ఆసుపత్రి నిర్లక్ష్యం.. పురిట్లోనే మారిన పిల్లలు.. 36 ఏళ్ల తర్వాత బయటపడ్డ షాకింగ్ నిజం! ఎలాగంటే..
కన్నప్రేమకు మించినది లోకంలో మరొకటి లేదు. కానీ, తాము ప్రాణంగా పెంచుకున్న బిడ్డ తమ వాడు కాదని, ఎక్కడో పెరిగిన పరాయివాడు తమ సొంత బిడ్డ అని 36 ఏళ్ల తర్వాత తెలిస్తే ఆ తల్లిదండ్రుల గుండె ఎంతలా విలవిలలాడుతుందో ఊహించలేం. అమెరికాలోని నార్త్ డకోటా రాష్ట్రంలో ఇటువంటి హృదయవిదారక, విస్తుపోయే ఘటన వెలుగుచూసింది. ఆసుపత్రి సిబ్బంది చేసిన ఒక చిన్న పొరపాటు ఇద్దరు వ్యక్తుల జీవితాలను, రెండు కుటుంబాల భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. అసలేం జరిగిందంటే..

36 ఏళ్ల క్రితం ఆసుపత్రి సిబ్బంది చేసిన ఒక ఘోర తప్పిదం వల్ల పురిట్లోనే ఇద్దరు శిశువులు మారిపోయారు. డిశ్చార్జ్ చేసే సమయంలో ఆస్పత్రి సిబ్బంది పిల్లలిద్దరినీ మార్చి పంపించారు. దీనివల్ల వారిద్దరూ తమ కన్నవారికి దూరమై, వేరే కుటుంబాల్లో పెరిగారు. ఇటీవల వారిలో ఒకరు సరదాగా చేయించుకున్న ఒక డీఎన్ఏ పరీక్షతో తాము పెరిగిన తల్లిదండ్రులు తమ కన్నవారు కారని, తాము పుట్టినప్పుడే మారిపోయామని తేలింది. తమ జీవితాలను తలకిందులు చేసిన ఆసుపత్రి నిర్లక్ష్యంపై ప్రస్తుతం ఆ కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ కథ నార్త్ డకోటాలోని గ్రాఫ్టన్ నగరంలో ఉన్న యూనిటీ మెడికల్ సెంటర్ లో 1988 జనవరి 26న ప్రారంభమైంది. ఆ రోజు ఆ ఆసుపత్రిలో ఇద్దరు బాలురు జన్మించారు. వారిలో ఒకరికి కైల్ బైలిన్ అని, మరొకరికి జెరెమీ మోరిసన్ అని కుటుంబాలు నామకరణం చేశాయి. అయితే, ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసే సమయంలో సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లల అదలాబదలి జరిగింది. ఒకరి బిడ్డను మరొకరికి ఇచ్చి ఆసుపత్రి వారు పంపించేశారు. ఆసుపత్రి కట్టిన ఐడెంటిఫికేషన్ బ్యాండ్పై కూడా తప్పు పేరు ఉండటంతో ఎవరికీ ఎలాంటి అనుమానం రాలేదు.
ముప్పై ఆరేళ్ల పాటు ఇద్దరు పిల్లలు వేర్వేరు ఇళ్లలో, వేర్వేరు వాతావరణంలో పెరిగి పెద్దయ్యారు, చదువుకున్నారు, ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. అయితే జెరెమీ మోరిసన్కు చిన్నప్పటి నుండి ఒక అనుమానం ఉండేది. తన కుటుంబంలో అందరి జుట్టు నల్లగా ఉంటే, తన జుట్టు మాత్రం గోల్డెన్ కలర్లో ఉండేది. తన పోలికలు కూడా కుటుంబంతో కలవకపోవడంతో తాను ఆ కుటుంబంలో కాస్త భిన్నంగా ఉన్నట్లు భావించేవాడు. కానీ దీని వెనుక ఇంత పెద్ద రహస్యం దాగి ఉంటుందని అతను ఎప్పుడూ ఊహించలేదు.
సుమారు రెండేళ్ల క్రితం, కైల్ బైలిన్ కేవలం ఒక ఉత్సుకతతో వంశపారంపర్య వివరాల కోసం డీఎన్ఏ పరీక్ష చేయించుకున్నాడు. ఆ రిపోర్ట్ చూడగానే అతని కాళ్ల కింద భూమి కదిలింది. అతనికి ఏమాత్రం పరిచయం లేని ఒక మహిళ అతని డీఎన్ఏ బంధువుగా చూపించింది. దీనిపై మరింత లోతుగా విచారించగా, చివరకు జెరెమీ మోరిసన్ కుటుంబంతో డీఎన్ఏ మ్యాచ్ అయ్యింది. ఆసుపత్రి రికార్డులను పరిశీలించగా.. ఆ రోజు పుట్టిన ఇద్దరు పిల్లలు మారిపోయారనే చేదు నిజం ప్రపంచానికి తెలిసింది.
నిజం తెలిసిన తర్వాత ఇద్దరు యువకులు తమ కన్నతల్లిదండ్రులను కలుసుకున్నారు. అయితే, 36 ఏళ్లు ఒకరి జీవితాన్ని మరొకరు జీవించినందున, ఈ కొత్త బంధాలను అంగీకరించడం మానసికంగా ఎంతో కష్టంగా మారింది. ఒకవేళ ఆ రోజే తాము మారకపోయి ఉంటే తమ జీవితం మరోలా ఉండేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘోర తప్పిదానికి బాధ్యులైన యూనిటీ మెడికల్ సెంటర్పై సదరు కుటుంబాలు కోర్టులో దావా వేశాయి. తమకు జరిగిన అన్యాయానికి పరిహారం కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆసుపత్రి యాజమాన్యం ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ కేసును కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించింది. ప్రసుత్తం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది.




