AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నాగార్జునసాగర్ డ్యాం వద్ద టెన్షన్‌.. టెన్షన్..! మూతపడిన డ్యామ్ కంట్రోల్ రూమ్..

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నెల రోజులుగా నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ వివాదం కొలిక్కిరావడం లేదు. నాగార్జునసాగర్ డ్యాం.. ఇరు రాష్ట్రాల ఆధీనంలో ఉండడంతో నిర్వహణ పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఎవరివనేది నేటికీ స్పష్టత లేని పరిస్థితి. దీంతో నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ పనులు అస్తవ్యస్తంగా మారాయి..

Telangana: నాగార్జునసాగర్ డ్యాం వద్ద టెన్షన్‌.. టెన్షన్..! మూతపడిన డ్యామ్ కంట్రోల్ రూమ్..
Nagarjunasagar Project
M Revan Reddy
| Edited By: |

Updated on: Jan 02, 2024 | 7:18 AM

Share

నల్గొండ, జనవరి 2: తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. నెల రోజులుగా నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ వివాదం కొలిక్కిరావడం లేదు. నాగార్జునసాగర్ డ్యాం.. ఇరు రాష్ట్రాల ఆధీనంలో ఉండడంతో నిర్వహణ పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఎవరివనేది నేటికీ స్పష్టత లేని పరిస్థితి. దీంతో నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ పనులు అస్తవ్యస్తంగా మారాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నాగార్జున సాగర్ కేంద్రంగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం తెరపైకి వచ్చింది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ (KRMB)కు ఇండెంట్‌ ఇస్తున్నా.. నీటి విడుదల విషయంలో తెలంగాణను పదేపదే అడగాల్సి వస్తోందని, తమ భూ భాగం వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్‌ చేసుకుంటామని ఏపీ ప్రకటించింది. గత ఏడాది నవంబర్ 28వ తేదీ అర్ధరాత్రి కుడి కాల్వ నుంచి 5వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతోపాటు 13వ నెంబర్ గేటు నుంచి ఏపీ వైపు ఉన్న ప్రాజెక్ట్ ను ముళ్ళ కంచె వేసి పోలీసు బలగాలతో ఏపీ తమ ఆధీనంలోకి తీసుకుంది. దీంతో డ్యాంకు ఇరువైపులా ఏపీ, తెలంగాణ పోలీసులు మోహరించడంతో నాగార్జున సాగర్ డ్యామ్ పై హైటెన్షన్ వాతావరణం కొనసాగింది.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద నాలుగు రోజులపాటు కొనసాగిన ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర హోం శాఖ, కేంద్ర జలశక్తి శాఖలు జోక్యం చేసుకున్నాయి. కేంద్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఏపీ, తెలంగాణ చీప్‌ సెక్రటరీలు, డీజీపీలతో వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితిని ఆరా తీశారు. తెలంగాణ ఫిర్యాదు మేరకు వెంటనే నీటి విడుదల ఆపేయాలని ఏపీని KRMB ఆదేశించింది. నవంబరు 28కి ముందు ఉన్న పరిస్థితి కొనసాగిస్తూ, డ్యామ్‌ నిర్వహణను KRMBకి అప్పగించడంతో పాటు CRPF దళాల పర్యవేక్షణకు అప్పగించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. ఈ ప్రతిపాదనకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అంగీకరించాయి. ప్రస్తుతం డ్యాం మొత్తం సీఆర్పీఎఫ్ ఆధీనంలో ఉండడంతో అంతా ప్రశాంతంగా ఉన్నా తెలంగాణ నీటిపారుదల శాఖ ఆధికారులు 13వ నెంబరు గేటు వరకు మాత్రమే వెళ్తుండగా ఏపీ నీటిపారుదల శాఖాధికారులు కుడి వైపు నుంచి 13వ నెంబర్ గేటు వరకు మాత్రమే వస్తున్నారు.

