Watch: క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మించి.. అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలను ఎదిరించిన మహిళ..!
అర్ధరాత్రి వేళ ఆయుధాలతో వచ్చిన ఐదుగురు ముసుగు దొంగలు.. అపారమైన నగల దోపిడీకి పక్కా స్కెచ్ వేశారు. కానీ, తమ ప్లాన్కు అడ్డుగా ఒక వీరనారి నిలబడుతుందని వారు అస్సలు ఊహించలేదు. మహారాష్ట్ర వాషిమ్ జిల్లాలో జరిగిన ఈ విస్తుపోయే సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, ఆ ప్రాంతంలోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహిళ సమయస్ఫూర్తి, ధైర్యంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా, మనోరా పట్టణంలో ఐదుగురు ముసుగు దొంగల దోపిడీ యత్నాన్ని ఒక ధైర్యవంతురాలైన మహిళ ఒంటరిగా తిప్పికొట్టింది. వాషిమ్ జిల్లా మనోరా పట్టణ పరిధిలోని మంగ్రూల్పీర్-దిగ్రాస్ హైవేపై గోపాల్ జ్యువెలర్స్ అనే నగల దుకాణం ఉంది. అర్ధరాత్రి సమయంలో తెల్లటి స్కార్పియో కారులో ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు ఆ దుకాణం వద్దకు వచ్చారు. షట్టర్ తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. వెంట తెచ్చిన గ్యాస్ కట్టర్ సహాయంతో నగల లాకర్ను కత్తిరించడం ప్రారంభించారు.
దుకాణంలో జరుగుతున్న గందరగోళాన్ని, వింత శబ్దాలను ఎదురింట్లో నివాసముంటున్న ప్రజలు పసిగట్టారు. వెంటనే జ్యువెలరీ షాప్ యజమానికి ఫోన్ చేసి సమాచారం అందించారు. అనంతరం ఇంట్లో ఉన్న ఇద్దరు పురుషులతో కలిసి ఒక మహిళ బయటకు వచ్చింది. అయితే, శబ్దాలు చేసిన ప్రదేశానికి పురుషుల కంటే ముందే ఆ మహిళ అత్యంత ధైర్యంతో అడుగులు వేసింది.
ముసుగులు ధరించి ఆయుధాలతో ఉన్న ఐదుగురు నేరస్థులను చూసి ఆ మహిళ అస్సలు భయపడలేదు. బిగ్గరగా కేకలు వేస్తూ నేరుగా వారి వైపు దూసుకెళ్లింది. అంతేకాకుండా కింద ఉన్న రాళ్లను తీసి దుండగులలో ఒకరిపైకి బలంగా విసిరింది. అర్ధరాత్రి వేళ ఒక మహిళ అలా సింహంలా విరుచుకుపడటంతో ఆ ఐదుగురు దొంగలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆమె ధైర్యానికి భయపడిపోయి, తాము తెచ్చిన కారులోనే అక్కడి నుంచి పరుగులు తీశారు.
ఆ మహిళ చూపిన చొరవ వల్ల లక్షలాది రూపాయల నగల దోపిడీ విఫలమైంది. ఈ నాటకీయ దృశ్యాలన్నీ షాప్ వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని ఆ ఐదుగురు ముసుగు దొంగల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. చాకచక్యంగా వ్యవహరించి దోపిడీని అడ్డుకున్న ఆ మహిళా ధైర్యాన్ని పోలీసులు, స్థానికులు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.




