ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై స్పందించిన నిమ్మగడ్డ.. ఘాటుగా సమాధానం ఇచ్చిన రమేష్ కుమార్..!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసుపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పందించారు.

ప్రివిలేజ్ కమిటీ నోటీసులపై స్పందించిన నిమ్మగడ్డ.. ఘాటుగా సమాధానం ఇచ్చిన రమేష్ కుమార్..!
Follow us

|

Updated on: Mar 19, 2021 | 7:15 PM

ap sec nimmagadda replied:  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ నోటీసుపై ఏపీ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్పందించారు. తాను కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నానని, విచారణకు హాజరు కాలేనని… ప్రివిలేజ్‌ కమిటీకి సమాచారం అందించారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫిర్యాదుతో అసెంబ్లీ ప్రివిలేజ్‌ కమిటీ ఇచ్చిన నోటీసుకు సమాధానం ఇచ్చారు. తనకు నోటీసులు జారీ చేసే పరిధి ప్రివిలేజ్‌ కమిటీలోకి రాదని, తనపై ఆరోపణలకు ఆధారాలు చూపించాలని కోరారు. అసెంబ్లీపై, సభ్యులపై తనకు పూర్తి గౌరవం ఉందని రమేష్‌కుమార్‌ తన సమాధానంలో పేర్కొన్నారు.

గత కొంతకాలంగా ఏపీలో రాష్ట్ర సర్కార్ వర్సెస్ ఎస్ఈసీ మధ్య వివాదం కొనసాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణతో మొదలైన పంచాయితీ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వాన్ని ఎదురించి మరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఎన్నికలను వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం కోర్టుల చుట్టూ తిరిగిన ఫలితం లేకపోయింది. చివరికి ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం నమోదుచేసుకుంది. అయినప్పటికీ, ఎస్ఈసీపై వెనకు తగ్గడం లేదు వైసీపీ ప్రభుత్వం.. ఆయనకు ప్రివిలేజ్ నోటీసులు పంపించి, కమిటీ ముందు హాజరు కావాలని కోరింది.

దీంతో తనకు వచ్చిన ప్రివిలేజ్ నోటీసులపై ఘాటుగానే స్పందిస్తూ సమాధానం చెప్పారు ఎస్ఈసీ. ప్రస్తుతం తాను కరోనా వ్యాక్సిన్ తీసుకున్నానని.. ఈ కారణంగా కొన్నాళ్లు పాటు బయట ప్రయాణాలు చేయడం లేదన్నారు. అందుకే ప్రివిలేజ్ నోటీసులు వచ్చినా ప్రస్తుతం తాను బయటకు వచ్చే పరిస్థితి లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై హౌస్ అరెస్ట్ చేయాలని ఎస్ఈసీ ఆదేశాలు జారీ చేశారు. తమను అవమానపరిచేలా ఎస్ఈసీ వ్యవహరించారని మంత్రి పెద్దిరెడ్డి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై రెండు సార్లు సమావేశమైన ప్రివిలేజ్ కమిటీ చర్చించింది. ఈ విషయమై వివరణ ఇవ్వాలని ఏపీ ఎస్ఈసీ రమేష్ కుమార్‌కు ఈ నెల 18న నోటీసులు జారీ చేసింది.

అంతేకాదు ప్రివిలేజ్ నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నోటీసుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమాధానం ఇచ్చారు. తాను ఎక్కడా ఎమ్మెల్యేల హక్కులకు భంగం కలిగించలేదని స్పష్టం చేశారు. అయినా తాను ప్రివిలేజ్ కమిటి పరిధిలోనికి రానని వివరణ ఇచ్చారు. అసెంబ్లీపై తనకు అత్యున్నత గౌరవం ఉందన్నారు. ఇంకా ప్రభుత్వం ఈ విషయంపై ముందుకు వెళ్లాలి అని నిర్ణయించుకుంటే పూర్తి ఆధారాలతో సరైన సమయంలో స్పందిస్తానని ఆయన తేల్చి చెప్పారు.

ఎస్ఈసీ సమాధానంపై అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి. ఎస్ఈసీ ఇచ్చిన సమాధానంతో ప్రివిలేజ్ కమిటీ ఊరుకుంటుందా? ఇంకా ముందుకు వెళ్లి మరోసారి నోటీసులు జారీ చేస్తుందో చూడాలి.

Read Also…  తప్పు ఎవరు చేసిన శిక్ష తప్పదు.. చంద్రబాబు, వైఎస్ జగన్‌లపై బీజేపీ చీఫ్ వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు