Telangana: ధాన్య లక్ష్మి ఒడిలో లంబోదరుడు.. రామకోటి రామరాజు వినూత్న కళారూపం
వినాయక చవితి వచ్చేసింది.. దేశ వ్యాప్తంగా వీధివీధిన రకరకాల గణపయ్య విగ్రహాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అయితే సిద్దిపేట జిల్లాలో వినాయక చవితి సందర్భంగా భక్తికి సృజనాత్మకతను జోడిస్తూ నవధాన్యాలతో ఓ భక్తుడు రూపొందించిన గణపయ్య చిత్రం ఇప్పుడు అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

వినాయక చవితి సందర్భంగా భక్తికి సృజనాత్మకతను జోడిస్తూ నవధాన్యాలతో రూపొందించిన గణపయ్య చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్కు చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ వినూత్న గణపతి చిత్రాన్ని తీర్చిదిద్దారు.వివిధ రంగులు, ఆకృతులతో రూపొందించే వినాయక చిత్రాలకు భిన్నంగా.. మన సంప్రదాయానికి ప్రతీకలైన నవధాన్యాలను ఉపయోగించి విఘ్నేశ్వరుడి రూపాన్ని రూపొందించారు.
మూడు రోజులపాటు శ్రమించి, భక్తిశ్రద్ధలతో ఈ చిత్రాన్ని తయారు చేసినట్లు రామరాజు తెలిపారు. గత 30 సంవత్సరాలుగా వివిధ రకాల భగవంతుని చిత్రాలను వినూత్న పద్ధతుల్లో రూపొందిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించే ప్రయత్నం చేస్తున్నట్లు రామకోటి రామరాజు చెప్పారు. ప్రతి సంవత్సరం కొత్త ఆలోచనతో, కొత్త తరహాలో దేవతా చిత్రాలను రూపొందిస్తూ ఆధ్యాత్మిక సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నానని తెలిపారు.
సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడి రూపాన్ని నవధాన్యాలతో రూపొందించడం ద్వారా భక్తితో పాటు మన సంప్రదాయాలు, సంస్కృతిపై అవగాహన కల్పించాలన్నదే తన ఉద్దేశమని రామరాజు పేర్కొన్నారు. నవధాన్యాలతో రూపొందించిన ఈ గణపయ్య చిత్రం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
వీడీయో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
