతున్న క్రూరత్వానికి అద్దం పడుతున్న ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక పశుపోషకులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us