Vijayawada: ఏదిఏమైనా గన్నవరం నుంచే పోటీ చేస్తా.. ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ హాట్ కామెంట్స్..
Vijayawada: గన్నవరంలో పార్టీ పరిస్థితి బాగోలేని సమయంలో పాదయాత్ర ద్వారా ఇంటింటికీ తిరిగి కొత్త వైభవం తెచ్చానన్నారు. వంశీ పార్టీలో చేరిన సమయంలో సీఎం జగన్ తనను కానీ.. దుట్టా రామచంద్ర రావును గానీ పిలిచి మాట్లాడలేదన్నారు. ఓ ఇద్దరు మంత్రులు వంశీని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి పార్టీలో చేర్చారని ఆరోపించారు. వంశీతో కలిసి పనిచేయాలని, ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం చెప్పినా తీసుకోలేదని యార్లగడ్డ చెప్పుకొచ్చారు. ఏదేమైనా 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయడం ఖాయమని..
![Vijayawada: ఏదిఏమైనా గన్నవరం నుంచే పోటీ చేస్తా.. ఆత్మీయ సమావేశంలో యార్లగడ్డ హాట్ కామెంట్స్..](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/yarlagadda-venkata-rao.jpg?w=1280)
విజయవాడ, ఆగస్టు 14: కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తన అనుచరులు, వైసీపీ కార్యకర్తలతో కలిసి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం బలప్రదర్శనకు వేదికగా మారింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాలను కార్యకర్తల సమావేశంలో ప్రస్తావించిన ఆయన, తమను ఓడించిన వ్యక్తితోనే సంధి ఏంటంటూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై తీవ్ర విమర్శలు చేశారు. గన్నవరంలో పార్టీ పరిస్థితి బాగోలేని సమయంలో పాదయాత్ర ద్వారా ఇంటింటికీ తిరిగి కొత్త వైభవం తెచ్చానన్నారు. వంశీ పార్టీలో చేరిన సమయంలో సీఎం జగన్ తనను కానీ.. దుట్టా రామచంద్ర రావును గానీ పిలిచి మాట్లాడలేదన్నారు. ఓ ఇద్దరు మంత్రులు వంశీని సీఎం జగన్ వద్దకు తీసుకెళ్లి పార్టీలో చేర్చారని ఆరోపించారు. వంశీతో కలిసి పనిచేయాలని, ఎమ్మెల్సీ ఇస్తానని సీఎం చెప్పినా తీసుకోలేదని యార్లగడ్డ చెప్పుకొచ్చారు. ఏదేమైనా 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేయడం ఖాయమని స్పష్టం చేశారు.
విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని పార్టీలోని ఓ పెద్ద మనిషి కోరారని.. గన్నవరం నియోజకవర్గాన్ని మాత్రం వదులుకోనని ఆ నేతకు తెలియజేసినట్లు యార్లగడ్డ చెప్పారు. టీడీపీ నుంచి వచ్చిన ముగ్గురు నాయకులకు ఎమ్మెల్సీ పదవులిచ్చిన పార్టీ అధిష్టానం.. దుట్టా రామచంద్ర రావుకు మాత్రం ఎందుకు ఇవ్వలేదని యార్లగడ్డ ప్రశ్నించారు. రెండేళ్ల నుంచి గన్నవరం నియోజకవర్గంలో పరిస్థితులపై సీఎం జగన్ను కలవాలని ప్రయత్నిస్తున్నా.. అవకాశం ఇవ్వలేదన్నారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పటికీ తనపైన, స్థానిక కార్యకర్తలపై పెట్టిన కేసులన్నీ అలాగే ఉన్నాయని.. పార్టీ కోసం పనిచేసిన వాళ్లను నిర్లక్ష్యం చేయోద్దని యార్లగడ్డ కోరారు. వచ్చే ఎన్నికల్లో తనకు గన్నవరం టిక్కెట్ ఇవ్వాలని ఆత్మీయ సమ్మేళనం వేదికగా జగన్ను యార్లగడ్డ అడిగారు. టిక్కెట్ ఇవ్వకపోతే.. ప్రజలే తన భవిష్యత్ నిర్ణయిస్తారని కుండబద్ధలు కొట్టారు. అలాగే గన్నవరం నుంచే పోటీ చేస్తా కానీ వంశీతో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కలిసి ప్రయాణం చేసే అవకాశమే లేదని ఖరాఖండీగా చెప్పారు.
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/accident-video-visuals-post-by-sajjanar.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/pawan-kalyan-15.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/skin-care.jpg)
![Image](https://images.tv9telugu.com/wp-content/uploads/2023/08/chandrayaan-3-vs-luna-25.jpg)
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..