Anandayya Mandu: మందు తయారీకి ఆనందయ్య ఏర్పాట్లు.. త్వరలోనే ప్రభుత్వ అనుమతితో ఇంటింటికి మందు పంపిణీః కాకాణి
నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ ప్రభుత్వం, హైకోర్టు పచ్చజెండా ఊపాయి. కంట్లో వేసే మందుకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు.

Krishnapatnam Anandayya Mandu: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు పంపిణీకి అడ్డంకులు తొలగిపోయాయి. ఏపీ ప్రభుత్వం, హైకోర్టు పచ్చజెండా ఊపాయి. కంట్లో వేసే మందుకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. ఆ డ్రాప్స్ తప్ప మిగతా వాటికి అనుమతి లభించింది. CCRAS నివేదిక ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐ డ్రాప్స్పై ఇంకా నివేదిక రాలేదు. అందుకు మరో మూడు వారాలు పట్టే అవకాశం ఉంది.
హైకోర్టు కూడా ఆనందయ్య మందు పంపిణీకి అనుమతిచ్చింది. ఐడ్రాప్స్కు కూడా పర్మిషన్ ఇవ్వాలని కోరారు ఆనందయ్య. అయితే.. ఐడ్రాప్స్పై నివేదికకు రెండు వారాల సమయం కోరింది ప్రభుత్వం. అయితే.. ఆ రిపోర్ట్ను గురువారం అందించాలని న్యాయస్థానం స్పష్టంచేసింది.
ఆనందయ్య ఇతర మందులపై హాని లేదని తేల్చాయి నివేదికలు. ఆనందయ్య మందుతో కరోనా తగ్గుతుందని నిర్థారణ కాలేదని వెల్లడి. డాక్టర్లు ఇచ్చిన మందులు వాడుతూ ఆనందయ్య మందులు వాడాలని సూచన. ఆనందయ్య మందు పంపిణీలో కొవిడ్ రూల్స్ పాటించాలని సూచించారు. ఆనందయ్య మందు కోసం కొవిడ్ బాధితుల బంధువులు మాత్రమే రావాలని ప్రభుత్వం సూచించింది.
కాగా, ఆనందయ్య మందుతో సైడ్ ఎఫెక్ట్స్ లేనప్పటికీ.. అది ఆయుర్వేద మెడిసిన్ కాదన్నారు ఆయుష్ కమిషనర్ రాములు. అందువల్ల ప్రభుత్వం తయారు చేసే అవకాశం లేదన్నారు. ఆనందయ్య మందుతో కరోనా తగ్గుతుందని నిర్ధారణ కాలేదన్నారు. హెల్త్ సప్లిమెంట్గా మాత్రమే వాడుకోవచ్చన్నారు.
ఇదిలావుంటే, కృష్ణపట్నం గ్రామంలో ఆనందయ్యను కలిసిన సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి అభినందించారు. ఆనందయ్య మందు కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమందికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం ఎంతో ఊరటనిస్తుందని ఎమ్మెల్యే కాకాణి అన్నారు. ఆనందయ్యకు ఆయుర్వేదం పట్ల అపారమైన అనుభవం ఉండడంతో పాటు, ఆయన మందు పట్ల ప్రజలకు ఉన్న నమ్మకం, విశ్వాసం గమనించిన మీదట అన్ని విధాలా అండగా నిలిచామన్నారు. త్వరలోనే ప్రభుత్వ అనుమతితో మందు పంపిణీ చేపడతామన్నారు. మందు కోసం ఎవ్వరూ ఇక్కడికి రావల్సిన అవసరం లేదన్న కాకాణి, నేరుగా ఇళ్ల వద్దకే మందు చేర్చే ప్రయత్నం చేస్తామన్నారు.