మూత పడిన కంట్రోల్ రూమ్…

నాగార్జునసాగర్ ప్రాజెక్టు CRPF దళాల ఆధీనంలో ఉన్నప్పటికీ… 13వ గేటు నుంచి ఏపీ వైపు ఉన్న ప్రాజెక్టు వద్దకు ఎన్నెస్పీ ఉద్యోగులను ఏపీ అనుమతించడం లేదు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 26వ గేటు తర్వాత కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ సాగర్ జలాశయానికి సంబంధించిన నీటి రాకపోకలను, కుడి, ఎడమ కాల్వకు నీటి విడుదల వివరాలను ప్రతిరోజు నమోదు చేస్తారు. డీఈ స్థాయి అధికారి, ఏఈ, ఇతర సిబ్బంది 24 గంటలు విధినిర్వహణలో ఉండి నీటి పరిస్థితులను రికార్డు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అయితే ప్రస్తుతం కంట్రోల్ రూమ్ ఏపీ ఆధీనంలో ఉండడంతో ఎటువంటి కార్యకలాపాలు లేకుండా నెల రోజులుగా మూతపడింది. అప్పటి నుంచి డ్యాం అధికారులు జలాశయ నీటి వివరాలను రికార్డు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్పీ సిబ్బంది డ్యాం ఎడమవైపు ఉన్న లిఫ్టు గదిలో ఉంటూ నీటి వివరాలను నమోదు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అస్తవ్యస్తంగా మారిన డ్యామ్ నిర్వహణ పనులు..

నాగార్జునసాగర్ కేంద్రంగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం కొలిక్కి రాకపోవడంతో డ్యాం నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతోంది. ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతలు ఎవరివనేది నేటికీ స్పష్టత లేకపోవడంతో డ్యామ్ నిర్మాణ పనులు అస్తవ్యస్తంగా మారాయి. గేట్లు, రోప్‌లకు గ్రీజ్‌ పూయడం, జనరేటర్లు, గేట్లు తెరిచేందుకు ఉపయోగించే ట్రాక్‌ నిర్వహణ.. వంటి పలు ప్రొటోకాల్స్‌ను ప్రాజెక్టు ఇంజినీర్లు ఎప్పటికప్పుడు చేపడుతుంటారు. దీంతో ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా ఎప్పటికప్పుడు చేపట్టాల్సిన పనులు ముందుకు సాగడం లేదు. సాధారణంగా జనవరి నుంచి జూలై వరకు ప్రతి ఏటా వానాకాలంలో ఎగువ నుంచి వచ్చే నీటినిలువకు ప్రాజెక్టును సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం తెలంగాణ వైపు మాత్రమే ఈ పనులు కొనసాగుతున్నాయి.

నీటి పారుదల శాఖకు ఎన్‌ఎస్పీ ఇంజనీర్ల లేఖ..

రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం.. నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం, శ్రీశైలం ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం నిర్వహణ బాధ్యతలను చూసుకోవాల్సి ఉంది. కేంద్ర హోం శాఖ సూచించినట్లుగా 2023 నవంబరు 28వ తేదీకి ముందున్న యథాతథ స్థితిని కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది. డ్యాం నిర్వహణ ప్రోటో కాల్స్ కోసం ప్రాజెక్టును వెంటనే తమకు అప్పగించాలని కోరుతూ KRMBకి తెలంగాణ వరుసగా లేఖలు రాసింది. తాజాగా ఎన్నెస్పీ అధికారులు తెలంగాణ నీటిపారుదల శాఖకు లేఖ రాశారు. రోజువారీ నీటి రాకపోకలు, కుడి, ఎడమ కాల్వకు నీటి విడుదల వివరాలు, విద్యుదుత్పత్తికి సంబంధించిన డేటా, రెండువైపులా ఉన్న కాలువలకు లీకేజీలతో నష్టం తదితర వివరాలను నమోదు చేయాల్సి ఉందని ఎన్‌ఎస్పీ అధికారులు పేర్కొన్నారు. తమ సిబ్బందిని ఏపీ వైపు అనుమతించకపోవడంతో ఏపీ వైపు సమాచార సేకరణ వీలు కావడంలేదని అధికారులు లేఖలో తెలిపారు. తమ అధీనంలో ఉన్న 13వ గేటు వరకే ప్రాజెక్టు నిర్వహణ పనులు చేస్తున్నామని, డ్యాం మొత్తం అప్పగిస్తే తప్ప పూర్తి చేయలేమని లేఖలో పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us