రప్పా రప్పా అంటూ ఇరాన్ను రప్ఫాడించిన అమెరికా.. 25 నిమిషాల్లో 3 అణు కేంద్రాలు ధ్వంసం!
B-2 బాంబర్లతో ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా విరుచుకుపడింది. ఫోర్డో, నతాంజ్ అణుశుద్ధి కర్మాగారాలపై బంకర్ బస్టర్ బాంబుల వర్షం కురిపించింది. అయితే అమెరికా చెబుతున్నట్టు ఇరాన్ ఇప్పుడు అణుబాంబులు తయారు చేసే కెపాసిటీ కోల్పోయిందా? ఇది గొప్ప విజయమని ట్రంప్, నెతన్యాహు చెబుతుంటే, ఇరాన్ ఎందుకు లైట్ తీసుకుంటోంది? తెలుసుకుందాం.

ఆపరేషన్ మిడ్నైట్ హామర్ ద్వారా, అమెరికా ఇరాన్లోని మూడు అణు కేంద్రాలు, ఫోర్డో, నటాంజ్ మరియు ఇస్ఫహాన్లను లక్ష్యంగా చేసుకుంది. అమెరికా వైమానిక దళం ఈ ఆపరేషన్ను 25 నిమిషాల్లో నిర్వహించింది. అమెరికా 7 B-2 బాంబర్ల నుండి ఇరాన్లోని ఈ ప్రదేశాలపై 12 భారీ బాంబులను జారవిడిచింది. ఈ మిషన్లో దాదాపు 125 అమెరికా యుద్ధ విమానాలు కూడా పాల్గొన్నాయి.
ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ పేరుతో ఇరాన్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడ్డాయి అమెరికా B-2 బాంబర్లు. ఇరాన్లోని అతి పెద్ద అణు ఇంధన కర్మాగారం ఫోర్డోపై 6 B-2 బాంబర్లతో 12 మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనిట్రేటర్ బాంబులు ప్రయోగించింది అమెరికా. ఇక నతాంజ్ యురేనియం శుద్ధి స్థావరంపై 2 బంకర్ బస్టర్ బాంబులు జారవిడిచింది. ఒక్కో బాంబు 13,600 కిలోల బరువు ఉంటుంది. 6 మీటర్ల పొడవుండే దీనిలో 2,700 కిలోల పేలుడు పదార్థం అమరుస్తారు. ఇది భూగర్భంలో 60 మీటర్ల లోతుకు చొచ్చుకు వెళ్లాక పేలుతుంది. ఫోర్డో అణుకేంద్రం కొండల్లో 80 మీటర్ల లోతులో ఉండడంతో…వరుసగా 12 బాంబులు ప్రయోగించింది అమెరికా. ఇక నతాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై జలాంతర్గాముల నుంచి 30 తోమహాక్ మిస్సైల్స్తో అమెరికా దాడులు చేసింది.
ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్ వివరాలను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్. ఫోర్డు వెల్లడించారు. నతాంజ్ అణు కేంద్రాలపై బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించామన్నారు. ఈ ఆపరేషన్లో 125కి పైగా అమెరికా మిలటరీ విమానాలు పాల్గొన్నాయని వెల్లడించారు. అమెరికా నుంచి నాన్స్టాప్గా ప్రయాణించిన B-2 బాంబర్లు ఇరాన్లోని లక్ష్యాలను ధ్వంసం చేశాయి. 2001 సెప్టెంబర్ 11 తర్వాత ఇదే అతి పెద్ద B-2 మిషన్ అని అమెరికా వర్గాలు అంటున్నాయి. ఈ మిషన్ తర్వాత, US జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కేన్ మాట్లాడుతూ, స్టెల్త్ B-2 బాంబర్లు ఇరాన్లోని ఫోర్డో, నటాంజ్ అణు స్థావరాలపై 30,000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబులను జారవిడిచాయని అన్నారు. ఇస్ఫహాన్పై టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులతో దాడి చేశారు. ఈ ఆపరేషన్లో అమెరికా 14 బంకర్-బస్టర్ బాంబులు, 24 కంటే ఎక్కువ టోమాహాక్ క్షిపణులను ఉపయోగించిందని తెలిపారు.
