Pakistan Bomb Blast: పాకిస్తాన్లో పేలుడు.. భయంకరమైన విధ్వంసం.. పట్టాలు తప్పిన జాఫర్ ఎక్స్ప్రెస్ 6 బోగీలు
పాకిస్తాన్లో పెద్ద పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. సింధ్ ప్రావిన్స్లోని జకోబాబాద్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. ఇది బలూచిస్తాన్ ప్రావిన్స్ సరిహద్దుకు ఆనుకుని ఉంది. వాస్తవానికి పాకిస్తాన్లోని రైల్వే ట్రాక్ దగ్గర ఒక బాంబు ఉంచబడింది. ఇది జాఫర్ ఎక్స్ప్రెస్ రైలును ఢీకొట్టింది. మరి ఈ దాడి వెనుక ఎవరి హస్తం ఉంది..? బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులే ఈ దాడికి పాల్పడ్డాయా..?

పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రాంతంలో జాఫర్ ఎక్స్ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురయ్యింది. సింధ్ ప్రావిన్స్ లోని జకోబాబాద్ దగ్గర రైల్వే ట్రాక్పై బాంబు పేలుడు సంభవించింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు మార్గంలో ఐఈడీ బాంబు అమర్చడం వల్లే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రతకు రైలు పట్టాలపై సుమారు మూడు అడుగుల లోతైన గొయ్యి ఏర్పడిందని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో క్వెట్టా నుంచి పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ రైలులోని ఆరు బోగీలు పట్టాలు తప్పాయి. ఆరు బోగీలు పట్టాలు తప్పడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
బలూచిస్తాన్ వేర్పాటువాద గ్రూపులు ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ఎందుకంటే జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు గతంలోనూ దాడులకు గురైంది. ఈ ఏడాది మార్చి నెలలో పాకిస్థాన్లోని వేర్పాటువాద బలోచ్ మిలిటెంట్లు ఇదే రైలును హైజాక్ చేసి, వందలాది మంది ప్రయాణికులను బందీలుగా పట్టుకున్నారు. వారిని రక్షించేందుకు వెళ్లిన పాక్ భద్రతా సిబ్బందిని కూడా మిలిటెంట్లు హతమార్చారు. అనంతరం పాక్ భద్రతా దళాలు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి బందీలను విడిపించాయి.
ఇప్పుడు మళ్లీ అదే రైలు లక్ష్యంగా దాడి జరగడం కలకలం రేపుతోంది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ ప్రావిన్స్ అత్యంత సమస్యాత్మక ప్రాంతం… ఇక్కడ బలోచ్ ఆర్మీకి గట్టి పట్టు ఉంది. ఆ దేశ ప్రభుత్వ కార్యకలాపాలు ఇక్కడ చాలాకాలంగా సాగట్లేదు. ఇటీవలే తమది స్వతంత్ర దేశంగా కూడా ప్రకటించుకుంది బలోచ్ ఆర్మీ. అయితే ఈ దాడికి సంబంధించి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక రాలేదు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




