Andhra: ఓర్నీ.. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ కలిసి ఇంత పని చేశారు ఏంటి..?
ఆ తెలుగు ఎన్ఆర్ఐకి మనువాడే వయసొచ్చింది. దీంతో పద్దతైన పిల్ల కోసం మ్యాట్రీమోనిని ఆశ్రయించాడు. అతను చేసిన ఆ పని తీవ్ర ఇబ్బందుల్లో పడేసింది. ఫేక్ ప్రొఫైల్తో అన్నాచెల్లెల్లు సీన్లోకి వచ్చి.. రూ.2.83కోట్లు దోచేశారు. ఆలస్యంగా మోసాన్ని గ్రహించిన ఆ యువకుడు భారత్కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఏపీకి చెందిన యువకుడు అమెరికాలోని నార్త్ కరోలినాలోని ఓ కంపెనీలో ఐటీ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్నాడు. 2023లో అతనికి మ్యాట్రీమోనీలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నివాసి బర్కా జైస్వానీ అనే యువతి పరిచయం అయింది. కొంతకాలానికి వాట్సాప్ నంబర్లు మార్చుకున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ఆ యువతి అతనితో బాగా దగ్గరయింది. కొన్నాళ్ల తర్వాత నుంచి తన ప్రణాళికను అమలు చేసింది. ఆరోగ్యం బాలేదని, విదేశాలకు వెళ్లాలని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని కుంటి సాకులు చెబుతూ.. యువకుడి నుంచి దఫాల వారీగా డబ్బులు గుంజింది.
అలా 2023 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు రూ.2.68 కోట్ల సొమ్ము తన ఖాతాల్లో, ఇతర బంధువుల ఖాతాల్లో జమ చేయించుకుంది. ఇప్పటివరకు ఆమెను చూడకపోవడంతో… వీడియో కాల్కి రావాలని ఆ యువకుడు ఆమెను బలవంతం చేశాడు. వీడియో కాల్ లో అందుబాటులోకి వచ్చిన అమ్మాయి.. మ్యాట్రిమోనీలోని ప్రొఫైల్లో ఉన్న యువతి వేరువేరుగా అనిపించడంతో.. అనుమానం కలిగింది. నగదు తిరిగి ఇవ్వాలని కోరగా.. ఆ యువతి స్పష్టమైన సమాధానాలు చెప్పలేదు. దీంతో ఆ యువకుడు అమెరికా నుంచి ఇండోర్కు వచ్చి పోలీసులకు తన సమస్యను వివరించాడు. దర్యాప్తు చేపట్టగా క్రైమ్ వివరాలు వెల్లడయ్యాయి. ఆ మహిళ పేరు సిమ్రన్ అని, ఆమెకు అప్పటికే వివాహం అయినట్లు విచారణలో వెల్లడైంది. మ్యాట్రీమోనీలో ఓ మోడల్ ఫొటో పెట్టి తన సోదరుడు విశాల్తో కలిసి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి దర్యాప్తు చేపట్టారు.