RUSSIA-UKRAINE WAR: ఇస్తాంబుల్ సమాలోచనల్లో కాసింత పాజిటివిటీ.. రష్యా వెనక్కి తగ్గడం వెనుక రీజనిదే!
యుక్రెయిన్పై దాడికి దిగిన రష్యా క్రమంగా వెనక్కి తగ్గుతుందా? నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు వస్తుందా? మరికొద్ది రోజుల్లోనే యుద్ధ ట్యాంకుల గర్జన ఆగుతుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. తాజా పరిణామాలు అందుకు దోహదం చేస్తున్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్లో...
RUSSIA-UKRAINE WAR COMING TO AN END PUTIN ANNOUNCES DE-ESCALLATION AT KYIV: యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న రష్యా, యుక్రెయిన్ యుద్దానికి తెరపడే సంకేతాలు తాజాగా వెల్లడయ్యాయి. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో రష్యా, యుక్రెయిన్ దేశ ప్రతినిధుల మధ్య జరిగిన చర్చల్లో స్వల్ప పురోగతి కనిపించడంతో యుద్దం ముగింపు దశ వైపు మళ్ళే సంకేతాలు ప్రస్ఫుటమయ్యాయి. అయితే.. తాజా డెవలప్మెంటుకు కారణం ఏంటి ? ఈజీగా యుక్రెయిన్ను జయించవచ్చని అనుకున్న రష్యాకు అదంత ఈజీగా కాదని తేలడం వల్లనే తాజా చర్యల్లో ఆ దేశం కాస్త వెనక్కి తగ్గిందా అన్న చర్చలు మొదలయ్యాయి. అందువల్లనే రష్యా కీవ్ సిటీ నుంచి బలగాలను వెనక్కి రప్పించేందుకు అంగీకరించిందంటున్నారు. నిజానికి యుక్రెయిన్ రాజధాని కీవ్ని ఆక్రమించుకునేందుకు రష్యా భారీ బలగాలనే తరలించింది. ఏకంగా 65 కిలోమీటర్ల మేర సాగే యుద్ద వాహనాల కాన్వాయ్ని పంపింది. ఆ కాన్వాయ్ని చూసిన వారంతా ఇక యుక్రెయిన్ పని అయిపోయినట్లేననుకున్నారు. కానీ ఆ భారీ యుద్ద వాహనాల కాన్వాయ్ కొన్ని రోజుల తర్వాత సడన్గా అదృశ్యమైంది. తాజాగా మార్చి 29న వెల్లడైన కథనాల ప్రకారం ఆ భారీ కాన్వాయ్ని యుక్రెయిన్ మిలిటరీ ధ్వంసం చేసిందని తెలుస్తోంది. ఏకంగా 30 ట్యాంకర్ విధ్వంసక క్షిపణులను ప్రయోగించిన యుక్రెయిన్.. రష్యన్ కాన్వాయ్ని ఛేదించిందని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. కీవ్ నగరాన్ని హస్తగతం చేసుకునే రష్యన్ దాడులను యుక్రెయిన్ మిలిటరీ దాదాపు 20 రోజులుగా ప్రతిఘటిస్తూనే వుంది. సులభంగా స్వాధీనపరచుకోవచ్చని అనుకున్న కీవ్ సిటీ విషయంలో తమ అంచనాలు తప్పడంతో రష్యా ఖంగుతిన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో టర్కీ చర్చలు గుడ్డిలో మెల్లగా సక్సెస్ అవడంతో యుద్దానికి ముగింపు మొదలైందన్న విశ్లేషణలు షురువయ్యాయి.
