Andhra Pradesh: కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!

అమ్మభాషకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇకపై ఏపీలో ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో వెలువడనున్నాయి. తెలుగుభాష పరిరక్షణకు అందరూ కృషి చేయాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఒక ఖైదీ పెరోల్‌కు సంబంధించిన ఉత్తర్వులను తెలుగులో విడుదల చేసింది ఏపీ హోం శాఖ.

Andhra Pradesh: కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్.. ఇక యాక్షన్ షురూ..!
Ap Go In Telugu
Follow us
Eswar Chennupalli

| Edited By: Ravi Kiran

Updated on: Feb 05, 2025 | 2:46 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను (జీవోలు) ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ జారీ చేయాలని నిర్ణయించింది. సాధారణ పరిపాలన శాఖ (GAD) అన్ని శాఖలకు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. ముందుగా ఇంగ్లీష్‌లో ఉత్తర్వులు జారీ చేసి, వాటిని వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని, అనంతరం రెండు రోజుల్లోగా అవే ఉత్తర్వులను తెలుగులోనూ జారీ చేయాలని సూచించింది. అనువాద ప్రక్రియ కోసం డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

తెలుగు భాష ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, 98% మంది తెలుగు మాట్లాడే రాష్ట్రంలో ప్రభుత్వ ఉత్తర్వులు సులభంగా అందుబాటులోకి రావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఇది భాషా సమగ్రతకు తోడ్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఇటీవల విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభలో కూడా పాలనా వ్యవహారాలు తెలుగులో జారీ చేయడం అవసరమని తీర్మానించారు. తాజాగా తీసుకున్న నిర్ణయం తెలుగు కవులు, రచయితల నుండి ప్రశంసలు పొందుతోంది. తాజాగా ఒక ఖైదీ పెరోల్‌కు సంబంధించిన ఉత్తర్వులను తెలుగులో విడుదల చేసింది ఏపీ హోం శాఖ.

ఈ నిర్ణయాన్ని అమలు చేసే మొదటి చర్యగా, హోం శాఖ తాజాగా ఒక ఖైదీ పెరోల్‌కు సంబంధించిన ఉత్తర్వులను తెలుగులో విడుదల చేసింది. ఇది ప్రజలకు ప్రభుత్వ నిర్ణయాలను మరింత అవగాహన కలిగించే దిశగా తొలి అడుగు అని పేర్కొంది. ప్రభుత్వ జీవోలు తెలుగులో విడుదల కావడంతో, ప్రజలు వాటిని సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ విధంగా, ప్రభుత్వ ఉత్తర్వులను ఇంగ్లీష్‌తో పాటు తెలుగులోనూ జారీ చేయడం ద్వారా ప్రజలకు అవగాహన పెరగడమే కాకుండా, భాషా సమగ్రతకు కూడా తోడ్పడుతుందంటున్నారు భాషా అభిమానులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..