AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Rains: ఏపీకి మరో పిడుగులాంటి వార్త.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. తాజా వెదర్ రిపోర్ట్

దిత్వా తుపాను ప్రభావంతో ఇప్పటికే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. గూడూరులో వర్షం దంచి కొడుతోంది. చిల్లకూరు జాతీయ రహదారి నీటమునిగింది.

AP Rains: ఏపీకి మరో పిడుగులాంటి వార్త.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన.. తాజా వెదర్ రిపోర్ట్
Andhra Weather Report
Ravi Kiran
|

Updated on: Dec 04, 2025 | 1:45 PM

Share

నైరుతి బంగాళాఖాతంలోని వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి పశ్చిమ దిశగా కదులుతోందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇది ఈ రోజు అల్పపీడనంగా బలహీనపడుతుందని వెల్లడించింది. ఈ ప్రభావంతో తమిళనాడులో మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతాయని వెల్లడించింది. ఏపీలో గురువారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రకాశం, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

దిత్వా తుపాను ప్రభావంతో ఇప్పటికే శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు లో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. గూడూరులో వర్షం దంచి కొడుతోంది. చిల్లకూరు జాతీయ రహదారి నీటమునిగింది. గూడూరులో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. గూడూరు, పారిచర్లవారి పాలెం, విందూరుకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పంబలేరు, ఉప్పుటేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి, వాకాడు బ్యారేజ్ 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. గూడూరు దైవాలదిబ్బ నుంచి స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

తిరుపతి జిల్లాలో బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. జిల్లాలోని బాలాయపల్లిలో 10.8 సెం.మీ, డక్కిలిలో 11.2 సెం.మీ వర్షపాతం నమోదైంది. తిరుపతి జిల్లాలో వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయి. బాలాయపల్లిలో నేరేడు వాగు పొంగి రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. బాలాయపల్లి మండలంలో కైవల్య నది కాజ్‌వేపై వరద ప్రవహిస్తోంది. దీంతో నిండలి-వెంకటరెడ్డిపల్లి మధ్య పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గూడూరు డివిజన్‌లోని 14 మండలాల పరిధిలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇక్కడ వరద ప్రవాహం 20 వేల క్యూసెక్కులకు చేరింది.