Honour killing: కొంప ముంచిన మేనకోడలి ప్రేమ వ్యవహారం.. మేనమామ దారుణ హత్య
కొడుకు ప్రేమ కోసం ఓ తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. వరుసకు మేన కోడలు అయ్యే ఓ యువతిని తన కొడుకు గాడంగా ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న ఓ తండ్రి ఆ యువతితో తన కొడుకుకు పెళ్లి చేయాలనుకున్నాడు. ఈ విషయం అమ్మాయి వాళ్ల ఇంట్లో తెలియడంతో ఆ తండ్రిని నమ్మించి అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి చంపేశారు. ఈ ఘటన కొమురంభీం జిల్లా రెబ్బెన మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

కొమురంభీం, జులై 16: మేనకోడలు ప్రేమ వ్యవహారానికి సహకరిస్తున్నాడనే అనుమానంతో.. స్వామి అనే మేనమామను అత్యంత కిరాతకంగా హత్య చేశారు కుటుంబ సభ్యులు. కొమురంభీం జిల్లా రెబ్బెన మండలం నారాయణపూర్ ఎస్సీ కాలనీలో చోటు చేసుకుంది. సీఐ ఎం. సంజయ్ తెలిపిన వివరాల ప్రకారం..
మండలంలోని నారాయణపూర్ ఎస్సీ కాలనీకి చెందిన వేమునూరి స్వామి (45), దేవా దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. స్వామి సోదరి అయిన లక్ష్మి , స్వామి సోదరుడైన మల్లేష్ ల కొడుకు బిడ్డలు ఇద్దరు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వరుసకు బావమరదల్లు కావడంతో స్వామి కూడా వారిద్దరి ప్రేమకు మద్దతు తెలిపారు. అయితే మేనమామ వరుసయ్యే స్వామి తన చెల్లెలు వైష్ణవి ప్రేమకు సహకరిస్తున్నాడని మేనమామ స్వామిపై కక్ష పెంచుకున్నారు వైష్ణవి బ్రదర్స్. స్వామి సోదరుడు మల్లేష్ కుమారుడైన సమ్మయ్య (సన్నీ) ని పలు మార్లు మందలించారు కూడా. ఈ ప్రేమ వ్యవహారంలో ఇరు కుటుంబాల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు, పంచాయితీలు జరుగుతున్నాయి. ఈ నెల 13న రాత్రి 10 గంటల సమయంలో వైష్ణవి అదే కాలనీలోనే నివాసముంటున్న సమ్మయ్య ఇంటికి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న కాగజ్ నగర్ మండలం రాస్పెల్లిలోని గెర్రగూడకు చెందిన ఆమె మేనమామలు.. ఇరిగిరాల తిరుపతి, ఇరిగిరాల వెంకటేశ్ లు మరో 13 మందితో కలిసి 14వ తేదీ తెల్లవారుజామున గ్రామానికి వచ్చి కోడలిని వెంట తీసుకెళ్లారు.
అదే రోజు అర్ధరాత్రి.. మళ్లీ స్వామి ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు ‘వైష్ణవి మళ్లీ ఇంటి నుంచి పారిపోయింది. ఆమె తల్లిదండ్రులు కూడా వెతుకుతున్నారు.. నువ్వు కూడా రావాలంటూ స్వామిని వెంట తీసుకెళ్లారు. అయితే బుధవారం ఉదయం వరకు కూడా స్వామి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. తిరుపతి, వెంకటేశ్ లకు ఫోన్ చేశారు. ఆ ఇద్దరు నుండి స్పందన లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు స్వామి కుటుంబసభ్యులు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇదే క్రమంలో రెబ్బన మండలం కొమురవెల్లికి వెళ్లే దారిలో చెట్ల పొదల్లో స్వామి రక్తపు మడుగులో శవమై కనిపించాడు. మెడ వెనక భాగంలో పదునైన ఆయుధాలతో నరికిన గాయాలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు హత్యగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానితులైన తిరుపతి, వెంకటేశ్ ల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు. మేనమామ స్థానంలో ఉండి అన్న కొడుకు, అక్క బిడ్డ ప్రేమ వ్యవహారానికి అండగా నిలవడమే స్వామి చేసిన పాపమా అంటూ స్వామి కుటుంబ సభ్యులు బోరున విలపించారు.
