AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Space Tourism: చంద్రునిపై లగ్జరీ స్టే!.. బుకింగ్ ధర వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

మనం చిన్నప్పుడు కథల్లో చదువుకున్న చందమామపై నివాసం ఇప్పుడు నిజం కాబోతోంది. అంతరిక్ష పర్యాటకాన్ని సరికొత్త స్థాయికి తీసుకెళ్తూ, అమెరికాకు చెందిన ఒక స్టార్టప్ కంపెనీ చంద్రునిపై హోటల్ బస కోసం బుకింగ్స్‌ను ప్రారంభించింది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూసే అద్భుత దృశ్యాలను త్వరలోనే నేరుగా అనుభవించే అవకాశం రాబోతోంది. 2032 నాటికి చంద్రుని ఉపరితలంపై మానవ అవుట్‌పోస్ట్‌ను నిర్మించడమే లక్ష్యంగా ఈ భారీ ప్రాజెక్టు ముందుకు సాగుతోంది.

Space Tourism: చంద్రునిపై లగ్జరీ స్టే!.. బుకింగ్ ధర వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
Moon Hotel A New Frontier In Space Tourism
Bhavani
|

Updated on: Jan 21, 2026 | 3:24 PM

Share

ఆకాశంలో మెరిసే చందమామపై ఒక్క రోజైనా గడపాలని ఎవరికి ఉండదు? ఆ కోరికను నెరవేర్చడానికి సిలికాన్ వ్యాలీకి చెందిన ‘జీఆర్‌యూ స్పేస్’ (GRU Space) సిద్ధమైంది. కేవలం 22 ఏళ్ల యువకుడు స్కైలర్ చాన్ స్థాపించిన ఈ సంస్థ, చంద్రునిపై హోటల్ నిర్మించే పనులను వేగవంతం చేస్తోంది. అయితే ఈ అద్భుత యాత్రకు అయ్యే ఖర్చు వింటేనే సామాన్యులకు కళ్లు తిరుగుతాయి. కేవలం రిజర్వేషన్ కోసమే కోట్లాది రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ వినూత్న అంతరిక్ష ప్రయాణం గురించి మరిన్ని ఆసక్తికర విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రూ. 9 కోట్లు ఉంటేనే రిజర్వేషన్!

ఈ లూనార్ హోటల్‌లో గదిని రిజర్వ్ చేసుకోవడానికి ‘జీఆర్‌యూ స్పేస్’ ప్రస్తుతం రూ. 2.2 కోట్ల నుండి రూ. 9.09 కోట్ల వరకు వసూలు చేస్తోంది. ఇది కేవలం మీ సీటును భద్రపరుచుకోవడానికి మాత్రమే. ఇది కాకుండా, అప్లికేషన్ ప్రాసెస్ కోసం అదనంగా రూ. 84 వేలు చెల్లించాల్సి ఉంటుంది, ఇది తిరిగి ఇవ్వబడదు. అలాగే, ఈ యాత్రకు వెళ్లేవారికి కఠినమైన వైద్య పరీక్షలు బ్యాక్‌గ్రౌండ్ చెక్ కూడా చేస్తారు. మీ ఆర్థిక స్థితిగతులు ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా ఉంటేనే చంద్రునిపైకి వెళ్లే ఛాన్స్ లభిస్తుంది.

మొత్తం ఖర్చు రూ. 90 కోట్లు పైనే..

కేవలం రిజర్వేషన్ ధరతోనే ఈ ప్రయాణం పూర్తి కాదు. చంద్రునికి వెళ్లి రావడానికి అయ్యే మొత్తం ఖర్చు సుమారు రూ. 90 కోట్ల ($10 మిలియన్) కంటే ఎక్కువే ఉంటుందని కంపెనీ అంచనా వేస్తోంది. ఇప్పటివరకు కేవలం 12 మంది మనుషులు మాత్రమే చంద్రునిపై అడుగు పెట్టారు, కానీ ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యాటకుల సంఖ్యను పెంచి చంద్ర ఆర్థిక వ్యవస్థను (Lunar Economy) అభివృద్ధి చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇది కేవలం పర్యాటకమే కాకుండా, భూమికి అవతల మానవ జీవనానికి పునాదులు వేయడమే తమ ప్రధాన ఉద్దేశమని సంస్థ పేర్కొంది.

చంద్ర ధూళితోనే ఇటుకలు!

ఈ ప్రాజెక్ట్ కోసం 2029లో మొదటి నిర్మాణ సామాగ్రిని చంద్రునిపైకి పంపనున్నారు. విశేషమేమిటంటే, చంద్రునిపై ఉండే ధూళిని (Lunar Dust) ఉపయోగించి అక్కడే ఇటుకలను తయారు చేసే సాంకేతికతను కంపెనీ పరీక్షిస్తోంది. ఈ ఇటుకలతో హోటల్ గోడలను నిర్మించడం వల్ల చంద్రునిపై ఉండే అత్యధిక ఉష్ణోగ్రతలు ప్రమాదకర రేడియేషన్ నుండి పర్యాటకులకు రక్షణ లభిస్తుంది. 2032 నాటికి మొదటి పర్యాటకుడిని చంద్రునిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ సంస్థ, అంతరిక్ష పరిశోధనల్లో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖించబోతోంది.