US విషాదం.. ట్రాక్పై జారిపడ్డ స్నేహితుడు.. అతడ్ని కాపాడేందుకు దూకిన యువతి సైతం…!
న్యూయార్క్లో దారుణ ప్రమాదం జరిగింది. రుట్గర్స్ యూనివర్సిటీకి చెందిన 24 ఏళ్ల గ్రాడ్యుయేట్లు నవమ్ కౌల్, మలైకా చిత్రే ఇద్దరు మాన్హ్యాటన్లోని సబ్వే స్టేషన్ కు ఆదివారం తెల్లవారుజామున వచ్చారు. నవమ్ కౌల్ ప్రమాదవశాత్తు సబ్వే ట్రాక్పై పడిపోవడమో లేదా కిందకు దిగడమో జరిగిందనీ అతడిని కాపాడేందుకు మలైకా చిత్రే ట్రాక్పైకి వెళ్లినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. అయితే, అదే సమయంలో ట్రాక్ పైకి దూసుకొచ్చిన 'నంబర్ 4' రైలు వీరిద్దరినీ బలంగా ఢీకొట్టింది.

న్యూయార్క్ లోని మాన్హ్యాటన్ స్ప్రింగ్ స్ట్రీట్ సబ్వే స్టేషన్లో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో ఇద్దరు 24 ఏళ్ల భారత సంతతి యువతీయువకుడు ప్రాణాలు కోల్పోయారు. మృతులను న్యూజెర్సీకి చెందిన నవమ్ కౌల్, మలైకా చిత్రేగా పోలీసులు గుర్తించారు.ట్రాక్ పై పడిపోయిన స్నేహితుడిని కాపాడే ప్రయత్నంలో ఇద్దరూ ప్రమాదానికి గురయ్యారని ప్రాథమికంగా భావిస్తున్నారు. వేగంగా వచ్చిన ‘నంబర్ 4’ రైలు డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేకులు వేసినప్పటికీ ప్రమాదాన్ని నివారించలేకపోయారు. సబ్వే స్టేషన్లోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా, రైలు వచ్చే కొన్ని నిమిషాల ముందు వీరిద్దరూ ట్రాక్పై ఉన్నట్లు కనిపించింది. అయితే వారు ఏ ఉద్దేశంతో ట్రాక్పైకి వెళ్లారనేది ఇంకా స్పష్టం కాలేదని, దీనిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. మంచి భవిష్యత్తు ఉన్న ఇద్దరు యువకులు సబ్వే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలలో తీవ్ర విషాదం అలముకుంది.
న్యూజెర్సీలోని రుట్గర్స్ విశ్వవిద్యాలయంలో 2024లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వీరిద్దరూ ప్రాణస్నేహితులు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున దాదాపు 3:14 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, నవమ్ కౌల్ అనుకోకుండా సబ్వే ట్రాక్పై పడిపోవడమో లేదా కిందకు దిగడమో జరగడంతో ఈ దారుణం చోటుచేసుకుంది.

Two Indian Origin Students Run Over By Train In New Yok
ట్రాక్ పై కూర్చుని ఉన్న షాకింగ్ దృశ్యాలు..అల్కహాల్ మత్తులో ప్రమాదం?
సీసీటీవీ పుటేజీ ఆధారంగా పోలీసుల దర్యాప్తులో మరికొన్ని వివరాలు బయటపడ్డాయి. ట్రాక్పై బాధితులిద్దరూ కూర్చొని ఉన్నట్లు సీసీటీవీ దృశ్యాల్లో నమోదైంది. అయితే, వారు అసలు అక్కడ ఎందుకు కూర్చున్నారు? రైలు వస్తున్నా ఎందుకు పక్కకు తప్పుకోలేదనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి ‘న్యూయార్క్ పోస్ట్’ కథనం కొన్ని కీలక అంశాలను వెలుగులోకి తెచ్చింది. బాధితులిద్దరూ మద్యం మత్తులో ఉండటం వల్ల పరిస్థితి ఎంత ప్రమాదకరమో గ్రహించలేకపోయారా అనే కోణంలో దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నట్లు ‘న్యూయార్క్ పోస్ట్’ పేర్కొంది. అర్ధరాత్రి దాటాక 3:15 గంటల ప్రాంతంలో వేగంగా వస్తున్న ‘నంబర్ 4’ రైలు ఢీకొట్టడానికి కొద్ది క్షణాల ముందు, ట్రాక్పై ఉన్న నవమ్ కౌల్ను మలైకా చిత్రే తన వైపునకు లాగి కాపాడేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఎటువంటి సూసైడ్ నోట్ లభించలేదని దర్యాప్తు సంస్థలు వెల్లడించినట్లు పత్రిక కథనంలో తెలిపింది.