Telangana: కన్నీరు మిగిల్చిన అకాల వానలు.. 5 రోజుల్లో 4.5 లక్షల ఎకరాల పంటలు నష్టం..

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం వానాకాలాన్ని తలపిస్తోంది. గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తోన్న అకాల వర్షాల దెబ్బకు 4.5 లక్షల ఎకరాల పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. కేవలం నెల రోజుల..

Follow us

|

Updated on: Apr 27, 2023 | 7:28 AM

తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం వానాకాలాన్ని తలపిస్తోంది. గత ఐదు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏకధాటిగా కురుస్తోన్న అకాల వర్షాల దెబ్బకు 4.5 లక్షల ఎకరాల పంటలకు నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేస్తోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు భారీ వర్షాలు కురవడంతో మొత్తం 9.5 లక్షల ఎకరాల్లో నష్టం తలెత్తినట్లు గుర్తించింది. ఒక్క వరి పంటే దాదాపు 3.5 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్నట్లు అంచనా. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ వరితోపాటు మామిడి, మొక్కజొన్న, నువ్వులు, పెసర, జొన్న, పొద్దు తిరుగుడు, బొప్పాయి, నిమ్మ, ఇతర పండ్ల తోటలు, కూరగాయల పంటలకూ భారీగానే నష్టం వాటిల్లినట్లు పేర్కొంది.

గత ఐదు రోజులుగా వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, వడగళ్ల కారణంగా ఎక్కువ నష్టం జరిగినట్లు తెల్పింది. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో పంట నష్టం జరిగింది. ఆ తర్వాత సూర్యాపేట, కరీంనగర్, జనగామ, నిజామాబాద్, ఆదిలాబాద్‌ జిల్లాల్లో పంట నష్టత తీవ్రత ఎక్కువగా ఉందని వ్యవసాయశాఖ నిర్ధారించింది. మరో 5 రోజుల పాటు ఇదే మాదిరి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గాలివానలు ఇలాగే కొనసాగితే ఇంకా నష్టం సంభవించే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై సర్వే నిర్వహిస్తున్నారు. కాగా గత నెల 17 నుంచి 22వ తేదీ వరకు కురిసిన వర్షాలతో 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు రైతు సంఘాలు అంచనా వేశాయి. ఐతే కేవలం 2.28 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట నష్టం జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు తేల్చాయి. వాటిల్లో 1.51 లక్షల ఎకరాలకు నష్టపరిహారంగా రూ.151 కోట్లు కేటాయించింది.

ఈ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. రాష్ట్రంలో ఇంతగా పంట నష్టం జరిగినా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని, క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వానల తర్వాత పంటల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శాస్త్రవేత్తలతో అవగాహన కల్పించే ప్రయత్నమూ చేయడం లేదని వ్యవసాయ నిపుణులు మండిపడుతున్నారు. రైతులు, రైతు ప్రతినిధుల విజ్ఞప్తులు అందుకునేవారు కూడా కొరవయ్యారని విమర్శలు వస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.