అయితే.. యుక్రెయిన్పై దాడికి దిగిన రష్యా క్రమంగా వెనక్కి తగ్గుతుందా? నెల రోజులకు పైగా కొనసాగుతున్న యుద్ధం ముగింపు దశకు వస్తుందా? మరికొద్ది రోజుల్లోనే యుద్ధ ట్యాంకుల గర్జన ఆగుతుందా? అన్న సందేహాలు మొదలయ్యాయి. తాజా పరిణామాలు అందుకు దోహదం చేస్తున్నాయి. టర్కీలోని ఇస్తాంబుల్లో యుక్రెయిన్, రష్యా ప్రతినిధుల మధ్య మార్చి 29న మూడో దఫా చర్చలు జరిగాయి. ఇరు దేశాల ప్రతినిధులు దాదాపు మూడు గంటల పాటు శాంతి సమాలోచనలు జరిపారు. ఇరుదేశాల వాదనలు టర్కీ అధ్యక్షుని సమక్షంలో జరిగాయి. ఈ చర్చలు ఫలప్రదమవడంతో యుక్రెయిన్లోని కీవ్ తదితర నగరాల చుట్టూ నిలిపిన సైన్యాలను ఉపసంహరించుకోవడానికి రష్యా అంగీకరించినట్లు తెలుస్తున్నది. నాటో కూటమిలో చేరడానికి యుక్రెయిన్ ప్రయత్నాలు చేస్తున్నదంటూ ఒక దశలో రష్యా మండి పడింది. నాటోలో చేరనని రాత పూర్వక హామీ ఇవ్వాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన డిమాండ్ను యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పట్టించుకోలేదు. దీంతో యుక్రెయిన్ మీదకు సేనలను నడిపించారు పుతిన్. ఫలితంగా పలు కీలక నగరాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. ఫిబ్రవరి 24న మొదలైన యుద్దం ప్రస్తుతం భీకర రూపు దాల్చింది. యుక్రెయిన్లోని ఖార్కీవ్, మరియుపోల్, ఒడెస్సా, జఫరోజియా, సుమీ వంటి నగరాలు ఆల్మోస్ట్ ధ్వంసమైపోయాయి. యుక్రెయిన్పై దండయాత్రకు దిగిన రష్యాను కట్టడి చేయడానికి అమెరికా, దాని మిత్ర పక్షాలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ప్రత్యేకించి అంతర్జాతీయంగా బ్యాంకింగ్ వ్యవస్థలో అమలవుతున్న స్విఫ్ట్ సిస్టమ్ నుంచి రష్యాను బహిష్కరించాయి. ఇంకెన్నో ఆంక్షలను విధించాయి. ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం కూడా రష్యా తీరును తప్పుబట్టినా పుతిన్ వెనక్కు తగ్గలేదు.
తాజాగా యుక్రెయిన్తో ఆరోసారి జరిపిన చర్చలు అర్థవంతంగా సాగినట్లు చర్చల్లో పాల్గొన్న రష్యన్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. రష్యా తీసుకున్న నిర్ణయం ఇరు దేశాల మధ్య పరస్పర విశ్వాసం పెంపొందించడానికి ఉపయోగపడుతుందన్నారు. మున్ముందు జరిగే చర్చలకు ఇది దోహదం చేస్తుందని.. అంతిమ లక్ష్యం సాధించడానికి ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతుండగానే మరోవైపు యుక్రెయిన్పై వరుసగా 34వ రోజు కూడా రష్యా దాడులు కొనసాగించింది. మరియుపోల్ నగరాన్ని పూర్తిగా ఆక్రమించింది రష్యా. మరియుపోల్ పోరులో 5 వేల మంది సామాన్య పౌరులు చనిపోయినట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. భారీ ఆయుధాలతో మరియుపోల్పై విరుచుకుపడ్డారు రష్యా సైనికులు. చెచెన్ దళాలు వాళ్లకు పూర్తిగా సహకరిస్తున్నాయి. యుక్రెయిన్ లోని ప్రధాన నగరాలను ధ్వంసం చేస్తోంది రష్యా . యూరప్లో అతిపెద్ద మార్కెట్గా పేరున్న ఖార్కీవ్ నగరం మొత్తం ధ్వంసమయ్యింది. నగరంలో ఎక్కడ చూసినా శిథిలాలే కన్పిస్తున్నాయి. దాడుల్లో తీవ్రత తగ్గిస్తామన్న రష్యా మాటలను యుక్రెయిన్ నమ్మడం లేదు. అప్రమత్తంగా ఉండాలని సైనికులను ఆదేశించారు యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. మరోవైపు.. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని హత్య చేసేందుకు రష్యా చేసిన మరో కుట్రను భగ్నం చేసినట్టు ఆ దేశ నిఘా వర్గాలు వెల్లడించాయి. స్లోవేకియా-హంగరీ సరిహద్దులో 25 మంది రష్యా స్పెషల్ ఏజెంట్లను పట్టుకున్నట్టు యుక్రెయిన్ సైన్యం తెలిపింది. రష్యాపై విజయానికి చేరువలో ఉన్నామని కామెంట్ చేశారు జెలెన్స్కీ. తనను చూసి రష్యా అధ్యక్షుడు పుతిన్ భయపడుతున్నారని అన్నారు. నాటో దేశాల దగ్గర ఉన్న ఒక్క శాతం యుద్దవిమానాలను, ట్యాంకులను తమకు ఇస్తే రష్యాకు చుక్కలు చూపిస్తామన్నారు. ఇంకోవైపు యుక్రెయిన్కు సాయం పెంచాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్పై ఒత్తిడి పెరుగుతోంది. నాటో దేశాలు బైడెన్పై ఒత్తిడి పెంచుతున్నాయి. త్వరలోనే యుక్రెయిన్కు అమెరిక బలగాలను పంపే ఆలోచనలో ఉన్నారు బైడెన్. పోలండ్ పర్యటన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రష్యా దండయాత్ర యుక్రెయిన్తో ఆగిపోదని నాటో దేశాలు భావిస్తున్నాయి. పుతిన్ హిట్లిస్ట్లో మరో ఆరుదేశాలు ఉన్నట్టు తెలుస్తోంది. లాత్వియా , లిథువేనియా. పోలండ్ , మాల్డోవా , ఇస్తోనియాపై దాడులకు రష్యా స్కెచ్ గీసినట్టు నాటో కూటమి ఆరోపిస్తోంది.