“మిస్సౌరీలోని ఎయిర్ బేస్ నుండి B-2 స్టెల్త్ బాంబర్లు బయలుదేరాయి. ఈ మొత్తం ఆపరేషన్ 18 గంటల పాటు కొనసాగింది, దీనిలో చాలా తక్కువ కమ్యూనికేషన్ ఉపయోగించడం జరిగింది. ఈ ఆపరేషన్ ఇరాన్ అణ్వాయుధ మౌలిక సదుపాయాలను తీవ్రంగా నాశనం చేయడానికి రూపొందించాము. ఇది చాలా రహస్య మిషన్, వాషింగ్టన్లో చాలా కొద్ది మందికి మాత్రమే దీని గురించి తెలుసు.” అని జనరల్ డాన్ కేన్ వివరించారు. “ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా బాంబు దాడి చేయడం ద్వారా తమ లక్ష్యం పాలనను మార్చడం కాదు. అమెరికా రక్షణ అధిపతి తన దేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అది ఇరాన్ సైనికులను లేదా ప్రజలను లక్ష్యంగా చేసుకోలేదని.” జనరల్ డాన్ కేన్ అన్నారు.
భారత కాలమానం ప్రకారం ఆదివారం (22 జూన్) ఉదయం 4:10 గంటలకు అమెరికా ఇరాన్పై దాడులు ప్రారంభించింది. 4:35 గంటలకు ఇరాన్ గగనతలం నుండి బయలుదేరింది. “అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రణాళిక ధైర్యంగా, అద్భుతంగా ఉంది. ప్రపంచం అమెరికా శక్తిని చూసింది. అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడినప్పుడు, ప్రపంచం వినాలి. భూమిపై మరే ఇతర దేశం ఈ ఆపరేషన్ నిర్వహించలేదు” అని అమెరికా రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సేత్ అన్నారు.
ఇరాన్పై వైమానిక దాడి తర్వాత, డోనాల్డ్ ట్రంప్ దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ, “గత 40 సంవత్సరాలుగా, ఇరాన్ అమెరికాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది. చాలా మంది అమెరికన్లు ఈ ద్వేషానికి బాధితులుగా ఉన్నారు, దీనిని ఇకపై సహించకూడదని నిర్ణయించుకున్నామని ట్రంప్ అన్నారు. “ఇప్పుడు శాంతి లేదా విషాదం ఉంటుంది. ఇంకా చాలా లక్ష్యాలు మిగిలి ఉన్నాయి. త్వరలో శాంతి రాకపోతే, మేము మరింత ఖచ్చితమైన దాడులతో ఇతర లక్ష్యాలపై దాడి చేస్తాము” అని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
#WATCH | Chairman of the Joint Chiefs of Staff, General Dan Caine says "Last night, on the President's orders, US Central Command, under the command of General Erik Kurilla, executed Operation Midnight Hammer, a deliberate and precise strike against three Iranian nuclear… pic.twitter.com/CVgNCHA8g4
— ANI (@ANI) June 22, 2025
అయితే అమెరికా దాడులను ఊహించి ఇరాన్ ముందే జాగ్రత్తపడిందా? తన అణు సామగ్రిని హుటాహుటిన తరలించిందా? అంటే ఫోర్డో న్యూక్లియర్ సైట్ దగ్గర 16 డంప్ ట్రక్కులు ఉన్నట్లు ఉపగ్రహ చిత్రాలు చెబుతున్నాయి. అలాగే, టన్నెల్ ద్వారాల దగ్గర గుట్టలు గుట్టలుగా మట్టిని, చెత్తను డంప్ చేశారు. ఆ ప్రాంతాల్లో అమెరికా అటాక్ చేసినా తట్టుకోవడానికి వీలుగా ఇరాన్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది. ఈ దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్పై క్షిపణులను ప్రయోగించింది ఇరాన్. పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలను ధ్వంసం చేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
