China: చైనా, తైవాన్ మధ్య కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు.. యుద్ధానికి సిద్ధమేనని ప్రకటించిన చైనా
చైనా, తైవాన్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. డ్రాగన్ కవ్వింపు చర్యలతో అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. జాయింట్ స్వోర్డ్ పేరుతో తైవాన్ చుట్టూ 3 రోజుల పాటు సైనిక విన్యాసాలు చేపట్టి సోమవారం ముగించిన చైనా..తాము యుద్ధానికి సిద్ధమేనని ప్రకటించింది.

చైనా, తైవాన్ ల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. డ్రాగన్ కవ్వింపు చర్యలతో అక్కడ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. జాయింట్ స్వోర్డ్ పేరుతో తైవాన్ చుట్టూ 3 రోజుల పాటు సైనిక విన్యాసాలు చేపట్టి సోమవారం ముగించిన చైనా..తాము యుద్ధానికి సిద్ధమేనని ప్రకటించింది. యుద్ధం ఏ క్షణంలో ప్రారంభమైనా పోరాడేందుకు మా బలగాలు సన్నద్ధంగా ఉన్నాయని తెలిపింది. అయితే తైవాన్ స్వాతంత్ర్యం కోసం ప్రయత్నాలతో పాటు అందులో విదేశాలు జోక్యాన్ని తుత్తినీయలు చేస్తామని పేర్కొంది. ఇటీవల జరిగిన విన్యాసాల్లో చైనా ప్రధానంగా తమ గగనతల పోరాట సామర్థ్యంపై దృష్టి సారించింది. అందులో తొలిసారిగా జె-15 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి.
ఆ యుద్ధ విమానాలు చైనా నౌకాదళానికి చెందిన విమాన వాహకనౌకల నుంచి ఎగిరి తైవాన్ గగనతలంలోకి ప్రవేశించాయి. తైవాన్ పై దాడి చేసే సన్నాహాల్లో భాగంగానే వాటిని చైనా విన్యాసాల్లో వినియోగించిందన్న విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో ఏకంగా 35 యుద్ధవిమానాలు తైవాన్ జలసంధిలోని మీడియన్ లైన్ను దాటినట్లు తెలుస్తోంది. వాటిలో జె-16, జె-1, సు-30 తదితర లోహవిహంగాలు ఉన్నట్లు సమాచారం. ఒకవేళ యుద్ధం జరిగితే తైవాన్కు సాయం చేసేందుకు విదేశీ సైన్యాలేవీ ముందుకు రాకుండా అడ్డుకునే ప్రణాళికల్లో భాగంగానే షాండాంగ్ సన్నద్ధతను కూడా ఆ దేశం పరీక్షించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.



