Telangana: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ డాక్టర్ ప్రైవేట్ ప్రాక్టీస్పై నిషేధం
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసుపై బ్యాన్ విధించింది.

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ వైద్యులు ప్రవేట్ ప్రాక్టీస్పై నిషేధం విధించింది. ఇందుకోసం మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనలను సవరించింది. ఈ మేరకు వైద్యారోగ్య ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు మాత్రమే ప్రైవేట్ ప్రాక్టీస్ బ్యాన్ చేసింది. ఇప్పటికే విధుల్లో ఉన్న ప్రభుత్వ డాక్టర్లకు ప్రస్తుతానికి ఈ నిబంధనలు వర్తించవని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. వైద్యులు విధులుకు ఆలస్యంగా రావడం.. శ్రద్ధగా పని చేయకపోవడం, దీర్ఘకాలంపాటు సెలవులు పెడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పేద ప్రజలకు మేలైన వైద్యం అందించడానికే ఈ రూల్ తీసుకొచ్చామని తెలంగాణ DH శ్రీనివాసరావు తెలిపారు.
జూనియర్ డాక్టర్ల అసంతృప్తి
ఇటు మంత్రి హరీష్రావు తీరుపై జూనియర్ డాక్టర్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చిన్నదానికీ సస్పెన్షన్స్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో మందుల కొరతని పట్టించుకోరా ? అని నిలదీస్తున్నారు. మెడిసిన్స్ అందుబాటులో లేకనే బయటకు చీటీలు రాస్తే తప్పెలా అవుతుందన్నది వారి వెర్షన్. అలాంటి వాటికీ సస్పెన్షన్లు చేస్తూ పోతే ఎలా అని జూడాలు ప్రశ్నిస్తున్నారు. మెడిసిన్.. అందుబాటులో ఉన్నా బయటకు పంపే వారిపై మాత్రమే చర్యలు తీసుకోండని కోరుతున్నారు. ప్రజాప్రతినిధులు సర్కారు దవాఖానాల్లో చికిత్స తీసుకుంటేనే ప్రశ్నించే అర్హత ఉంటుందని బలంగా చెబుతున్నారు. ప్రభుత్వాసుత్రుల్లో లోపాలు మంత్రి హరీష్ రావుకూ తెలుసని.. వాటిని సరిదిద్దకుండా ఆస్పత్రులను మెరుగుపరచడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అసలు కనీస దర్యాప్తు లేకుండా సస్పెన్షన్లు ఎంతవరకూ సమంజసమని ఫైరవుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




