భూమిపై తీరం లేని ఏకైక సముద్రం.. ఎక్కడ మాయమైందంటూ అయోమయంలో శాస్త్రవేత్తలు..ఆ రహస్యం ఇదే!
ప్రపంచంలో సాధారణంగా ఏ సముద్రానికైనా లేదా నదికైనా అందమైన తీరం ఉంటుంది. కానీ, భూమిపై తీరం లేని ఏకైక సముద్రం ఒకటుంది. దీనికి ఎలాంటి భూభాగం లేదా సరిహద్దులు లేవు. నాలుగు శక్తివంతమైన సముద్ర ప్రవాహాలు దీని చుట్టూ తిరుగుతూ ఒక నీటి చక్రవ్యూహాన్ని ఏర్పరుస్తాయి. ఈ సముద్రంపై సార్గసమ్ అనే ఒక విచిత్రమైన సముద్రపు గడ్డి తేలుతూ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలకు ఇదొక పెద్ద రహస్యంగా, అంతుచిక్కని మిస్టరీగానే మిగిలింది. అదేంటో వివరంగా చూద్దాం..

మనం ఏ సముద్రం గురించి ఆలోచించినా, మన మనసులో మొదట మెదిలేది అలల హోరు, అందమైన ఇసుక తిన్నెలు, సముద్ర తీరం. కానీ, ఈ భూమిపై ఒక విచిత్రమైన సముద్రం ఉంది, దానికి అసలు ఒడ్డు, తీరమనేదే లేదు! వినడానికి ఇది ఏదో కల్పిత కథలా అనిపించినా, ఇది అక్షరాలా నిజం. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న ఈ వినూత్న సముద్రం పేరే సార్గస్సో సముద్రం. ఏ భూభాగంతోనూ సంబంధం లేకుండా కేవలం నీటి మధ్యలోనే ఉనికిని చాటుకుంటున్న ఈ సముద్రం, శతాబ్దాలుగా శాస్త్రవేత్తలకు, నావికులకు ఒక పెద్ద పజిల్ లా మారింది.
తీరం లేకుండా ఈ సముద్రం ఎలా ఏర్పడింది?
సాధారణంగా సముద్రాల సరిహద్దులను వాటి చుట్టూ ఉండే భూభాగాలు లేదా దేశాల తీరాలు నిర్ణయిస్తాయి. కానీ, సార్గస్సో సముద్రానికి భూమికి బదులుగా నాలుగు వైపులా ప్రవహించే నాలుగు శక్తివంతమైన సముద్ర ప్రవాహాలు సరిహద్దులుగా పనిచేస్తాయి. దీనికి పశ్చిమాన గల్ఫ్ స్ట్రీమ్, ఉత్తరాన నార్త్ అట్లాంటిక్ కరెంట్, తూర్పున కానరీ కరెంట్, దక్షిణాన నార్త్ అట్లాంటిక్ ఈక్వటోరియల్ కరెంట్ ప్రవహిస్తాయి. ఈ నాలుగు భిన్న దిశల ప్రవాహాలు కలిసి సముద్రం మధ్యలో ఒక పెద్ద నీటి వలయాన్ని సృష్టిస్తాయి. దీనివల్ల ఈ నాలుగు ప్రవాహాల మధ్య ఉన్న సార్గస్సో సముద్రపు నీరు ఎప్పుడూ అత్యంత ప్రశాంతంగా, గుండ్రంగా తిరుగుతూ ఉంటుంది.
అద్దంలా మెరిసే నీరు – గాల్లో తేలే జాలరి గడ్డి:
ఈ సముద్రం నీరు ఎంత స్వచ్ఛంగా, గాఢమైన నీలి రంగులో ఉంటుందంటే, దాదాపు 50 నుండి 60 మీటర్ల లోతు వరకు నీటి లోపల ఏముందో స్పష్టంగా చూడవచ్చు. పోర్చుగీస్ భాషలో సార్గస్సో అంటే ఒక రకమైన సముద్రపు గడ్డి అని అర్థం. ఈ సముద్ర ఉపరితలంపై సార్గసమ్ అనే గోధుమ రంగు సముద్రపు గడ్డి తివాచీలా మైదానాల కొద్దీ తేలుతూ ఉంటుంది. ఈ గడ్డికి భూమితో గానీ, సముద్ర గర్భంలో మట్టితో గానీ సంబంధం ఉండదు. ఇది నీటి పైనే పుట్టి, నీటి పైనే పెరుగుతుంది.
పురాతన కాలంలో నావికులు ఈ ప్రశాంతమైన నీరు, సముద్రపు గడ్డిని చూసి భయపడేవారు. ఇక్కడ చిక్కుకున్న ఓడలు ఎప్పటికీ బయటకు రాలేవని, ఇది మాయా సముద్రం అని కథలు చెప్పుకునేవారు. కానీ, ఆధునిక శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం, ఈ సముద్రం ఎన్నో అరుదైన చేపలు, పీతలు, తాబేళ్లకు ఒక సురక్షితమైన ఆవాసంగా, భూమి సముద్ర పర్యావరణ వ్యవస్థలో అత్యంత కీలకమైన భాగమని నిరూపితమైంది.