రష్యా మిస్సైల్స్ దాడిలో పశ్చిమ ప్రాంతంలోని ఆయిల్ డిపో దెబ్బతిన్నట్లు ఆరోపించింది యుక్రెయిన్. డోనెట్స్క్, లుహాన్స్క్ ప్రాంతాల్లో రష్యా దాడులను తిప్పికొట్టినట్లు ప్రకటించింది. తమ బలగాల తీవ్ర ప్రతిఘటనతో కీవ్ నుంచి రష్యా సేనలు వెనక్కి వెళ్లిపోయినట్లు తెలిపింది యుక్రెయిన్. అయితే శత్రుగడ్డపై పుతిన్ సేనలు బలహీనపడ్డాయని, వారి ఆయుధాలు తరిగిపోయాయంటూ వార్తలు వెలువడుతున్నాయి. కీవ్ను అష్టదిగ్బంధం చేశాయి రష్యా బలగాలు. అయితేనేం యుక్రెయిన్ బలగాలు రష్యన్ మిలిటరీని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి. ఇప్పటికే మరియుపోల్ నగరం పూర్తిగా రష్యా ఆధీనంలోకి వెళ్లింది. అక్కడి సెక్యూరిటీ బాధ్యతలను చెచెన్ ఫైటర్స్కు అప్పగించింది. మరియుపోల్ పరిపాలన భవనంపై తమ జెండాను ఎగురవేశారు. చెచెన్ దళాన్ని యుద్ధక్షేత్రంలోకి దింపిన పుతిన్.. కీవ్పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.ఈ నేపథ్యంలో ఆసక్తికరమైన పరిణామం టర్కీ వేదికగా చోటుచేసుకుంది. తాజాగా వెల్లడవుతున్న సమాచారం ప్రకారం కీవ్ నగర శివార్లలో వున్న రష్యా బలగాలను క్రమంగా అక్కడ్నించి ఉపసంహరించేందుకు రష్యా ప్రతినిధి బృందం అంగీకరించింది. ఈ పరిణామం యుద్దాన్ని ముగింపు దిశగా మళ్ళించే అవకాశాలున్నాయని అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా వుంటే అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. యుక్రెయిన్ సంక్షోభంపై యూరోపియన్ యూనియన్లోని అమెరికా మిత్ర దేశాలతో టెలిఫోనిక్ చర్చలు ప్రారంభిస్తానని బైడెన్ ప్రకటించారు. బ్రిటన్, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ దేశాల నేతలతో రష్యన్ మిలిటరీ యాక్షన్పై చర్చిస్తానన్నారు.
అయితే యుక్రెయిన్లోని కొన్ని ప్రాంతాలలో రష్యన్ దాడులు కొనసాగుతునేవున్నాయి. ఈ క్రమంలో యుక్రెయిన్పై అణ్వాయుధాలను రష్యా ప్రయోగించవచ్చనే ఆందోళనలు వెలుబడ్డాయి. అయితే, వీటిపై స్పందించిన రష్యా.. తమ దేశ ఉనికికి ముప్పు వాటిల్లే సందర్భంలోనే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని మరోసారి పేర్కొంది. అంతేకానీ ప్రస్తుతం యుక్రెయిన్ సైనిక చర్యలో మాత్రం కాదని స్పష్టం చేసింది. యుక్రెయిన్లో కొనసాగుతోన్న సైనిక చర్య ఫలితం ఏదైనా, అది అణ్వాయుధ వినియోగానికి దారి తీయదని ప్రకటించింది రష్యా. తమ దేశ అస్తిత్వానికి ముప్పు వాటిల్లినప్పుడు వాటిని ఎదుర్కొనేందుకు మాకు స్పష్టమైన భద్రతా వ్యూహం ఉందని తెలిపి.. అణ్వాయుధ ఆందోళనకు ముగింపు పలికింది.ఈ మేరకు ఓ వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు.